హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ దర్యాప్తు సంస్థ

प्रविष्टि तिथि: 02 DEC 2025 3:23PM by PIB Hyderabad

ముంబయి నగరంలో 26/11 ఉగ్రవాద దాడి అనంతరం ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చట్టం-2008’ కింద దేశంలో ఉగ్రవాద నిరోధక చట్టం అమలు కేంద్రీయ సంస్థగా జాతీయ దర్యాపు సంస్థ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ-ఎన్‌ఐఏ) ఏర్పాటైంది.

‘ఎన్‌ఐఏ చట్టం-2008’లోని షెడ్యూలులో పేర్కొన్న మేరకు- భారత సార్వభౌమాధికారం, భద్రత-సమగ్రత, అంతర్గత భద్రత, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, అంతర్జాతీయ ఒప్పందాల సంబంధిత అంశాలపై దుష్ప్రభావం చూపే నేరాలమీద ఈ సంస్థ దర్యాప్తు, విచారణ చేపడుతుంది.

జాతీయ భద్రతను ప్రభావితం చేసే లేదా ముప్పు తెచ్చే నేరాల నివారణ-దర్యాప్తు-విచారణ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించగల అంతర్జాతీయ దర్యాప్తు సంస్థగా ‘ఎన్‌ఐఏ’ను రూపుదిద్దే లక్ష్యంతో సంస్థ సామర్థ్యం పెంపు దిశగా కింది చర్యలు, కార్యక్రమాలు అమలులోకి వచ్చాయి:

(i)         భారత్‌ వెలుపల భారత పౌరుల ప్రమేయం లేదా దేశ ప్రయోజనాల సంబంధిత షెడ్యూల్డ్ నేరాల దర్యాప్తు దిశగా ప్రభుత్వం ‘ఎన్‌ఐఏ (సవరణ) చట్టం-2019’ ద్వారా సంస్థకు పూర్తి అధికారమిచ్చింది.

(ii)        పేలుడు పదార్థాల చట్టం-1908తోపాటు మానవ అక్రమ రవాణా, సైబర్ ఉగ్రవాదం, ఆయుధాల చట్టం-1959 సంబంధిత నేరాల దర్యాప్తు దిశగా ‘ఎన్‌ఐఏ’ అధికార పరిధిని విస్తరించారు.

(iii)       దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాన కార్యాలయంతోపాటు 2 జోనల్‌ (గువహటి, జమ్మూ) కార్యాలయాలు సహా వివిధ ప్రాంతాలలో 21 శాఖా కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

(iv)      ప్రస్తుతం ‘ఎన్‌ఐఏ’ కోసం మొత్తం 1901 పోస్టులు మంజూరు చేయగా, వీటిలో గడచిన ఐదేళ్లలోనే 769 పోస్టులు మంజూరయ్యాయి.

(v)        ‘ఎన్‌ఐఏ’ కోసం దేశవ్యాప్తంగా 52 ప్రత్యేక కోర్టులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో రాంచీ, జమ్మూ, ముంబయిలలోని మూడేసి ప్రత్యేక కోర్టులను ‘ఎన్‌ఐఏ’ దర్యాప్తు చేసే షెడ్యూల్డ్ నేరాల విచారణకు కేటాయించారు.

(vi)      బిగ్ డేటా అనలిటిక్స్‌, వివిధ దర్యాప్తు ప్రక్రియల ఆటోమేషన్-డిజిటలీకరణ, పర్యవేక్షణ బలోపేతం సహా సామర్థ్యం, స్థిరత్వం, జవాబుదారీతనం పెంపు విధానాల సౌలభ్యం కల్పిస్తూ ‘ఎన్‌ఐఏ’ పరిధిలో ‘నేషనల్ టెర్రర్ డేటా ఫ్యూజన్ అండ్‌ అనాలిసిస్ సెంటర్’  (ఎన్‌టీడీఎఫ్‌ఏసీ) ఏర్పాటైంది.

(vii)     మరోవైపు ‘ఎన్‌ఐఏ’ కింద 2018 జనవరిలో ‘ఐఎస్‌ఐఎస్‌ ఇన్వెస్టిగేషన్ రీసెర్చ్ సెల్’  (ఐఐఆర్‌సీ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అటుపైన ఇతర ఉగ్రవాద నేరాలకూ దీన్ని విస్తరించి, ‘కౌంటర్ టెర్రరిజం రీసెర్చ్ సెల్’ (సీటీఆర్‌టీసీ)గా పేరు మార్చింది.

(viii)    ‘యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ డివిజన్’, ‘యాంటీ సైబర్ టెర్రరిజం డివిజన్’, ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సెల్’, ‘ఫైనాన్షియల్ అనాలిసిస్ యూనిట్’ వంటి ప్రత్యేక విభాగాలు సహా న్యాయ నిపుణులతో ఒక ప్రత్యేక సెల్ కూడా ‘ఎన్‌ఐఏ’లో ఏర్పాటైంది.

(ix)      విదేశీ అధికార పరిధి సంబంధిత నేరాల దర్యాప్తులో భారత సామర్థ్యం సంస్థాగతీకరణ దిశగా 2024లో ప్రత్యేక ‘విదేశీ దర్యాప్తు అభ్యర్థన యూనిట్’ను ‘ఎన్‌ఐఏ’లో ఏర్పాటు చేశారు.

(x)        ఉగ్రవాద సంస్థలకు నిధులు, అధిక నాణ్యత గల ‘నకిలీ భారత కరెన్సీ నోట్లు’ సంబంధిత కేసుల దర్యాప్తు నిమిత్తం ‘ఎన్‌ఐఏ’ను కేంద్ర స్థాయి నోడల్ సంస్థగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశాలపై నిర్దిష్ట, నిశిత దర్యాప్తు లక్ష్యంగా ‘ఉగ్రవాద నిధులు-నకిలీ కరెన్సీ దర్యాప్తు సెల్’ ఏర్పాటైంది.

(xi)      ప్రపంచ దేశాలతో సహకారం దిశగా 2022లో ‘నో మనీ ఫర్ టెర్రర్’ ఇతివృత్తంగా మంత్రుల స్థాయి 3వ సమావేశాన్ని ‘ఎన్‌ఐఏ’ నిర్వహించింది. ఇందులో 78 దేశాలతోపాటు 16 బహుళపక్ష సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

(xii)     గడచిన ఐదేళ్లలో- తమ అధికారులతోపాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులు, కేంద్ర పోలీసు సంస్థలు, సాయుధ పోలీసు దళాల సిబ్బంది ‘సామర్థ్య వికాసం శిక్షణ కార్యక్రమాల’ను విదేశీ సంస్థల సహకారంతో ‘ఎన్‌ఐఏ’ నిర్వహించింది. అలాగే మూడేళ్లుగా విదేశీ అధికారుల కోసం కూడా ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.

(xiii)    ఫోరెన్సిక్ నైపుణ్య రంగంలో ‘ఎన్‌ఐఏ’ అధికారుల సామర్థ్యం పెంపు లక్ష్యంగా ‘ఎన్‌ఐఏ’,  ‘నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ’ మధ్య అవగాహన ఒప్పందానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీనిపై ఉభయపక్షాలు 2025 మార్చిలో సంతకం చేశాయి.

(xiv)   భారత నకిలీ కరెన్సీ నోట్ల సంబంధిత సమాచార ఆదానప్రదానం కోసం భారత్‌, బంగ్లాదేశ్ మధ్య ఒక సంయుక్త కార్యాచరణ బృందం ఏర్పాటైంది. నకిలీ నోట్ల దొంగ రవాణా నిరోధానికి కేంద్ర-రాష్ట్ర స్థాయులలో వివిధ ‘ఎల్‌ఈఏ’లతోపాటు బంగ్లాదేశ్, నేపాల్ సహా పొరుగు దేశాల పోలీసు అధికారుల కోసం సామర్థ్య వికాస కార్యక్రమాలను ‘ఎన్‌ఐఏ’  నిర్వహించింది.

(xv)     జాతీయ భద్రతను ప్రభావితం చేసే/ముప్పు కలిగించే నేరాల నివారణ, దర్యాప్తు, విచారణలో ‘ఎన్‌ఐఏ’ సామర్థ్య బలోపేతం సహా ప్రపంచ ఉత్తమ ఉగ్రవాద నిరోధక సంస్థల పనితీరు పారామితులతో సమానంగా సామర్థ్యాల ప్రమాణీకరణకు కృషి కొనసాగింది.

దేశంలో ఓ కీలక దర్యాప్తు సంస్థగా ‘ఎన్‌ఐఏ’ను తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ఈ చర్యలు, కార్యక్రమాలన్నిటి ఫలితంగా సంస్థ సామర్థ్యం గణనీయంగా మెరుగుపడింది.

ఆ మేరకు ఇది తన విధులను సమర్థంగా, ప్రభావవంతంగా నిర్వర్తిస్తోంది. తద్వారా ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ప్రముఖ దర్యాప్తు సంస్థగా అవతరించింది. ఈ సంస్థ దర్యాప్తు చేసిన మొత్తం (ఆరంభం నుంచి నమోదు చేసిన 692) కేసులకుగాను 92.44 శాతం శిక్ష విధించే తీర్పులతో 172 కేసులు పరిష్కారమయ్యాయి.

దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రత, భద్రతలకు భంగం కలిగించే చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపే (జీరో టాలరెన్స్) విధానాన్ని అనుసరిస్తుంది.

చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం-1967 నిబంధనల ప్రకారం అటువంటి కార్యకలాపాలలో పాల్గొన్నట్లు తేలిన వివిధ సంస్థలపై ప్రభుత్వం సదా కఠిన చర్యలు చేపట్టింది.

మొత్తంమీద గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం 23 సంస్థలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించింది. ఈ జాబితాను ‘అనుబంధం-ఎ’లో చూడవచ్చు.

అనుబంధం-ఎ

వ.సం॥

చట్టవిరుద్ధ సంస్థ పేరు

1.

స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)

2.

యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ఉల్ఫా)

3.

ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ (ఏటీటీఎఫ్)

4.

మీటీ తీవ్రవాద సంస్థలు:

(i)       పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ), దాని రాజకీయ విభాగం, రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ (ఆర్పీఎఫ్)

(ii)      యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యూఎన్ఎల్ఎఫ్), దాని సాయుధ విభాగం మణిపూర్ పీపుల్స్ ఆర్మీ (ఎంపీఏ)

(iii)     పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్ (పీఆర్ఈపీఏకే), దాని సాయుధ విభాగం 'రెడ్ ఆర్మీ'

(iv)    కాంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (కేసీపీ), దాని సాయుధ విభాగం.. దీన్ని కూడా 'రెడ్ ఆర్మీ’ అంటారు.

(v)     కాంగ్లీ యాయోల్ కన్బా లుప్ (కేవైకేఎల్)

(vi)    కోఆర్డినేషన్ కమిటీ (కోర్‌కామ్)

(vii)   సోషలిస్ట్ యూనిటీ ఫర్‌ అలయెన్స్‌ ఆఫ్‌ కాంగ్లీపాక్ (ఏఎస్యూకే)

5.

నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఎన్‌ఎల్‌ఎఫ్‌టీ)

6.

హిన్నీవ్ట్రెప్ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్ (హెచ్‌ఎన్‌ఎల్‌సీ)

7.

లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ)

8.

నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఖప్లాంగ్) [ఎన్‌ఎస్‌సీఎన్‌ (కె)]

9.

ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్‌ఎఫ్‌)

10.

జమాత్-ఇ-ఇస్లామి (జేఈఐ), జమ్మూకాశ్మీర్

11.

జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (మొహమ్మద్. యాసిన్ మాలిక్ వర్గం) (జేకేఎల్‌ఎఫ్‌-వై)

12

సిఖ్స్‌ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే)

13.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ), దాని సహ లేదా అనుబంధ సంస్థలు లేదా రిహాబ్ ఇండియా ఫౌండేషన్ (ఆర్‌ఐఎఫ్‌), క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్‌ఐ), ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ (ఏఐఐసీ), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ (ఎన్‌సీహెచ్‌ఆర్‌ఓ), నేషనల్ విమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్, రిహాబ్ ఫౌండేషన్, కేరళ.

14.

జమ్మూకాశ్మీర్ డెమోక్రటిక్ ఫ్రీడమ్ పార్టీ (జేకేడీఎఫ్‌పీ)

15.

ముస్లిం లీగ్ జమ్మూకాశ్మీర్ (మసరత్ ఆలం వర్గం)/(ఎంఎల్‌జేకే-ఎంఏ)

16.

తెహ్రీక్-ఎ-హురియత్, జమ్మూకాశ్మీర్ (టీఈహెచ్‌)

17.

ముస్లిం కాన్ఫరెన్స్ జమ్మూకాశ్మీర్ (భట్ వర్గం) (ఎంసీజేకే-బి)

18.

ముస్లిం కాన్ఫరెన్స్ జమ్మూకాశ్మీర్ (సమ్జీ వర్గం) (ఎంసీజేకే-ఎస్‌)

19.

జమ్మూకాశ్మీర్ నేషనల్ ఫ్రంట్ (జేకేఎన్‌ఎఫ్‌)

20.

జమ్మూకాశ్మీర్ పీపుల్స్ ఫ్రీడమ్ లీగ్ (జేకేపీఎఫ్‌ఎల్‌)

21.

జమ్మూకాశ్మీర్ పీపుల్స్ లీగ్ (జేకేపీఎల్‌)లో 4 వర్గాలు: జేకేపీఎల్‌ (ముక్తార్ అహ్మద్ వాజా), జేకేపీఎల్‌ (బషీర్ అహ్మద్ టోటా), జేకేపీఎల్‌ (గులాం మొహమ్మద్ ఖాన్, సోపోరి), యాకూబ్ షేక్ (అజీజ్ షేక్) నేతృత్వంలోని జేకేపీఎల్‌

22.

జమ్మూకాశ్మీర్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (జేకేఐఎం)

23.

అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ)

హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్‌ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.


(रिलीज़ आईडी: 2197934) आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Tamil