రక్షణ మంత్రిత్వ శాఖ
కౌలాలంపూర్లో 12వ ఏడీఎంఎం-ప్లస్ నిర్వహణ సందర్భంగా రక్షణ మంత్రి, అమెరికా రక్షణ మంత్రిల భేటీ అమెరికా, భారత్ విస్తృత రక్షణ భాగస్వామ్యం... 10 సంవత్సరాల ప్రణాళికా పత్రంపై సంతకాలు
భారత్-అమెరికా సమగ్ర రక్షణ సంబంధాలకు విధానపరమైన దిశను అందించనున్న ప్రణాళిక..
నవ దశాబ్దికి నాందీ ప్రస్తావన: శ్రీ రాజ్నాథ్ సింగ్
‘‘భారత్-అమెరికా సంబంధాలకు మూల స్తంభంగా రక్షణ రంగం’’
రక్షణ సహకారంలో అమెరికాకు ప్రాధాన్య దేశంగా భారత్ ..
స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మేం భారత్తో కలిసి పని చేస్తాం: పీటర్ హెగ్సెత్
Posted On:
31 OCT 2025 3:53PM by PIB Hyderabad
పన్నెండో ఆసియాన్ రక్షణ శాఖ మంత్రుల సమావేశం- ప్లస్ (ఏడీఎంఎం-ప్లస్)ను మలేసియాలోని కౌలాలంపూర్లో ఈ రోజు నిర్వహించిన సందర్భంగా, అమెరికా రక్షణ శాఖ మంత్రి శ్రీ పీటర్ హెగ్సెత్ను భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ కలుసుకున్నారు. ఇరువురి సమావేశం ఫలప్రదంగా ముగిసింది. తరువాత, ప్రతినిధి వర్గం స్థాయి చర్చలనూ నిర్వహించారు.

రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారం జోరందుకోవడం సంతోషాన్ని కలిగిస్తోందని నేతలిద్దరూ అన్నారు. రెండు పక్షాలకూ ప్రయోజనాలు సిద్ధించేటట్లు భాగస్వామ్యాన్ని అన్ని విధాలా మరింత ముందుకు తీసుకు పోదామంటూ నిబద్ధతను పునరుద్ఘాటించారు. వారు రక్షణ రంగంలో వర్తమాన ముఖ్య విషయాలతో పాటు సవాళ్లను సమీక్షించారు. రక్షణ రంగ పరిశ్రమల మధ్యా, సాంకేతిక సహకారం విషయంలో ప్రధానమైన కొన్ని ప్రాజెక్టులపై చర్చించారు.
రక్షణ రంగ సహకారంలో అమెరికాకు భారత్ ప్రాధాన్య దేశమని శ్రీ పీటర్ హెగ్సెత్ పునరుద్ఘాటించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం స్వేచ్ఛాయుతంగా, ఆంక్షల బారిన పడకుండా మనుగడలో ఉండేటట్లు చూసేందుకు కలిసి పనిచేయడానికి ఇరుపక్షాలూ కట్టుబడి ఉన్నాయని ఆయన అన్నారు.
సమావేశం ముగిశాక, ‘‘అమెరికా, భారత్ల మధ్య రక్షణ భాగస్వామ్యంతో ముడిపెట్టిన 10 సంవత్సరాల ప్రణాళిక’’ పత్రంపై ఇద్దరు నేతలూ సంతకాలు చేశారు. ఇప్పటికే బలంగా ఉన్న రక్షణ రంగ భాగస్వామ్యంలో ఇది ఒక కొత్త యుగానికి నాంది పలుకుతుంది. 2025 ప్రణాళికా పత్రం రాబోయే 10 సంవత్సరాల కాలానికి పైగా భాగస్వామ్యంలో ఓ నూతన అధ్యాయాన్ని సూచిస్తుంది. రక్షణ సహకారాన్ని విస్తరించడానికి ఒక ఏకీకృత దృష్టి కోణాన్నీ, విధాన పరమైన దిశను కూడా అందించాలన్నదే ఈ ప్రయత్నాల ఉద్దేశం.

ప్రణాళిక పత్రం భారత్-యూఎస్ రక్షణ రంగ సంబంధాలకంతటికీ విధాన పరమైన మార్గనిర్దేశాన్ని అందించగలదన్న విశ్వాసాన్ని రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఆయన ఒక సందేశాన్ని రాశారు. ‘‘వ్యూహాత్మక బంధం గాఢతరం అవుతోందనడానికి ఇది ఒక సంకేతం. భాగస్వామ్యంలో ఒక నూతన దశాబ్దానికి ఇది నాంది పలుకుతుంది. మన ద్వైపాక్షిక సంబంధాల్లో రక్షణ రంగం ఇక మీదట కూడా ప్రధాన అంశంగా నిలుస్తుంది. మన భాగస్వామ్యం ఇండో-పసిఫిక్ ప్రాంతం స్వేచ్ఛాయుతంగా, ఆంక్షలకు తావు లేనిదిగా, నియమాలకు కట్టుబడేదిగా ఉండాలంటే మన భాగస్వామ్యం ఎంతో కీలకం’’ అని తన సందేశంలో శ్రీ రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
శ్రీ పీటర్ హెగ్సెత్ తనవంతుగా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, తాజా ప్రణాళిక పత్రం ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోతుందనీ, ఇది ప్రాంతీయ స్థిరత్వానికీ, శక్తికీ ఆధారభూతంగా ఉంటుందనీ పేర్కొన్నారు. ‘‘మేం మా సమన్వయాన్నీ, సమాచార పంపిణీనీ, సాంకేతిక సహకారాన్నీ ఇప్పటి కన్నా మరింత పెంపొందించుకుంటున్నాం. మా రక్షణ సంబంధాలు ఇంత బలంగా ఇదివరకెప్పడూ లేవు’’ అని ఆయన రాశారు.
సైన్య విన్యాసాలు, కార్యకలాపాలు, సమాచారాన్ని ఒక పక్షానికి మరో పక్షం ఇచ్చి పుచ్చుకోవడం, భావసారూప్య ప్రాంతీయ భాగస్వామ్య దేశాలకూ, ప్రపంచ భాగస్వామ్య దేశాలకూ సహకరించడం, రక్షణ రంగ పరిశ్రమలు, సైన్స్, టెక్నాలజీ, రక్షణ సమన్వయ యంత్రాంగాల ద్వారా తమ రక్షణ సంబంధాల్ని విస్తరించుకోవడాన్ని భారత్, అమెరికా ఇక ముందు కూడా కొనసాగిస్తాయి.
***
(Release ID: 2185546)
Visitor Counter : 4