కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                    
                    
                        లాభదాయకత, అభివృద్ధిల బాటలో బీఎస్ఎన్ఎల్ ముందుకు సాగిపోయేందుకు   మార్గసూచీని సిద్ధం చేసిన శ్రీ జ్యోతిరాదిత్య సింధియా
                    
                    
                        
బీఎస్ఎన్ఎల్కు 2025–26 ఆర్థిక  సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రూ.11,134 కోట్ల ఆదాయం.. 
పూర్తి ఏడాదికి రూ.27,500 కోట్ల ఆదాయ లక్ష్యం
‘‘కార్యనిర్వహణ సంస్కృతి’’తో పాటు నాణ్యమైన సేవలపై దృష్టి సారించాలని శ్రీ సింధియా పిలుపు
                    
                
                
                    Posted On:
                30 OCT 2025 4:29PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                




భారత్ సంచార్ నిగమ్ (బీఎస్ఎన్ఎల్) వ్యూహాత్మక సమీక్ష, ప్రణాళిక రచనల రెండో సమావేశాన్ని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈ రోజు నిర్వహించారు. 2025–26కు సంబంధించిన ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా సంస్థకున్న 28 సర్కిళ్ల చీఫ్ జనరల్ మేనేజర్లు (సీజీఎంలు) పాల్గొన్నారు.
బీఎస్ఎన్ఎల్  2024–25 ఆర్థిక  సంవత్సరంలో వరుసగా రెండు త్రైమాసికాల్లో ఇదివరకెన్నడూ ఎరుగని స్థాయిలో లాభాలను ఆర్జించడంతో పాటు, 2025–26 ఆర్థిక  సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనూ బలమైన పనితీరును కనబరిచిన నేపథ్యంలో సంస్థ లాభదాయకతను నిలబెట్టుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి నాలుగు గంటల పాటు వ్యూహాత్మకంగా సమీక్షించారు. రెండో త్రైమాసికంలో రాబడి  అంచనాలో 93 శాతం ఫలితాలను సాధించి, సుమారు రూ.5,347 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినందుకూ, తొలి ఆరు నెలల కాలానికి మొత్తం రూ.11,134 కోట్ల రాబడిని సాధించడంలో చక్కని తోడ్పాటును అందించినందుకూ నాయకుల బృందాన్ని శ్రీ సింధియా ప్రశంసించారు.  2024-25 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రాబడి లక్ష్యం రూ.25,000 కోట్లుగా ఉంటే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రాబడి లక్ష్యాన్ని రూ.27,500 కోట్లుగా నిర్దేశించుకొన్నట్లు ఆయన గుర్తు చేశారు. ఇది సంస్థ నిర్వహణ సామర్థ్యానికీ, మార్కెట్లో సంస్థ కనబరుస్తున్న పనితీరుకూ ఒక గీటురాయిగా నిలుస్తోందన్నారు.
 ‘‘జీవనంలో ప్రతిదీ మనం నడుచుకొనే విధానంపై ఆధారపడి ఉంటుంది. మరి బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్లే సంస్థ కార్యాచరణకు రథ సారథులుగా ఉన్నారు. మీ మీ సర్కిళ్ల పరిధుల్లో మార్పునకు మార్గదర్శులు మీరే’’ అని మంత్రి అన్నారు. సేవల నాణ్యత (క్యూఓఎస్)పై రోజువారీ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీ సింధియా స్పష్టం చేశారు. ఇది సంస్థ ఎంతమాత్రం రాజీ పడకూడని తారకమంత్రమని ఆయన చెప్పారు. మరమ్మతుకు వెచ్చిస్తున్న సగటు కాలం, సేవల పునరుద్ధరణ కాలం, వినియోగదారుల్లో సంతృప్తి స్థాయి సూచీ వంటి కొలమానాలను నిశితంగా పర్యవేక్షించండని సీజీఎంలందరినీ ఆయన ఆదేశించారు. ‘‘ఏదయినా సరే, క్యూఓఎస్ తోనే సిద్ధిస్తుంది’’ అని మంత్రి ఉద్ఘాటించారు.
పోటీదారు సంస్థలతో పోల్చుకుంటూ సంస్థ బీటీఎస్, ఓటీఎల్ అప్టైమ్ పనితీరుల ప్రామాణికతను నిర్దేశించుకోవడం, లోటుపాటులను గుర్తించడంతో పాటు అన్ని సర్కిళ్లలో డిసెంబరు నాటికి బ్యాటరీ, మీడియా రీప్లేస్మెంట్ల విషయంలో తగిన జాగ్రత్తచర్యలను తీసుకోవాల్సిందిగా సర్కిళ్ల ముఖ్య బాధ్యులను మంత్రి కోరారు. ‘‘మనం గంటలు, రోజుల వారీగా పనులు చేస్తాం తప్ప నెలల వారీగా కాద’’ని ఆయన స్పష్టం చేశారు. ఖర్చు విషయంలో క్రమశిక్షణతో నడుచుకోవడం కూడా ముఖ్యమనీ, ఏ సర్కిల్ కూడా ప్రతికూల ఎబిటాను నివేదించకూడదనీ శ్రీ సింధియా పిలుపునిచ్చారు. బీఎస్ఎన్ఎల్ వివిధీకరణ లక్ష్యాలకు తగ్గట్టు కొత్త రాబడి మార్గాలను వెదకాలని మంత్రి చెప్తూ, ఈ విషయంలో సర్కిళ్లను ప్రోత్సహించారు.  కొత్త కొత్త సేవలను పరిచయం చేయడంతో పాటు ఇంతవరకు చేరుకోని సరికొత్త వినియోగదారు విభాగాల వద్దకు వెళ్లే విషయంలో తపాలా విభాగం వినూత్న ఆలోచనలు చేసిందని మంత్రి ఒక ఉదాహరణగా ప్రస్తావించారు.  
వచ్చే ఏడాది మొదట్లో మరో 6 కొత్త సేవలను ఇండియా పోస్ట్ ప్రారంభిస్తుంది.
పనితీరుకు సంబంధించి సమావేశంలో చర్చించిన కొన్ని ముఖ్యాంశాలు:
- ఏఆర్పీయూ 2025–26 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో (క్యూ1లో) రూ.81గా ఉండగా, క్యూ2లో రూ.92కు ఎగబాకింది.
- ఒక్కో ఉద్యోగి వంతు రాబడి సగటున రూ.9 లక్షలుగా ఉంది. ఒడిశా, మహారాష్ట్రలతో పాటు హర్యానా చాలా చక్కని ఫలితాలు సాధించాయి.
- కర్నాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్ (తూర్పు ప్రాంతం), జమ్మూకాశ్మీర్, అండమాన్ నికోబార్ సర్కిళ్ల సీజీఎంలను శ్రీ సింధియా సత్కరించారు.  ఇతరులు అనుసరించదగ్గ పనితీరును ఈ సర్కిళ్ల సీజీఎంలు కనబరిచారనీ, వీరు బీఎస్ఎన్ఎల్లో ‘‘ఫైవ్ స్టార్స్’’ అంటూ వారిని ఆయన మెచ్చుకున్నారు. ఈ సర్కిళ్ల సీజీఎంలు అందిస్తున్న  నాయకత్వాన్నీ, నవకల్పన నమూనాలనూ చూసి ఇతర సర్కిళ్లు కూడా ముందుకు పోవాలంటూ మంత్రి ప్రోత్సహించారు.    
అన్ని వాణిజ్య రంగాల్లోనూ, సబ్ డివిజనల్ స్థాయుల్లోనూ, కార్యనిర్వహణ అంచెల్లోనూ వరుసగా సమావేశాలను నిర్వహిస్తూ, సీజీఎంలు తమ సర్కిళ్లలో నాయకత్వం, సమీక్ష నమూనాను అనుసరించాలని కూడా మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ‘‘మీ మీ బృందాలకు సాధికారతను కల్పించి, వారిలో ఉత్సాహం ఉరిమేటట్లు చేయండి. వారు ముందుకు కదిలితే ఇక మనం ఆగిపోయే ప్రసక్తే ఉండదు’’ అని శ్రీ సింధియా అన్నారు. పనిచేయాలనే సంస్కృతి వ్యూహాన్ని జీర్ణించుకొంటుంది, ఇలాంటి విధానాన్ని ప్రవేశపెడితే వ్యవస్థ దానంతట అదే పరుగులు తీస్తుంది అని తాను నమ్ముతున్నట్లు మంత్రి వెల్లడించారు.    
మంత్రి తన సంభాషణ చివర్లో వినియోగదారు ప్రయోజనాలే పరమావధిగా మార్పుల బాటలో నడవడానికి బీఎస్ఎన్ఎల్ కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి టెలికం సేవలను అందిస్తామనీ, నిర్వహణ పరంగా అత్యుత్తమ స్థాయిని సంతరించుకొంటామనీ,  లాభదాయకతను 2025–26 ఆర్థిక సంవత్సరం పొడవునా ఆ  తరువాతా పరిరక్షిస్తామనీ అన్ని సర్కిళ్లూ ప్రతిజ్ఞ చేసి, సమావేశాన్ని ముగించారు.
 
***
 
                
                
                
                
                
                (Release ID: 2184449)
                Visitor Counter : 4