రాష్ట్రపతి సచివాలయం
శ్రీ నారాయణ గురు మహాసమాధి శతాబ్ది కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము
అందరిలో ఉన్నది ఒకే దైవాంశ అన్న మాటల్ని గుర్తు చేస్తున్న శ్రీ నారాయణగురు ఐక్యతా సందేశం
Posted On:
23 OCT 2025 1:52PM by PIB Hyderabad
శ్రీ నారాయణ గురు మహాసమాధి శతాబ్ది కార్యక్రమాన్ని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము కేరళలోని వర్కలాలో గల శివగిరి మఠంలో ఈ రోజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. శ్రీ నారాయణ గురు భారతదేశంలో మహనీయ ఆధ్యాత్మిక ప్రముఖుల్లో, సంఘ సంస్కర్తల్లో ఒకరని అన్నారు. ఆయన మన దేశ సాంఘిక, ఆధ్యాత్మిక రంగాల్లో ప్రభావాన్ని చూపిన ఓ సాధువు, దార్శనికుడు అని కూడా రాష్ట్రపతి అన్నారు. సమానత్వం, ఏకత, మానవాళి పట్ల ప్రేమ.. ఈ ఆదర్శాలపైన విశ్వాసాన్ని పెంచుకోవాల్సిందిగా కొన్ని తరాలకు స్ఫూర్తిని ఆయన అందించారని శ్రీమతి ముర్ము అన్నారు.
అజ్ఞానం, అంధవిశ్వాసాల బారి నుంచి ప్రజలను రక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేశారనీ, 19వ శతాబ్దంలో వచ్చిన సాంస్కృతిక పునరుజ్జీవన సమయంలో ఆయన కీలక పాత్రను పోషించారనీ రాష్ట్రపతి అన్నారు. అస్తిత్వ రహస్యం- ఏకత్వమేనని, ప్రతి ప్రాణిలో ఉండేది దివ్యత్వ సారమే దైవమని గమనించి, ‘‘మానవ జాతికంతా ఒకే కులం, ఒకే మతం, ఒకే దైవం’’ అంటూ ఓ శక్తిమంతమైన సందేశాన్నిచ్చారని రాష్ట్రపతి వివరించారు. శ్రీ నారాయణ గురు బోధనలు కులాలు,మతాలు, వర్గాల పరిధికన్నా మించినవని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. సిసలైన విముక్తి అంటే అది జ్ఞానం నుంచీ, కారుణ్యం నుంచీ లభించేదే తప్ప అంధ విశ్వాసం ద్వారా దక్కేది కాదని ఆయన విశ్వసించినట్లు శ్రీమతి ముర్ము అన్నారు. సచ్ఛీలత, నిరాడంబరత, విశ్వవ్యాప్త ప్రేమ భావనల గురించి శ్రీ నారాయణ గురు తరచూ ప్రధానంగా చాటి చెప్పారని రాష్ట్రపతి అన్నారు.
శ్రీ నారాయణ గురు ఏర్పాటు చేసిన ఆలయాలు, పాఠశాలలు, సామాజిక సంస్థలు విద్యనూ, స్వయంసమృద్ధి సాధననూ, అణచివేతకు గురైన వర్గాలకు నైతిక విలువలనూ ప్రబోధించాయని రాష్ట్రపతి అన్నారు. సంస్కృత, మలయాళ, తమిళ భాషల్లో శ్రీ నారాయణ గురు రచనలు లోతైన తాత్త్విక చింతనను నిరాడంబరతతో కలబోశాయన్నారు. మానవ జీవనం అన్నా, ఆధ్యాత్మికత అన్నా ఆయనకు ఎంత విస్తృత అవగాహన ఉందో ఆయన రచనలే మనకు చెబుతాయని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.
శ్రీ నారాయణ గురు సందేశానికి వర్తమాన ప్రపంచంలో మరింత సందర్భశుద్ధి ఉందని రాష్ట్రపతి స్పష్టం చేశారు. ఏకత్వం, సమానత్వం, పరస్పర ఆదరణ.. భావాలు మానవ జాతి సంఘర్షణల్ని సమసిపోయేటట్లు చేసే చిరకాల పరిష్కారమార్గాలని శ్రీమతి ముర్ము అన్నారు. శ్రీ నారాయణ గురు ఇచ్చిన ఏకత్వ సందేశం మానవులు అందరిలోనూ ఒకే దివ్యత్వ సారం ఉన్నదని మనకు గుర్తు చేస్తుందని రాష్ట్రపతి తెలిపారు.
***
(Release ID: 2181837)
Visitor Counter : 13