రక్షణ తయారీలో స్వావలంబన దార్శనికతను బలోపేతం చేస్తూ, లక్నోలోని బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ కేంద్రంలో తయారు చేసిన మొదటి విడత బ్రహ్మోస్ క్షిపణులను రక్షణమంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, అక్టోబర్ 18, 2025న, సంయుక్తంగా ప్రారంభించారు. యూపీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో కీలకమైన ఈ అత్యాధునిక కేంద్రాన్ని రక్షణమంత్రి మే 11, 2025న వర్చువల్గా ప్రారంభించారు. ఇందులో ఐదు నెలల్లోనే, మొదటి బ్యాచ్ క్షిపణులు మోహరింపునకు సిద్ధం కావడం విశేషం.
రక్షణ మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ... బ్రహ్మోస్ కేవలం ఒక క్షిపణి మాత్రమే కాదని, పెరుగుతున్న భారత స్వదేశీ సామర్థ్యాలకు చిహ్నం అని అభివర్ణించారు. “ఈ క్షిపణి ఒక సాంప్రదాయ వార్హెడ్ను, అధునాతన మార్గనిర్దేశిత వ్యవస్థను కలిగి ఉంది. సూపర్సోనిక్ వేగంతో సుదూర లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. వేగం, కచ్చితత్వం, శక్తి కలగలసిన బ్రహ్మోస్ ప్రపంచంలోని అత్యుత్తమ వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది. ఇది మన సాయుధ దళాలకు వెన్నెముక” అని ఆయన పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్లో బ్రహ్మోస్ పాత్రను ప్రస్తావిస్తూ... ఈ క్షిపణి ప్రయోగ దశను దాటి ముందుకు సాగిందని, ఇది జాతీయ భద్రతకు గొప్ప ఆచరణాత్మక నిదర్శనంగా నిలిచిందని శ్రీ రాజ్నాథ్ సింగ్, పేర్కొన్నారు. పాకిస్థాన్ భూభాగంలోని ప్రతి అంగుళం ఇప్పుడు బ్రహ్మోస్ పరిధిలోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. “విజయం మనకు అలవాటుగా మారిందనడానికి ఆపరేషన్ సిందూర్ నిదర్శనం. ఇక మన సామర్థ్యాలను మరింతగా పెంచుకోవాలి. ఆ ఆపరేషన్ కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. దాంతో తర్వాత ఏమి జరగవచ్చో పాకిస్థాన్ కు అర్థమైంది” అని ఆయన అన్నారు.
భారత్ ఇప్పుడు తన భద్రతను పటిష్టం చేసుకుంటూ, రక్షణ, సాంకేతిక రంగాల్లో విశ్వసనీయ భాగస్వామిగా ప్రపంచానికి చాటిచెప్పే స్థితిలో ఉందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. 'మేడ్ ఇన్ ఇండియా' అనేది ఇకపై కేవలం నినాదం కాదని, అదొక అంతర్జాతీయ బ్రాండ్ అని... బ్రహ్మోస్ వంటి విజయాలు నిరూపించినట్టు ఆయన పేర్కొన్నారు. "ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్ ఎగుమతి అయినా, భవిష్యత్తులో ఇతర దేశాలతో సహకారం అయినా, భారత్ ఇప్పుడు కేవలం తీసుకునే పాత్రలో కాకుండా, ఇచ్చే పాత్రను పోషిస్తోంది. ఇదే ఆత్మనిర్భర్ భారత్ నిజమైన గుర్తింపు. 2014లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ దార్శనికతతోనే తన ప్రయాణాన్ని ప్రారంభించింది. 2047 నాటికి పూర్తిగా అభివృద్ధి చెందిన, స్వావలంబన కలిగిన, ప్రపంచానికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్న భారతదేశ దార్శనికతను ప్రధాని మోదీ మనకు అందించారు. ఈ ప్రయత్నంలో రక్షణ రంగం పాత్ర నిర్ణయాత్మకంగా ఉంటుంది” అని ఆయన అన్నారు.
గత నెల రోజుల్లో బ్రహ్మోస్ బృందం రెండు దేశాలతో సుమారు రూ. 4,000 కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుందని శ్రీ రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో అనేక దేశాల నిపుణులు లక్నోను సందర్శిస్తారని, నగరాన్ని విజ్ఞాన కేంద్రంగా, రక్షణ సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతారని ఆయన పేర్కొన్నారు.“వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బ్రహ్మోస్ లక్నో యూనిట్ వ్యాపారం సుమారు రూ. 3,000 కోట్లుగా, జీఎస్టీ వసూళ్లు సుమారు రూ. 500 కోట్లుగా ఉంటాయి” అని ఆయన తెలిపారు.
మొత్తం రూ. 380 కోట్ల వ్యయంతో 200 ఎకరాల్లో నిర్మించిన బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్ గురించి రక్షణ మంత్రి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ కేవలం రక్షణ సౌకర్యం మాత్రమే కాదని, ఉపాధి వృద్ధికి కూడా కొత్త మార్గమని అన్నారు. “ఈ కేంద్రంలో ప్రతి సంవత్సరం సుమారు 100 క్షిపణులు ఉత్పత్తి అవుతాయి. ఉత్తరప్రదేశ్లోకి వస్తున్న పెట్టుబడులను, రాష్ట్రంలో సాధిస్తున్న పురోగతిని పరిగణనలోకి తీసుకుంటే, ఈ ప్రాంతం అభివృద్ధి, రక్షణ రెండింటికీ కొత్త శకానికి ప్రతీకగా నిలవడానికి సిద్ధంగా ఉంది” అని ఆయన అన్నారు.
కొన్ని దేశాల నుంచి రక్షణ పరికరాల విడిభాగాల సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయని వస్తున్న సమాచారాన్ని ప్రస్తావిస్తూ, ఒక పెద్ద ఆయుధ వ్యవస్థను సమీకరించడానికి అవసరమైన వేలాది విడిభాగాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉత్పత్తి చేసే చిన్న పరిశ్రమలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తద్వారా ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. "సాంకేతిక అభివృద్ధి జరుగుతున్న కొద్దీ, సరఫరా వ్యవస్థ విభిన్నంగా మారుతుంది. ఈ సరఫరా మార్గాలు తరచుగా ఇతర దేశాలతో ముడిపడి ఉంటాయి. ఒకవేళ ఆ వ్యక్తి, సంస్థ లేదా దేశం ఆ విడిభాగాన్ని సరఫరా చేయడానికి నిరాకరిస్తే, మీ ఉత్పత్తి తయారు కాదు. అందుకే విడిభాగాల కోసం మనం ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా మన చిన్న పరిశ్రమలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అత్యాధునిక సీకర్లు అయినా లేదా రామ్జెట్ ఇంజన్లు అయినా, మనం అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశీయంగా అభివృద్ధి చేసుకోవాలి. తద్వారా మన సరఫరా వ్యవస్థ మన దేశంలోనే ఉంటుంది" అని ఆయన అన్నారు.
చిన్న పారిశ్రామికవేత్తలను రక్షణ వ్యవస్థలో చేర్చడానికి సరైన ప్రాజెక్ట్ ప్రణాళికను రూపొందించాలని రక్షణ మంత్రి పిలుపునిచ్చారు. "పెద్ద కంపెనీలతో పాటు చిన్న పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందినప్పుడే ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ పూర్తి స్థాయిలో విజయవంతమవుతుంది. భవిష్యత్తులో, యూపీ కేవలం ఒక తయారీ కేంద్రంగా మారడమే కాకుండా, చిన్న, పెద్ద పారిశ్రామికవేత్తలకు ఆవిష్కరణ, ఉపాధికి కొత్త కేంద్రంగా కూడా మారుతుందని నాకు నమ్మకం ఉంది" అని ఆయన అన్నారు.
బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్ వంటి సౌకర్యాలు జాతీయ భద్రతను బలోపేతం చేయడమే కాకుండా ఆర్థిక వ్యవస్థను కూడా పెంచుతాయని రక్షణ మంత్రి అన్నారు. సరఫరా చేస్తున్న క్షిపణుల ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన జీఎస్టీ ఆదాయం వస్తోందని, అంటే ప్రతి వ్యవస్థ దేశాన్ని రక్షించడమే కాకుండా ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. "కేవలం ఒక క్షిపణి ఉత్పత్తి ద్వారా వచ్చే పన్నులతో, ప్రభుత్వం అనేక పాఠశాలలను నిర్మించగలదు. అనేక ఆసుపత్రులను ఏర్పాటు చేయగలదు. ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే పథకాలను అమలు చేయగలదు" అని ఆయన వివరించారు.
యుపీ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ తన ప్రసంగంలో, బ్రహ్మోస్ను దేశ రక్షణ అవసరాలను తీర్చే ఆత్మనిర్భరత క్షిపణిగా అభివర్ణించారు. లక్నోను బ్రహ్మోస్ క్షిపణుల ఉత్పత్తి కేంద్రంగా మార్చడం ద్వారా రక్షణ రంగ స్వావలంబన ఉద్యమంలో భాగమయ్యే అవకాశాన్ని కల్పించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి, రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. లక్నోలో తయారయ్యే క్షిపణులు దేశ ప్రజల భద్రతకు, శ్రేయస్సుకు హామీ అని ముఖ్యమంత్రి అన్నారు. యూపీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లోని మొత్తం ఆరు విభాగాలలో సాధించిన పురోగతిని ఆయన అభినందించారు. రాష్ట్రంలో 15,000 మందికి పైగా యువత ఉద్యోగాలు పొందారని తెలియజేశారు.