రక్షణ మంత్రిత్వ శాఖ
సిడ్నీలో జరిగిన భారత్-ఆస్ట్రేలియా డిఫెన్స్ ఇండస్ట్రీ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించిన రక్షణ మంత్రి
సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం 2020 ద్వారా సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో-పసిఫిక్ కు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తూ రక్షణ బంధాలను మెరుగుపరచటానికి కీలక స్థానంలో ఉన్నాం: రక్షణ మంత్రి
తయారీ రంగంపై ప్రత్యేక దృష్టితో భారత్ నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టింది. ప్రస్తుతం, భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలన్నింటిలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా నిలిచింది: రక్షణ మంత్రి
"రక్షణ రంగ ఆర్ అండ్ డీని ప్రైవేట్ రంగంలో వేగవంతం చేయటానికి, డీఆర్ డీఓ ద్వారా ఉచిత సాంకేతికత బదిలీ మార్గాలను ఏర్పాటు చేశాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయటానికి ఆకర్షణీయమైన పథకాలున్నాయి. అవి అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి"
ప్రొపల్షన్ టెక్నాలజీలు, స్వయంప్రతిపత్తి జలంతర్గాములు, ఫ్లైట్ సిమ్యులేటర్లు, అధునాతన వస్తువుల వంటి అత్యున్నత స్థాయి వ్యవస్థలను అభివృద్ధి చేయటానికి, ఉత్పత్తి చేయటానికి ఆస్ట్రేలియాను స్వాగతించిన రక్షణ మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
10 OCT 2025 10:15AM by PIB Hyderabad
రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ అక్టోబర్ 10, 2025న సిడ్నీలో జరిగిన భారత్-ఆస్ట్రేలియా డిఫెన్స్ ఇండస్ట్రీ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ వ్యూహాత్మక, పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో రెండు దేశాల మధ్య పెరుగుతున్న సమన్వయాన్ని తెలిపారు. “సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం 2020 ద్వారా రక్షణ బంధాలను బలోపేతం చేసేందుకు కీలక దశలో ఉన్నాం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, అభివృద్ధికి కేవలం భాగస్వాములుగా కాక, సహనిర్మాతలుగా మారాల్సిన అవసరం ఉంది" అని రక్షణ మంత్రి అన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం కేవలం చర్చ మాత్రమే కాదని.. వాణిజ్యం, పారిశ్రామిక రంగం, ఆవిష్కరణల్లో భారత్- ఆస్ట్రేలియాలను సహజ మిత్రులుగా మార్చాలనే సంకల్ప ప్రకటన అని స్పష్టం చేశారు.
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి జరిగిన ఉన్నత-స్థాయి సమావేశాలను శ్రీ రాజ్ నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. వాటిలో నవంబర్ 2024లో జరిగిన భారత్-ఆస్ట్రేలియా సదస్సు, అక్టోబర్ 2024లో జరిగిన 2+2 మంత్రిత్వ స్థాయి చర్చలు, జూన్ 2025లో ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి భారత్ పర్యటన, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో రాజ్ నాథ్ పర్యటన ఉన్నాయి. ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, వ్యవస్థాపక సారూప్యతలు ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలకు మూలమని రక్షణ మంత్రి స్పష్టం చెప్పారు. "భారత్-ఆస్ట్రేలియా రెండూ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్లో భాగమే. ప్రజాస్వామ్యం, వైవిధ్యం, స్వేచ్ఛా, ఒకే రకమైన పాలనా విధానాలపై మన ఉమ్మడి చరిత్ర నిర్మితమైంది" అని ఆయన అన్నారు.
మూడు కీలక అంశాలపై ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఆధారపడి ఉన్నాయని రక్షణ మంత్రి అన్నారు. అవి భవిష్యత్ ప్రయోజనాల కోసం గవర్నమెంట్-టు-గవర్నమెంట్ సహకారం, పీపుల్-టు-పీపుల్ అనుబంధం, ఉమ్మడి వ్యాపార ప్రయోజనాలు. "ఇప్పటికే బలంగా ఉన్న మన ప్రభుత్వ విధానాలు మరింత బలోపేతమవుతున్నాయి. ఆస్ట్రేలియాలో పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులుండగా, భారత్ లోనూ ఆస్ట్రేలియన్ల సంఖ్య పెరుగుతోంది. సంయుక్త పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ, ఉమ్మడి రూపకల్పన, ఉత్పత్తిపై ఆధారపడిన మన రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యంలో వినియోగించుకోవాల్సిన సామర్థ్యం ఎంతో ఉంది" అని చెప్పారు.
భారత్ ఇటీవల సాధించిన ఆర్థిక, పారిశ్రామిక విజయాలను ప్రస్తావిస్తూ, ముఖ్యంగా ఉత్పత్తి రంగంలో మార్పులు తెచ్చేలా నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టినట్లు శ్రీ రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. “ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో మన రక్షణ ఉత్పత్తి విలువ రూ.1.51 లక్షల కోట్లకు (సుమారు 18 బిలియన్ డాలర్లు) చేరుకోగా.. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 18% అధికం. మన రక్షణ ఎగుమతులు రూ. 23,622 కోట్లకు (2.76 బిలియన్ డాలర్లు) చేరుకున్నాయి. ప్రస్తుతం భారత కంపెనీలు సుమారు 100 దేశాలకు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి” అని ఆయన వెల్లడించారు.
స్నేహపూర్వక పారిశ్రామిక సహకారాన్ని కోరుతూ.. “వాణిజ్యం, పారిశ్రామిక రంగాల్లో భారత్-ఆస్ట్రేలియా సహజ మిత్ర దేశాలుగా మారటానికి ముఖ్య సాధనంగా ఈ వేదిక ఉంటుందని భావిస్తున్నా. ఈ కూటమి విజయానికి, పరస్పర ప్రయోజనానికి బలమైన ఆర్థిక కారణాలున్నాయి" అని శ్రీ రాజ్నాథ్ సింగ్ అన్నారు.
క్వాంటం వ్యవస్థలు, స్వయంప్రతిపత్తి జలాంతర్గామి వాహనాలు, అధునాతన సముద్ర నిఘా వంటి ప్రత్యేక సాంకేతికతలతో ఆస్ట్రేలియా దూసుకెళ్తుండగా.. విస్తృతమైన తయారీ సామర్థ్యం, సాఫ్ట్వేర్ నైపుణ్యాలు, నౌకా నిర్మాణం, క్షిపణి సాంకేతికత, అంతరిక్షంలో దేశీయ బలాన్ని భారత్ ప్రదర్శిస్తుంది. "రక్షణ రంగ సహకారంలో వినియోగించుకోని సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది" అని ఆయన చెప్పారు.
మేక్ ఇన్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్, డిజిటల్ పరివర్తన వంటి కార్యక్రమాలు ఆవిష్కరణలకు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాయని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. సరళీకరించిన ఎఫ్ డీఐ విధానం ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా 74% వరకు, ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టినప్పుడు అంతకంటే ఎక్కువ శాతం పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వ ఆమోదం పొందాలని రక్షణ మంత్రి తెలిపారు. విధానపరమైన చర్యలు, నిబంధనల అమలును సులభతరం చేయటం ద్వారా రక్షణ ఉత్పత్తి వ్యవస్థను నిరంతరం సరళంగా మారుస్తున్నామని చెప్పారు.
"ప్రైవేట్ రంగంలో రక్షణ ఆర్ అండ్ డీని వేగవంతం చేయటానికి, డీఆర్ డీఓ ద్వారా సాంకేతికతను ఉచితంగా బదిలీ చేయటానికి మేం అవకాశమిచ్చాం. అత్యాధునిక సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి ఆకర్షణీయమైన పథకాలు ఉన్నాయి. అవి అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి" అని పరిశోధన, ఆవిష్కరణల ప్రోత్సాహానికి తీసుకున్న చర్యల గురించి శ్రీ రాజ్నాథ్ సింగ్ తెలిపారు. డీఆర్ డీఓ, ఆస్ట్రేలియా డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ ఇప్పటికే టోవ్డ్ అరే సెన్సార్లపై కలిసి పనిచేస్తున్నాయని, క్వాంటం సాంకేతికత, ఏఐ, సైబర్ భద్రత, సమాచార యుద్ధం, అధునాతన సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలపై చర్చలు ముందుకు సాగుతున్నాయని వెల్లడించారు.
ప్రొపల్షన్ టెక్నాలజీలు, స్వయంప్రతిపత్తి జలాంతర్గామి వాహనాలు, ఫ్లైట్ సిమ్యులేటర్లు అధునాతన వస్తువులు వంటి అత్యున్నత స్థాయి వ్యవస్థలను అభివృద్ధి చేయటానికి, ఉత్పత్తి చేయటానికి ఆస్ట్రేలియా కంపెనీలను భారత్ స్వాగతిస్తోందని రక్షణ మంత్రి చెప్పారు. రెండు దేశాల వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయగలిగే వేదికలను నిర్మించటానికి ఈ ప్రయత్నాలు సహాయపడతాయని ఆయన స్పష్టం చేశారు.
భాగస్వామ్యం కోసం నిర్దిష్ట రంగాల గురించి ప్రస్తావిస్తూ, పటిష్టమైన నౌకా నిర్మాణ సామర్థ్యాలు, విభిన్న తయారీ స్థావరం, ప్రైవేట్ రంగంలో పెరుగుతున్న ఆవిష్కర్తలు, స్టార్టప్ల వ్యవస్థతో విశ్వసనీయ భాగస్వామిగా ఉండేందుకు భారత్ సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి అన్నారు. "విస్తృతమైన నౌకాదళ వేదికలను నిర్మించటం, నిర్వహించటంలో మా నౌకా నిర్మాణ కేంద్రాలకు ట్రాక్ రికార్డ్ ఉంది. రాయల్ ఆస్ట్రేలియన్ నేవీకి, ఆస్ట్రేలియా పసిఫిక్ మారిటైమ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ కింద ఉన్న నౌకలకు మరమ్మతులు, సామర్థ్యాన్ని పెంచే మార్పులు, నిర్వహణ సేవలను భారత నౌకా నిర్మాణ కేంద్రాలు అందించగలవు" అని తెలిపారు.
ఇండో-ఎంఐఎం ప్రైవేట్ లిమిటెడ్, థేల్స్ ఆస్ట్రేలియా, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ విత్ డబ్ల్యూ అండ్ ఈ ప్లాట్ ప్రైవేట్ లిమిటెడ్, మునిషన్స్ ఇండియా లిమిటెడ్, ఆక్వ్స్పోర్ట్ వంటి సంస్థల మధ్య మెరుగైన పారిశ్రామిక భాగస్వామ్యాల ఉదాహరణలను రక్షణ మంత్రి తెలిపారు. "మన పారిశ్రామిక వ్యవస్థల పరస్పర సహకారాన్ని, ప్రభుత్వాల వ్యూహాత్మక లక్ష్యం వెనుక వాణిజ్యం ప్రధాన శక్తిగా మారటాన్ని ఈ ఉదాహరణలు చూపిస్తాయి" అని అన్నారు. భవిష్యత్తులో ఈ జాబితా మరింత పెరుగుతుందని, తద్వారా ప్రస్తుత సామర్థ్యం నుంచి ఇరుపక్షాలు పూర్తి ప్రయోజనం పొందవచ్చని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
రక్షణ సంబంధిత ఉత్పత్తులు, సేవల సరఫరాకు సంబంధించి ఆస్ట్రేలియా చేసిన ఎంఓయూ ప్రతిపాదనను శ్రీ రాజ్ నాథ్ సింగ్ స్వాగతించారు. "ఈ ఒప్పందాన్ని మేం స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా, సాంకేతికతను సులభంగా పంచుకోవటానికి వీలుగా కొన్ని అడ్డంకులను తొలగించి, భారతదేశాన్ని ఒక అగ్రశ్రేణి భాగస్వామిగా ఆస్ట్రేలియా గుర్తించింది. ఇది భారత్ తో బంధంపై ఉంచిన విశ్వాసానికి, నమ్మకానికి నిదర్శనం" అని అన్నారు.
రెండు దేశాల ముందున్న విస్తృతమైన అవకాశాలున్నాయని రక్షణ మంత్రి అన్నారు. "ఆస్ట్రేలియా, భాగస్వామ్య దేశాల నౌకల కోసం భారత్ లో నౌకలు, ఉప-వ్యవస్థలు, నౌకల మరమ్మతులు, పునరుద్ధరణ ఎంఆర్ఓ సహాయం కోసం సహ ఉత్పత్తికి, స్వయంప్రతిపత్తి వ్యవస్థలు, గ్రీన్ షిప్బిల్డింగ్ సాంకేతికల్లో ఉమ్మడి పరిశోధన, అభివృద్ధి కోసం అపారమైన అవకాశాలున్నాయి" అని తెలిపారు. వైవిధ్యమైన సరఫరా వ్యవస్థలు, ఉమ్మడి సామర్థ్యాలను మెరుగుపరచటం, ఆవిష్కరణల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా రెండు దేశాలు పటిష్టమైన, సురక్షితమైన, స్వావలంబన గల ఇండో-పసిఫిక్ కి తోడ్పడగలవని శ్రీ రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
"భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు, సహకారానికి, ఆవిష్కరణలు చేసేందుకు ఆస్ట్రేలియాను ఆహ్వానిస్తున్నాను. మనం అత్యాధునిక సాంకేతికతలను అభివృద్ధి చేయటమే కాక, ఆధునిక వేదికలను ఏర్పాటు చేయవచ్చు. మన పరిశ్రమలు కేవలం సరఫరాదారులుగానే కాకుండా, శాంతిభద్రతలకు వ్యూహాత్మక సహాయకారులుగా ఉండవచ్చు" అని శ్రీ రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆర్థిక ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా, వ్యూహాత్మక పరివర్తన దిశగా భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేలా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
భారత్-ఆస్ట్రేలియా రక్షణ భాగస్వామ్యం ఒక కీలకమైన స్థానంలో ఉందని, వ్యూహాత్మక లక్ష్యాల సమ్మేళనం, పారిశ్రామిక రంగ శక్తి, నాయకత్వాల దార్శనికతతో భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఇరు దేశాలకు ఇదొక ప్రత్యేకమైన అవకాశమని రక్షణ మంత్రి రాజ్ నాథ్ అన్నారు.
రక్షణ మంత్రిత్వ శాఖ (భారత ప్రభుత్వం), ఆస్ట్రేలియా రక్షణ విభాగం, న్యూల్యాండ్ గ్లోబల్ గ్రూప్, ఆస్ట్రేలియా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ సంయుక్తంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియా రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ పీటర్ ఖలీల్తో పాటు, రెండు దేశాల సీనియర్ ప్రభుత్వాధికారులు, దౌత్యవేత్తలు, పారిశ్రామిక రంగ ప్రముఖులు, పరిశోధనా సంస్థలు, ఆవిష్కర్తలు హాజరయ్యారు.
***
(రిలీజ్ ఐడి: 2177560)
సందర్శకుల సూచీ సంఖ్య : : 36