రక్షణ మంత్రిత్వ శాఖ
భారత్-ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సంయుక్త ప్రకటన
Posted On:
09 OCT 2025 12:37PM by PIB Hyderabad
ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి శ్రీ రిచర్డ్ మార్లెస్తో కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ ఈ రోజు ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. రెండు దేశాల రక్షణ మంత్రుల చర్చ తరువాత జారీ చేసిన సంయుక్త ప్రకటన ఇలా ఉంది:
‘‘భారత్-ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల తొలి చర్చ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆస్ట్రేలియాకు రావాల్సిందిగా భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ను ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి శ్రీ రిచర్డ్ మార్లెస్ ఆహ్వానించారు. ఈ చర్చా కార్యక్రమం రెండు దేశాల రక్షణ భాగస్వామ్యంలో చోటుచేసుకున్న అపూర్వ పురోగతితో పాటు సహకారాన్ని పెంపొందించుకోవాలన్న మంత్రుల తపనకు అద్దం పట్టింది. దీని కన్నా ముందు, ఆస్ట్రేలియా-భారత్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని 2020లో ఉన్నతీకరించిన అనంతరం నాలుగుసార్లు జరిగిన ద్వైపాక్షిక సమావేశాల్లో మంత్రులు పాల్గొన్నారు.
రెండు దేశాల సమష్టి శక్తిని పెంచుకోవడానికీ, భద్రతకు దోహదపడటానికీ, ప్రాంతీయ శాంతికీ, భద్రతకూ ముఖ్య తోడ్పాటును అందించడానికీ సహకరించుకొనే విషయంలో దీర్ఘకాల దృష్టికోణం ముఖ్యమంటూ ప్రధానమంత్రులు చేసిన సూచనను మంత్రులు ముందుకు తీసుకెళ్లారు. నౌకా వాణిజ్య సహకారాన్ని ఇప్పటి కన్నా ఎక్కువగా పెంపొందించుకోవడానికి ఒక సంయుక్త నౌకా వాణిజ్య భద్రత సహకార మార్గసూచీ (రోడ్మ్యాప్)పై కూడా వారు చర్చించారు. రక్షణ, భద్రత సంబంధిత సహకారం విషయంలో సంయుక్త ప్రకటనను ప్రధానమంత్రులు అమల్లోకి తెస్తారని భావిస్తున్నారు.
రక్షణ మంత్రులతో ఒక వార్షిక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించి సంప్రదింపులనూ, సహకారాన్నీ పెంచుకొందామనీ, ద్వైపాక్షిక రక్షణ సంబంధిత ఏర్పాట్లను విస్తరించుకొందామనీ మంత్రులు సంకల్పించారు. జలాంతర్గాముల రక్షణకు మద్దతునూ, సహకారాన్నీ అందించుకొనే అంశాలకు సంబంధించిన కార్యాచరణపై ఆస్ట్రేలియా-భారత్ సంతకాలు చేయడం సంతోషదాయకమని మంత్రులు అన్నారు. విమానాలకు నింగిలోనే ఇంధనాన్ని నింపే అంశంలోనూ ఇలాంటిదే మరో కార్యాచరణపై 2024లో సంతకాలు చేయగా, దీని అమలు దిశగా అడుగులు పడుతుండడాన్ని కూడా వారు స్వాగతించారు.
రక్షణ రంగంలో నెలకొన్న భాగస్వామ్యం లాంటిదే ఇప్పుడు వివిధ రంగాలకు కూడా విస్తరించినందుకు మంత్రులు హర్షాన్ని వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో సంయుక్త విన్యాసాలనూ, కార్యకలాపాలనూ, ఉమ్మడి విధనాలను మరింతగా ముందుకు తీసుకుపోవడానికి ఒక వేదికలా పనిచేసే సిబ్బంది సంయుక్త చర్చల యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడాన్ని మంత్రులు స్వాగతించారు. ఆస్ట్రేలియా 2025లో చేపట్టిన టాలిజ్మన్ సాబర్ విన్యాసంలో భారత్ పాల్గొనడాన్ని మంత్రి స్వాగతిస్తూ, 2027లోనూ ఈ సంప్రదాయాన్ని భారత్ కొనసాగిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రక్షణ విన్యాసాలు అంతకంతకూ సంక్లిష్టతను సంతరించుకోవడాన్నీ, ఈ విన్యాసాలు తరచుగా సాగుతుండడాన్నీ మంత్రులు ప్రశంసించారు. పరస్పర ఆధునిక రవాణా వ్యవస్థకు మద్దతిచ్చే అంశంలో ఒక కార్యాచరణను అమల్లోకి తెచ్చి సంయుక్త పని విధానాలను పెంచుకోవడం కూడా అభినందనీయమన్నారు. భారతీయ వాయు సేన 2024లో చేపట్టిన తరంగ్ శక్తి విన్యాసంలో రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ పాలుపంచుకోవడం, అలాగే 2026లో అంతర నౌకాదళ కార్యక్రమాల్లో ఇరు దేశాల నౌకా దళం పాలుపంచుకోనుండడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. బ్లాక్ కారిలాన్ పేరుతో నిర్వహించబోయే జలాంతర్గామి రక్షక విన్యాసంలో పాల్గొనాల్సిందంటూ ఆస్ట్రేలియా ఆహ్వానాన్ని అందించడాన్ని భారత్ స్వాగతించింది.
ఆస్ట్రేలియాలోని రక్షణ కళాశాలలో 2026లో భారతీయ విద్యార్థులను అదనంగా చేర్చుకొనే ప్రతిపాదనతో పాటు, 2027లో ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్స్ అకాడమీలో మొదటిసారిగా ఒక పదవిని ఇవ్వనుండడం పట్ల మంత్రులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
రక్షణ సంబంధిత పారిశ్రామిక సహకారానికీ, భాగస్వామ్యానికీ వ్యూహాత్మక ప్రాధాన్యం ఉందని మంత్రులు స్పష్టం చేశారు. 2025 అక్టోబరు 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు భారత్లో ఆస్ట్రేలియాకు చెందిన ఒకటో డిఫెన్స్ ట్రేడ్ మిషన్తో పాటు ఆస్ట్రేలియాకే చెందిన ల్యాండ్ ఫోర్సెస్ ఎక్స్పో-2024లోనూ మొదటిసారిగా భారతీయ పెవిలియన్ను ఏర్పాటు చేయడాన్ని వారు స్వాగతించారు. ఇది రక్షణ పరిశ్రమ రంగంలో బలమైన ద్వైపాక్షిక సహకారం ఏర్పడిందని సూచిస్తోంది. అక్టోబరు 10న సిడ్నీలో ఆస్ట్రేలియా-భారత్ డిఫెన్స్ ఇండస్ట్రీ రౌండ్టేబుల్ను నిర్వహించనుండడాన్ని కూడా మంత్రులు ప్రశంసించారు. సమకాలీన సాంకేతికతను అనుసరిస్తూ రక్షణ సంబంధిత సహకారాన్ని పెంచుకొనేందుకూ ఇరు పక్షాలు అంగీకరించాయి. దీనిలో భాగంగా రక్షణ పరిశ్రమ, పరిశోధన, సామగ్రి విషయాల్లో సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని సంకల్పించాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ నౌకలకు నిర్వహణ, మరమ్మతు, ఇతర సేవలను భారత షిప్యార్డులు అందించినందుకు ఆస్ట్రేలియా- భారతదేశానికి ధన్యవాదాలు తెలిపింది.
మంత్రులు ఒక స్వతంత్ర, బహిరంగ, శాంతియుత, స్థిర, సమృద్ధ ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని పరిరక్షించడంలో సాయాన్ని అందించడానికి ప్రాంతీయ భాగస్వాములతో సహకారాన్ని ఇప్పటికన్నా పెంచుకోవలసిన అవసరం ఎంతయినా ఉందని స్పష్టం చేశారు. నౌకాయాన, విమానయాన స్వేచ్ఛకూ, ప్రాంతం పరంగా నిరాటంకమైన వాణిజ్యానికీ, అంతర్జాతీయ చట్టానికీ, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి సముద్ర చట్ట సదస్సు-1982కు అనుగుణమైన సముద్ర సంబంధిత ఇతర చట్టబద్ధ ఉపయోగాలకు తాము గట్టి మద్దతును అందిస్తామని మంత్రులు తెలిపారు.
హిందూ మహాసముద్రంలో ఆస్ట్రేలియా, భారత్ నౌకా వాణిజ్య గస్తీ విమానాలు చేపట్టే సహకారాత్మక నౌకావాణిజ్య రంగ అవగాహన ప్రధాన కార్యకలాపాలు, జలాంతర్గామి నిరోధక యుద్ధ కార్యకలాపాల పట్ల మంత్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యకలాపాలకు సంబంధించిన అనుబంధాన్ని పెంపొందించుకోవడానికి ఇరు దేశాల భూభాగాల నుంచి విమానాల మోహరింపును కొనసాగించడానికి కూడా వారు అంగీకారాన్ని తెలిపారు. ఉమ్మడి సవాళ్లను పరిష్కరించుకోవడానికి ఆస్ట్రేలియా-భారత్-ఇండొనేసియా త్రైపాక్షిక ఫార్మేట్లో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న సహకారాన్ని మంత్రులు స్వాగతించారు.
ఆస్ట్రేలియా, భారత్, జపాన్, యునైటెడ్ స్టేట్స్ మధ్య రక్షణ సహకారంలో చోటుచేసుకుంటున్న పురోగతిని మంత్రులు స్వాగతించారు. భాగస్వాముల మధ్య వ్యూహాత్మక సహకారం విస్తరిస్తోందని స్పష్టం చేశారు. నౌకావాణిజ్య రంగంలో అవగాహనను పెంచకోవడంపట్ల నిబద్దతను పునరుద్ఘాటిస్తూ, 2025 నవంబరులో మలబార్ విన్యాసాన్ని చేపట్టే కాలంలోనే మరో సహకార ప్రధాన కార్యాచరణకు కూడా రంగం సిద్ధం కాగలదన్న భావాన్ని వ్యక్తం చేశారు. నాలుగు భాగస్వామ్య దేశాల మధ్య సన్నిహిత నౌకావాణిజ్య నిఘా సంబంధిత సహకారాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలకు ఆస్ట్రేలియా, భారత్ గట్టి మద్దతును తెలిపాయి. జపాన్తో కలిసి 2025లో భారత్, యునైటెడ్ స్టేట్స్ల చేపట్టే గగనతల విన్యాసం ‘కోప్ ఇండియా’ను మొదటి సారి పరిశీలించే అవకాశం లభించడాన్ని స్వాగతించారు.
ఇరు పక్షాలూ తమ తమ సైన్యాల మధ్య సహకారం పెంపొందుతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. సైన్య సహకారాన్ని విస్తరించుకోవడం, ముఖ్యంగా భూతల, ఉపరితల విన్యాసాలు, కార్యకలాపాల్లోనూ, ఎక్సర్సైజ్ పుక్-పుక్ వంటి విన్యాసాల్లోనూ భాగస్వామ్యం రూపేణా పరస్పర సహకారాన్ని అందించుకోవాలన్న నిబద్ధతను మంత్రులు పునరుద్ఘాటించారు. ఎక్సర్సైజ్ ఆస్ట్రాహింద్ పరిధి పెరుగుతుండడాన్నీ, సంక్లిష్టత అధికం కావడాన్నీ వారు స్వాగతించారు. నిపుణుల మార్పిడి ద్వారా ఏకీకృత వాయు, క్షిపణి రక్షణ, సురక్షిత కమ్యూనికేషన్లు, మానవ రహిత వాయు వ్యవస్థలు, కౌంటర్-యూఏఎస్, ప్రత్యేక కార్యకలాపాలు తదితర ముఖ్య రంగాల్లో అత్యుత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడానికి ప్రాధాన్యం ఉందని వారు పేర్కొన్నారు.
పాపువా న్యూ గినీ 50వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలోనూ, ఫిజీ పోర్ట్ కాల్ లోనూ భారతీయ నౌకా దళానికి చెందిన కద్మత్ నౌక పాల్గొనడాన్ని మంత్రులు అభినందించారు. ఆస్ట్రేలియా నిర్వహించే ఆపరేషన్ రెండర్ సేఫ్ భావి కార్యకలాపాల్లో పాల్గొనాల్సిందిగా భారత్ను ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి ఆహ్వానించారు.
రక్షణ మంత్రుల 2026 వార్షిక చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి భారత్కు రావాలంటూ రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ ఆహ్వానించగా, ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి శ్రీ మార్లెస్ అందుకు అంగీకరించారు.’’


***
(Release ID: 2177527)
Visitor Counter : 8