వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ముంబయిలో భారత్, యూకే వాణిజ్య మంత్రుల ద్వైపాక్షిక సమావేశం
లక్ష్యం: ఇండియా-యూకే జాయింట్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ కమిటీ దార్శనికతకు రూపమివ్వడం,
భారత్, యూకే సీఈటీఏ ప్రయోజనాలను అందించడం, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతం
प्रविष्टि तिथि:
08 OCT 2025 6:57PM by PIB Hyderabad
వాణిజ్య, పెట్టుబడి రంగాల్లో భారత్, యునైటెడ్ కింగ్డమ్ భాగస్వామ్యానికి ఒక కొత్త రూపురేఖలను సిద్ధం చేసే ఉద్దేశంతో ఒక ద్వైపాక్షిక సమావేశాన్ని ముంబయిలో ఈ రోజు నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, యూకే వాణిజ్య మంత్రి శ్రీ పీటర్ కైల్ పాల్గొన్నారు.
భారత్, యూకేల మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) అమలును పర్యవేక్షించడానికి జాయింట్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ కమిటీని (జేఈటీసీఓ) పటిష్ఠం చేయాలని మంత్రులిద్దరూ ఈ సమావేశంలో అంగీకరించారు. దీంతో ఒప్పందం అమలు దిశగా ఒక ముఖ్యమైన అడుగును వేసినట్లయింది.
ఒప్పందాన్ని త్వరగాను, సమన్వయంతోను, ఆశిస్తున్న ఫలితాలను సాధించేదిగా మలచడానికి ఇరు పక్షాలు నిబద్ధతను వ్యక్తపరిచాయి. రెండు దేశాల వాణిజ్య సంస్థలతో పాటు వినియోగదారులు కూడా ఈ ఒప్పంద ఫలితాలను పూర్తి స్థాయిలో అందుకోగలగాలన్నదే దీని ఉద్దేశం.
అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్, డిజిటల్ వాణిజ్యం, స్వచ్ఛ ఇంధనం, సేవలు వంటి రంగాల్లో రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకున్న అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా, 2030 కల్లా ఉభయ దేశాల మధ్య వాణిజ్య స్థాయిని రెట్టింపు చేసుకోవాలన్న ఉమ్మడి ఆకాంక్షను మంత్రులు పునరుద్ఘాటించారు.
సీఈటీఏతో భారీ మార్పు చోటుచేసుకొనే అవకాశం ఉందని మంత్రులు స్పష్టం చేశారు. నియంత్రణ రంగంలో సహకారం, టారిఫేతర సమస్యలను పరిష్కరించడం, సరఫరా వ్యవస్థను ఏకీకరించడంపై శ్రద్ధ తీసుకోవడం వంటి చర్యలతో ఒప్పందం తాలూకు లాభాలను సాధ్యమైనంత అధికంగా ఎలా పొందవచ్చనే అంశంపై వారు చర్చించారు.
వాణిజ్య మంత్రి, డైరెక్టర్ జనరల్ స్థాయిలో జరిగిన ఈ సమావేశం.. మంత్రుల స్థాయి సమావేశానికి ప్రాధాన్యతను తెచ్చింది.
రోజంతా సాగే ఆసక్తిదాయక చర్చలకూ, దూరదృష్టితో కూడిన చర్చలకూ ఈ సమావేశం బలమైన పునాదిని వేసింది.
ద్వైపాక్షిక సమావేశాని కన్నా ముందు, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్, వినియోగదారు వస్తువులు, ఆహారం, పానీయాలు, విజ్ఞానశాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, నవకల్పన, నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, స్వచ్ఛ ఇంధనం, ఆర్థిక, వృత్తినైపుణ్య, వాణిజ్య సేవలు (వీటిలో ఐటీ, ఐటీఈఎస్, విద్య, ఇంజినీరింగ్ కూడా భాగం) సహా ప్రాధాన్య రంగాల్లో అనేక రంగాలవారీ రౌండ్టేబుల్ సమావేశాలను కూడా నిర్వహించారు. ఈ చర్చలు భారత్, యూకేల పరిశ్రమ రంగ ప్రముఖులకు ఒక వేదికను సమకూర్చడంతో పాటు, కార్యాచరణకు మార్గదర్శనాన్ని అందించే లోతైన, ఎంతో విలువైన ఆలోచనలనూ అందించాయి.
భారత్-యూకే సీఈఓ ఫోరాన్ని కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు. దీనిలో రెండు దేశాలకు చెందిన వాణిజ్య రంగ ప్రముఖులు వాణిజ్యం, పెట్టుబడి, నవకల్పనలకు కొత్త అవకాశాలను చర్చించేందుకు ముందుకు వచ్చారు. ఇండియా-యూకే దేశాలకు చెందిన పరిశ్రమ రంగ ప్రతినిధుల సహాధ్యక్షతన ఏర్పాటైన ఈ ఫోరమ్.. రెండు పక్షాల ఆర్థిక సహకారాన్ని ఇప్పటితో పోలిస్తే మరింతగా పెంచేందుకూ, విభిన్నరంగాల్లో భాగస్వామ్యాన్ని బలపరిచేందుకూ ఒక ముఖ్య వేదికలా పనిచేసింది. భారత్, యూకే ల మధ్య ఆధునిక, పరస్పర ప్రయోజనకర, మన్నిక కలిగిన ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచేందుకు కలిసి పనిచేయాలన్న నిబద్ధతను ఈ చర్చలు పునరుద్ఘాటించాయి. ఈ దిశగా ఇండియా-యూకే సీఈటీఏ ఇప్పటికే తన వంతుగా తోడ్పడింది.
ప్రపంచ దేశాల వ్యాపార, ఆర్థిక దృక్పథంపై మంత్రులిద్దరూ తమ ఆలోచనలను పంచుకున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత స్థితులు చోటుచేసుకుంటున్నందువల్ల ఆటుపోటులకు తట్టుకొని నిలిచే, విభిన్న సరఫరా వ్యవస్థల్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ ఒక కీలక అభివృద్ధి ఇంజినుగా మారిందని శ్రీ గోయల్ వ్యాఖ్యానించారు. భారత్తో యూకే కుదుర్చుకున్న ఒప్పందం ఇంతవరకు కుదిరిన ఒప్పందాలన్నింటి కన్నా మంచిదని మంత్రి శ్రీ కైల్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం భారతదేశంలోని విశాల మార్కెట్టును బ్రిటిషు వాణిజ్య సంస్థలకు అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు దేశీయంగా వృద్ధినీ, ఉద్యోగాలనూ, సమృద్ధినీ ప్రోత్సహించడంలో దోహదపడుతుందని ఆయన అన్నారు.
సమావేశం ముగింపు ఘట్టంలో భాగంగా, వాణిజ్య సంబంధ సమగ్ర సదస్సును నిర్వహించారు. దీనిలో ఉభయ పక్షాలకు చెందిన పరిశ్రమ రంగ సీనియర్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆధునిక, సమ్మిళిత, పరస్పర ప్రయోజనకర వాణిజ్య భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోవడంతో పాటు వృద్ధికీ, పెట్టుబడికీ, నవకల్పనకూ సరికొత్త అవకాశాల్ని అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పాన్ని ఇరు పక్షాలూ పునరుద్ఘాటించాయి.
***
(रिलीज़ आईडी: 2176727)
आगंतुक पटल : 17