ఉప రాష్ట్రపతి సచివాలయం
సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ పేరుతో తయారైన ప్రధాని మోదీ ప్రసంగ సంపుటాలను విడుదల చేసిన ఉపరాష్ట్రపతి దేశం కోసం ప్రధానమంత్రి చేసిన కృషి, తీసుకున్న దార్శనికత, కన్న కలలను తెలియజేస్తోన్న సంపుటాలు: ఉపరాష్ట్రపతి
ప్రధానమంత్రి మోదీ లక్షలాది మందికి సజీవ ప్రేరణ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన తీరును తెలియజేస్తోన్న ఆయన దృఢ సంకల్పం: ఉపరాష్ట్రపతి
ప్రధానమంత్రి జాతి నిర్మాణ మంత్రాన్ని తెలియజేస్తోన్న సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ సంపుటాలు: ఉపరాష్ట్రపతి
దుర్భలమైన అయిదు నుంచి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి ఎదిగేందుకు ప్రధాని నాయకత్వం చేసిన కృషిని ప్రధానంగా తెలియజేస్తోన్న ప్రసంగాలు: ఉపరాష్ట్రపతి
ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్, కాశీ తమిళ సంగమం, జన్జాతీయ గౌరవ్ దివాస్, కర్తవ్య మార్గ్ ద్వారా సాంస్కృతిక పునరుజ్జీవాన్ని తెలియజేస్తోన్న మోదీ ప్రసంగాలు: ఉపరాష్ట్రపతి
2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న దిశగా దేశం చేస్తోన్న ప్రయాణాన్ని ప్రతిధ్వనిస్తోన్న ప్రధాని మోదీ మాటలు: ఉపరాష్ట్రపతి
2047 నాటికి వికసిత్ భారత్కు తీసుకెళ్లే అమృత కాలంలో విధుల పట్ల నిబద్ధతకు ప్రేరణ ఈ సంపుటాలు : ఉపరాష్ట్రపతి
Posted On:
22 SEP 2025 4:55PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రెండో పదవీ కాలంలో నాలుగు, అయిదు సంవత్సరాల్లో ఇచ్చిన ప్రసంగాల్లో ఎంపిక చేసిన వాటితో ‘సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ అనే పేర్లతో తయారు చేసిన రెండు సంపుటాలను భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీ.పీ రాధాకృష్ణన్ ఈ రోజు విడుదల చేశారు.
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఢిల్లీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరికీ నవరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇదే మొదటి ప్రజా సమావేశమని అన్నారు.
దేశం కోసం ప్రధానమంత్రి చేసిన కృషి.. ఆయకున్న దార్శనికత, కన్న కలలను అర్థం చేసుకోవటంలో ఈ రెండు సంపుటాలు కీలకంగా ఉంటాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ‘దేశవిదేశాల్లో ఉన్న కోట్లాది మందికి ప్రధానమంత్రి సజీవ ప్రేరణ’ అని అన్నారు. సొంత వ్యక్తిత్వం ద్వారా అత్యుత్తమ ప్రతిభను చూపించేలా ప్రజలకు మోదీ స్ఫూర్తిని అందిస్తున్నారనీ, సాధారణ ప్రజాప్రతినిధి నుంచి నిజమైన ప్రజా నాయకుడిగా ప్రధాని ఎదిగారని అన్నారు. అసాధ్యాన్ని ఏ విధంగా సుసాధ్యం చేయాలో ఆయన ధృడ సంకల్పం తెలియజేస్తోందని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా పుస్తకాల్లోని విషయాలను ఉపరాష్ట్రపతి ప్రధానంగా ప్రస్తవించారు. ఈ సంపుటాల్లో 2022-23 సంవత్సరానికి సంబంధించిన 76 ప్రసంగాలు, 12 మన్ కీ బాత్ ప్రసంగాలు.. 2023-24 సంవత్సరానికి సంబంధించిన 82 ప్రసంగాలు, 9 మన్ కీ బాత్ ప్రసంగాలు ఉన్నాయని తెలిపారు. 11 విభాగాలుగా తయారుచేసిన ఈ పుస్తకాలు ప్రధానమంత్రి ఆలోచనల్లోని స్పష్టతను, భవిష్యత్తు విషయంలో దార్శనికత, సమ్మిళిత పాలన పట్ల ఆయన నిబద్ధతను తెలియజేస్తాయని అన్నారు. ప్రధాని ప్రసంగాలను జాగ్రత్తగా ఎంపిక చేసి ఒక క్రమ పద్ధతిలో వీటిని తయారుచేసినందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రచురణ విభాగాన్ని ఆయన అభినందించారు.
"లేవండి, మేల్కొనండి, గమ్యాన్ని చేరుకునే వరకు విశ్రమించొద్దు" అన్న స్వామి వివేకానంద మాటలను ఉపరాష్ట్రపతి ఉటంకిస్తూ ... ప్రధానమంత్రి ఇచ్చిన ప్రసంగాలన్నీ పట్టుదల, దృఢ సంకల్పం, ప్రజా సంక్షేమానికి సంబంధించిన సందేశాన్ని కలిగి ఉన్నాయన్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అందరికి చేరేలా చూసుకోవాలనే ప్రధాని మోదీ దార్శనికతను ఈ ప్రసంగాలు తెలియజేస్తాయని ప్రముఖంగా ప్రస్తావించారు.
ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్, కాశీ తమిళ సంగమం, జంజాతీయ గౌరవ్ దివస్, రాజ్పథ్ పేరును కర్తవ్య మార్గంగా మార్చడం వంటి కార్యక్రమాల ద్వారా భారతదేశ సాంస్కృతిక గుర్తింపును పునరుద్ధరించడంలో ప్రధానమంత్రి పోషించిన పాత్ర ఎలాంటిదో వివరించారు.
యువ సాధికారతను ఉద్దేశించి మాట్లాడుతూ.. స్టార్టప్ ఇండియా, ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా, స్కిల్ ఇండియా, రోజ్గార్ మేళా వంటి కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. 2047 వికసిత్ భారత్ అనే కలకు పునాదులుగా వీటిని అభివర్ణించారు. దేశ యువతపై ఉన్న గాఢ విశ్వాసాన్ని మేరా యువ భారత్ కార్యక్రమం తెలియజేస్తోందని అన్నారు.
భారతదేశ జీ20 అధ్యక్ష పదవీ కాలాన్ని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి.. ఆఫ్రికా సమాఖ్యను శాశ్వత సభ్య దేశంగా చేర్చిన చారిత్రాత్మక నిర్ణయం పట్ల ప్రశంసలు వ్యక్తం చేశారు. వసుధైక కుటుంబం- ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే ప్రధాని మోదీ దార్శనికతను ఇది తెలియజేస్తోందని అన్నారు.
అన్ని కోణాల్లో పనిచేయాలనే మోదీ ఆలోచనను ఈ ప్రసంగాలు తెలియజేస్తాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రపంచ అజెండాలను రూపొందించడం నుంచి వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్, పీఎం సూర్య ఘర్- ముఫ్త్ బిజిలి యోజన వంటి పరివర్తనాత్మక స్థానిక పథకాల వరకు చాలా కార్యక్రమాలను మోదీ చేపట్టారని అన్నారు. ఇవి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను తెలియజేస్తున్నాయని.. ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పును తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.
జన్ ధన్ యోజన, ఆధార్-మొబైల్ అనుసంధానం, ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) , పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, లఖ్పతి దీదీ, రైతులకు సంబంధించిన పీఎం కిసాన్, ముద్ర యోజన, పీఎం స్వనిధి వంటి కార్యక్రమాల ద్వారా గత దశాబ్దంలో 25 కోట్లకు పైగా ప్రజలు తీవ్ర పేదరికం నుంచి బయటకు వచ్చారని ఆయన ప్రధానంగా చెప్పారు.
ధర్మం, కర్తవ్య బోధ, సేవా భావాలలో కూడిన భారతీయ తత్వంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముందుకెళ్తున్నారని ఉపరాష్ట్రపతి అన్నారు. కేవలం సామర్థ్యంపై మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసం, ఐక్యతపై బలమైన దేశం తయారవుతుందన్న విషయాన్ని తెలియజేశారు.
ఏ లక్ష్యం కూడా ప్రధానమంత్రికి చాలా దూరం, చాలా కష్టం కాదన్న ఉపరాష్ట్రపతి.. 140 కోట్ల భారతీయుల నుంచి ఆయన నిరంతరం ప్రేరణను పొందుతుంటారని పేర్కొన్నారు. ప్రజల సమష్టి సామర్థ్యంపై ప్రధానికి ఉన్న అచంచలమైన విశ్వాసమే.. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రజా భాగస్వామ్యంతో సామూహిక ఉద్యమంగా మార్చిందని, ప్రజల్లో ‘పరిశుభ్రతనే సేవ’ అనే స్ఫూర్తిని నింపిందని అన్నారు. ఈ విశ్వాసమే కొవిడ్ సంక్షోభ సమయంలో భారత్ను స్వావలంబన విషయంలో దృఢంగా నిలబెట్టేలా ప్రధానికి ధైర్యాన్నిచ్చిందని పేర్కొన్నారు.
దశాబ్దం కిందట భారత్ను దుర్భలమైన అయిదు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా పరిగణించేవారన్న ఉపరాష్ట్రపతి.. ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ గర్వంగా తలెత్తుకొని నిలబడిందని, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ఇది కేవలం ఆర్థిక విజయం మాత్రమే కాదన్న ఆయన.. జాతీయ క్రమశిక్షణ, స్వావలంబన, దేశాభివృద్ధి ప్రయాణానికి మార్గనిర్దేశం చేసే దేశమే ప్రథమం (నేషన్ ఫస్ట్) అనే భావన ఫలితమే ఇదని తెలిపారు. వికసిత్ భారత్ కల ప్రజల జీవితాల్లో కనిపించటం, ప్రతి ఒక్కరిలో దేశమే ప్రథమం అనే భావన ఉండటం అనేది ధైర్యాన్నిస్తున్నాయని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు.
వారసత్వం, చరిత్ర, భాష, సంస్కృతి పట్ల దేశం చూపిస్తోన్న ప్రేమ అమృత కాలానికి సంకేతం అని ఉపరాష్ట్రపతి అన్నారు. 'నవ భారత్' బలం, ఆకాంక్షలను అర్థం చేసుకోవటంతో పాటు.. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందినదిగా మార్చే అమృత కాలంలో విధులను నిబద్ధతతో నిర్వర్తించేందుకు పాఠకులను ఈ పుస్తకాలు ప్రోత్సహిస్తాయన్న విశ్వసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
వీటిని వెలువరించిందనందుకు సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రచురణల విభాగాన్ని ఉపరాష్ట్రపతి శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో సమాచార- ప్రసార, రైల్వేలు, ఎలక్ట్రానిక్స్- ఐటీ శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్, ఉపరాష్ట్రపతి కార్యదర్శి శ్రీ అమిత్ ఖరే, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు.. భారత ప్రెస్ కౌన్సిల్ చైర్పర్సన్ జస్టిస్ శ్రీమతి రంజనా ప్రకాష్ దేశాయ్, పార్లమెంటు సభ్యులు శ్రీ నిహికాంత్ దూబే, శ్రీ యోగేష్ చందోలియా, ఢిల్లీ విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం, ఇందిరా గాంధీ ఢిల్లీ మహిళల సాంకేతిక విశ్వవిద్యాలయం, నేతాజీ సుభాస్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు చెందిన ఉపకులపతులు, ప్రముఖ జర్నలిస్టులు పాల్గొన్నారు.
***
(Release ID: 2169985)