శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారత మొట్టమొదటి 240 వోల్ట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ప్రాజెక్ట్ అభివృద్ధికి టీడీబీ - డీఎస్టీ మద్దతు
స్వదేశీ ఈవీ టెక్నాలజీలలో భారత్ సామర్థ్యాలను బలోపేతం చేయనున్న
240 వోల్ట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ప్రాజెక్ట్: కార్యదర్శి, టీడీబీ
प्रविष्टि तिथि:
17 SEP 2025 12:57PM by PIB Hyderabad
భారత దేశ ద్విచక్ర వాహనాల రంగంలో మొట్టమొదటి టెక్నాలజీగా 240 వోల్ట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల తయారీ, వాణిజ్యీకరణకు సైన్స్, టెక్నాలజీ శాఖకు చెందిన టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు మద్దతు ప్రకటించింది. చెన్నై కి చెందిన రాప్టీ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును చేపడుతోంది.
ఈ ఆవిష్కరణ, ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో విజయవంతమైన హై-వోల్టేజ్ టెక్నాలజీ అధునాతన ప్రయోజనాలను ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు అందిస్తుంది. 240 వోల్ట్ డీసీ ఆర్కిటెక్చర్పై పనిచేసే ఈ మోటార్సైకిల్ ను వేగవంతమైన ఛార్జింగ్, మెరుగైన సామర్థ్యంతో పాటు భారత్లో విస్తరిస్తున్న పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక వసతులతో సులభమైన అనుసంధానాన్ని కలిగివుండేలా రూపొందించారు.
ఈ హై-వోల్టేజ్ సిస్టమ్కు అనుబంధంగా, ప్రత్యేకమైన ఏఆర్ఏఐ సర్టిఫైడ్ బ్యాటరీ ప్యాక్ను కూడా ఈ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేశారు. డీఎస్ఐఆర్ గుర్తింపుతో ఆరేళ్లుగా అంకితభావంతో పనిచేస్తున్న కంపెనీ ఇన్ హౌస్ అభివృద్ధి- పరిశోధనా విభాగం ఎలక్ట్రానిక్స్, మెకానికల్ సిస్టమ్స్ మొదలుకొని ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ వరకు అన్ని ప్రధాన భాగాలను డిజైన్ చేయడం, అభివృద్ధి చేయడం, పరీక్షించడం, ధ్రువీకరించడం వంటి సామర్థ్యాలను ఏర్పరచుకుంది. తద్వారా నాణ్యతకు హామీ ఇవ్వడమే కాకుండా, స్వదేశీ విలువను కూడా జోడిస్తోంది.
ఈ ప్రాజెక్ట్లో రిమోట్ డయాగ్నస్టిక్స్, ఓవర్-ది-ఎయిర్ అప్డేట్స్ వంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లను కూడా చేర్చారు. వ్యర్థాలు, కాలుష్య ఉద్గారాలు లేని సుస్థిర తయారీ విధానాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా, ఈ ప్రాజెక్ట్ ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి తోడ్పడటమే కాకుండా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు (ఎస్డీజీ 11: సుస్థిర నగరాలు, సమాజాలు; ఎస్డీజీ 13: వాతావరణ చర్య) నేరుగా సహకరిస్తుంది.
టీడీబీ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ పాఠక్ ఈ ఒప్పందం గురించి మాట్లాడుతూ... " విద్యుత్ ద్విచక్ర వాహనాలలో హై-వోల్టేజ్ టెక్నాలజీ భారతదేశంలో భారీ మార్కెట్ కలిగిన ఈవీలను వేగంగా ప్రవేశపెట్టడానికి కొత్త అవకాశాలను అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్కు మద్దతు ఇవ్వడం ద్వారా, దేశీయ ఆవిష్కరణను వేగవంతం చేయడానికి, స్థానికంగా పరిశోధన- అభివృద్ధి స్సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి, సుస్థిర మొబిలిటీ పరిష్కారాలను దేశంలోనే అభివృద్ధి చేయడానికి టీడీబీ కృషి చేస్తుంది” అన్నారు.
కంపెనీ తరఫున రాప్టీ ఎనర్జీ కంపెనీ సీఈఓ శ్రీ దినేష్ అర్జున్ మాట్లాడుతూ... “టీడీబీ మద్దతు మా దీర్ఘకాలిక ఆర్ అండ్ డి కార్యక్రమానికి ఊతమివ్వడమే కాకుండా, మా హై-వోల్టేజ్ మోటార్సైకిల్ ప్రాజెక్టును విస్తరించే అవకాశం కల్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వాహనాల పరంగా, భారత్ ను నాయకత్వ దశకు నడిపించడంతో పాటు స్వదేశీ, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ప్రయాణ పరిష్కారాలను రూపొందించడంలో ఇది ఒక ముఖ్యమైన దశగా మేం భావిస్తున్నాం” అన్నారు.
***
(रिलीज़ आईडी: 2167917)
आगंतुक पटल : 13