నీతి ఆయోగ్
నీతి ఆయోగ్ 'వికసిత్ భారత్ ఏఐ రోడ్ మ్యాప్' , 'ఫ్రాంటియర్ టెక్ రిపోజిటరీ' ని ప్రారంభించిన శ్రీమతి నిర్మలా సీతారామన్, శ్రీ అశ్వినీ వైష్ణవ్
2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ కార్యక్రమాన్ని వేగిరం చేసే దిశగా ఫ్రాంటియర్ టెక్ హబ్
Posted On:
15 SEP 2025 6:26PM by PIB Hyderabad
నీతి ఆయోగ్ ఇవాళ రెండు వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది. వికసిత్ భారత్ ఏఐ రోడ్ మ్యాప్: వేగవంతమైన ఆర్థికాభివృద్ధికి అవకాశం, ఫ్రాంటియర్ టెక్ హబ్ కింద నీతి ఫ్రాంటియర్ టెక్ రిపోజిటరీ. ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్ పర్సన్ శ్రీ సుమన్ బెరీ, నీతి ఆయోగ్ సీఈఓ శ్రీ బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్.కృష్ణన్ ఈ రోడ్ మ్యాప్ ను ప్రారంభించారు.
ప్రారంభ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల అభివృద్ధికి ఏఐ సాంకేతికతను అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతికత ఆవిష్కరణలో సహకార వ్యవస్థల ప్రాధాన్యతను వివరించారు. నీతి ఆయోగ్ ఫ్రాంటియర్ టెక్ హబ్ తేనెతుట్టె నిర్మాణం వంటిదని, ప్రభుత్వం, పరిశ్రమలు, ఆవిష్కర్తలను ఒకే వ్యవస్థలోకి తీసుకువచ్చి ఆలోచనలను ఆచరణలో పెడుతుందన్నారు. ఫ్రాంటియర్ టెక్నాలజీ రంగంలో భారత్ వెనుకబడకూడదని, ప్రపంచానికి నాయకత్వం వహించేలా భారత్ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని తెలిపారు.
మన జీవన విధానాన్ని, పనితీరుని ఏఐ పూర్తిగా మార్చబోతుందని రైల్వే, సమాచార ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ అన్నారు. వికసిత్ భారత్ కోసం కలలు కనే ఆత్మవిశ్వాసం యువతలో పెరగటమే ఇవాళ్టి అతిపెద్ద మార్పు అని చెప్పారు. నేటి అభివృద్ధి బలంగా, సమ్మిళితంగా, సాంకేతికతతో కూడినదని స్పష్టం చేశారు.
ఏఐ నుంచి ఆచరణాత్మక ఫలితాలను పొందేందుకు ఈ రోడ్ మ్యాప్ కార్యాచరణను రూపొందించింది. ఇందులో రెండు ప్రధాన అంశాలను కీలకంగా ప్రస్తావించింది: (i) ఉత్పాదకత, సామర్థాన్ని పెంచేందుకు పరిశ్రమల్లో ఏఐ వినియోగాన్ని పెంచటం; (ii) జనరేటివ్ ఏఐతో ఆర్ అండ్ డీలో మార్పులు తీసుకువచ్చి, భారత్ ను ఆవిష్కరణ ఆధారిత అవకాశాల్లో ముందుంజలో ఉంచటం. ఈ రోడ్ మ్యాప్ ను ఇక్కడ చూడవచ్చు: https://niti.gov.in/sites/default/files/2025-09/AI-for-Viksit-Bharat-the-opportunity-for-accelerated-economic-growth.pdf
నాలుగు రంగాలు- వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, జాతీయ భద్రతలో దేశవ్యాప్తంగా ప్రభావవంతమైన 200కి పైగా కథనాలను రోడ్ మ్యాప్ కు మద్దతుగా, ఫ్రాంటియర్ టెక్ రిపోజిటరీ ప్రదర్శిస్తుంది. రాష్ట్రాలు, అంకురసంస్థలు టెక్నాలజీని ఉపయోగించి, ప్రజల జీవన విధానాలను ఎలా మారుస్తున్నదీ ఇది చూపిస్తుంది. దీన్ని ఇక్కడ చూడవచ్చు: https://frontiertech.niti.gov.in/
భారత్ 8 శాతం వృద్ధి లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఉత్పాదకత, ఆవిష్కరణల్లో విప్లవాత్మక మార్పు అవసరమని నీతి ఆయోగ్ సీఈఓ శ్రీ బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోటానికి ఏఐ కీలకమని చెప్పారు. వికసిత్ భారత్ కోసం ఏఐ రోడ్ మ్యాప్ ప్రతి రంగానికి ప్రత్యేకమైన, స్పష్టమైన కార్యాచరణను అందిస్తుందని, రాష్ట్రాలు, జిల్లాల్లో టెక్నాలజీని విస్తరించి, ప్రజల జీవనశైలిపై ప్రభావం చూపటానికి ఫ్రాంటియర్ టెక్ రిపోజిటరీ ప్రేరేపిస్తుందని తెలిపారు. సాంకేతికతను విస్తృతంగా వినియోగంలోకి తీసుకొచ్చేందుకు, దాని ప్రభావాన్ని పెంచేందుకు రెండు కార్యక్రమాలను ఆయన ప్రకటించారు. అవి:
-
నీతి ఫ్రాంటియర్ టెక్ ఇంపాక్ట్ అవార్డ్స్ ఫర్ స్టేట్స్ ద్వారా పాలన, విద్య, ఆరోగ్యం, జీవనోపాధి మొదలైన రంగాల్లో టెక్నాలజీ వినియోగంలో ప్రతిభ చూపిన మూడు రాష్ట్రాలను గుర్తించి సత్కరించటమే కాక, గణనీయమైన మార్పులు సాధించటానికి వాటికి సహకరించటం.
భవిష్యత్తులో ఏఐ కన్నా విధ్వంసకర సాంకేతిక మార్పులు చోటుచేసుకుంటాయని నీతి ఆయోగ్ ప్రత్యేక సభ్యురాలు, ఫ్రాంటియర్ టెక్ హబ్ ముఖ్య రూపకర్త శ్రీమతి దేవయాని ఘోష్ అన్నారు. వాటిని ఎదుర్కొని ప్రపంచంలోనే అగ్రస్థానంలో భారత్ నిలవాలంటే.. భవిష్యత్ పోకడలను ముందుగానే గుర్తించాలని, సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని, ప్రపంచ ప్రమాణాలను రూపొందించుకోవాలని, బలమైన భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని చెప్పారు.
ప్రాథమిక స్థాయిలో సాంకేతికతను ఉపయోగించి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన స్టార్టప్ వ్యవస్థాపకులు, జిల్లా కలెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ పరిశ్రమల ప్రముఖులు, ప్రభుత్వాధికారులు వర్చువల్ గా హాజరయ్యారు.
***
(Release ID: 2167348)
Visitor Counter : 2