బొగ్గు మంత్రిత్వ శాఖ
అత్యుత్తమ బొగ్గు, లిగ్నైట్ గనులను సత్కరించే స్టార్ రేటింగ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని ముంబయిలో నిర్వహించిన బొగ్గు మంత్రిత్వ శాఖ
శ్రేష్ఠత కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రధానమంత్రి ఆత్మనిర్భర్, వికసిత్ భారత్ దార్శనికతకు
సహకరించాలని బొగ్గు రంగానికి సంబంధించిన భాగస్వాములను కోరిన బొగ్గు, గనుల శాఖ మంత్రి
బొగ్గు గనులున్న ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక అభివృద్ధికి, ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు,
జీవన నాణ్యతను మెరుగుపరచడానికి గనుల తవ్వకం ఉత్ప్రేరకంగా పనిచేయాలి: కిషన్ రెడ్డి
ఉత్పత్తి సామర్థ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ, శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా గనులను మూసివేయటం,
సమాజ సంక్షేమానికి బాధ్యతాయుతంగా గనుల తవ్వకం సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: సతీష్ చంద్ర దూబే, సహాయ మంత్రి, బొగ్గు-గనుల శాఖ
బొగ్గు రంగంలో పారదర్శకత, సామర్థ్యాన్ని మెరుగుపరించేందుకు.. అందరికీ సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు కొత్తగా రూపొందించిన ఇంటరాక్టివ్ డ్యాష్బోర్డ్తో కూడిన సీసీఓ వెబ్సైట్ ఆవిష్కరణ
Posted On:
04 SEP 2025 5:07PM by PIB Hyderabad
భద్రత, పర్యావరణ సుస్థిరత, నిర్వహణ తీరులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బొగ్గు, లిగ్నైట్ గనులను గుర్తించేందుకు స్టార్ రేటింగ్ అవార్డు ప్రదానోత్సవాన్ని బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ రోజు ముంబయిలో నిర్వహించింది. కేంద్ర బొగ్గు, గనుల మంత్రి శ్రీ జీ. కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బొగ్గు- గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే, బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్లు సమక్షంలో ఆయన.. భద్రత, పర్యావరణ పరిరక్షణ, శాస్త్రీయమైన గనుల తవ్వకం, ఉత్పాదకత, సమాజ సంక్షేమం వంటి విభాగాల్లో రాణించిన గనులకు అవార్డులను అందించారు. ఈ సందర్భంగా ఇంటరాక్టీవ్ డ్యాష్బోర్డ్తో కూడిన కొత్త సీసీఓ వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ రంగంలో పారదర్శకత, సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు.. సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు దీన్ని తీసుకొచ్చారు.
భద్రత, పర్యావరణపరమైన చర్యలు, ఉత్పాదకత విషయంలో అసాధారణ పనితీరును కనబరిచిన గనులను స్టార్ రేటింగ్ అవార్డుల ద్వారా బొగ్గు మంత్రిత్వ శాఖ గుర్తిస్తోంది. ఈ రంగంలో ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించాలన్న మంత్రిత్వ శాఖ నిబద్ధతను బలోపేతం చేస్తూ అధిక పనితీరు కనబరిచిన ఇతర గనులకు ధ్రువీకరణ పత్రాలను, అవార్డులను కూడా అందించారు. బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ.కిషన్ రెడ్డి అత్యుత్తమ పనితీరు కనబరిచిన గనులకు ఫైవ్- స్టార్ అవార్డులను ప్రదానం చేశారు. భద్రత, సుస్థిరత విషయంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ భారతదేశ ఇంధన భద్రతను నిర్ధారించడంలో ఇవి పోషిస్తోన్న పాత్రను ఆయన ప్రశంసించారు. స్టార్ రేటింగ్ కార్యక్రమం కేవలం అవార్డులకు సంబంధించినది మాత్రమే కాదని.. బాధ్యతాయుతమైన గనుల తవ్వకానికి ఇవి ఒక ప్రమాణమని, అన్ని గనులు ఫైవ్-స్టార్ హోదా కోసం కృషి చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో కార్బన్ సంగ్రహణ, వినియోగం- నిల్వ (సీసీయూఎస్), పరిశోధన- అభివృద్ధిపై నిర్వహించిన హ్యాకథాన్ విజేతలకు కూడా అవార్డులను అందించారు. ఇది సుస్థిర సాంకేతిక పరిజ్ఞానాలలో ఆవిష్కరణలను పెంపొందించడంలో బొగ్గు మంత్రిత్వ శాఖ నిబద్ధతను తెలియజేస్తోంది. రెండు ముఖ్యమైన విధివిధానాలను కూడా ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఇందులో మొదటిది లైవ్స్ (ఎల్.ఐ.వీ.ఈ.ఎస్) కాగా.. రెండోది ఆర్థ. ప్రపంచ స్థాయి ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా బాధ్యతాయుతమైన, సుస్థిరమైన గనుల మూసివేతలకు ప్రామాణికంగా పనిచేసేందుకు రూపొందించిన అభ్యాసన గైడ్.. లైవ్స్. గనులకు సంబంధించిన ప్రాంతాలను పునరుద్ధరించిన అనంతరం ఉత్పాదక, పర్యావరణ అనుకూల ఆస్తులుగా మార్చే దిశగా పెట్టుబడులను రాబట్టే లక్ష్యంతో రూపొందించిన హరిత ఫైనాన్సింగ్ విధానం ఆర్థ.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ. కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో కీలకోపన్యాసం చేశారు. అత్యున్నత భద్రత, పర్యావరణ ప్రమాణాలకు కట్టుబడి.. నిర్వహణ తీరు మెరుగ్గా ఉండేలా చూసుకుంటూ అసాధారణ పనితీరు కనబరిచినందుకు అవార్డు గ్రహీతలందరినీ ఆయన అభినందించారు. బొగ్గును గ్యాస్గా మార్చటాన్ని వేగవంతం చేయడంతో పాటు విలువను జోడించటం, ఉద్గారాలను తగ్గించటం, కొత్త పారిశ్రామిక అవకాశాల ద్వారాలను తెరిచేందుకు స్వచ్ఛ బొగ్గు సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించాలని ప్రధానంగా పేర్కొన్నారు. దిగుమతులపై ఆధారపడటం నుంచి బొగ్గు ఎగుమతుల కోసం సామర్థ్యాలను పెంపొందించే దిశగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. దీనితో పాటు వాషరీలను మెరుగ్గా ఉపయోగించటం ద్వారా బొగ్గు నాణ్యతను మెరుగుపరచాలని తెలిపారు.
సమాజ కేంద్రీకృత, ప్రగతిశీల గనుల మూసివేత కార్యకలాపాలు, పెద్ద ఎత్తున అడవుల పెంపకం, కార్మికుల భద్రత - సంక్షేమం… గనుల తవ్వకాలకు సంబంధించిన ప్రధాన అంశాల్లో ఆవిష్కరణలు, పర్యావరణ బాధ్యత, సుస్థిరత, పోటీతత్వాన్ని పొందుపరిచే అంశానికి ఉన్న ప్రాముఖ్యతను కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి ప్రధానంగా పేర్కొన్నారు. ఆవిష్కరణలను ఉపయోగించటం ద్వారా దేశ బొగ్గు రంగం వనరులను మెరుగ్గా వినియోగించుకుంటూ ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉండగలదని అన్నారు. ‘సంస్కరణ, ప్రదర్శన, పరివర్తన’ అనేది కేవలం నినాదం కాదని.. ఇదొక విధి అని పేర్కొన్నారు. భాగస్వాములంతా శ్రేష్ఠత కోసం నిరంతరం కృషి చేయాలని… ప్రధానమంత్రి ఆత్మనిర్భర్, వికసిత్ భారత్ దార్శనికతకు క్రియాశీలకంగా సహకరించాలని కోరారు.
బొగ్గు, లిగ్నైట్ గనులకు 2023-24 సంవత్సరానికి సంబంధించిన ఈ స్టార్ రేటింగ్ అవార్డుల ప్రదానోత్సవంలో బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే మాట్లాడుతూ... ఉత్పత్తి సామర్థ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ, శాస్త్రీయపరమైన గనుల మూసివేత, సమాజ సంక్షేమానికి గనుల తవ్వకం బాధ్యతాయుతంగా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానంగా చెప్పారు. స్టార్ రేటింగ్ విధానం సామర్థ్యానికి సంబంధించిన ప్రామాణికతగానే కాకుండా భూమి పునరుద్ధరణ, జీవవైవిధ్య పరిరక్షణ, కార్మికుల భద్రత, ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాల సంక్షేమాన్ని నిర్ధారించడానికి కూడా ఒక ప్రమాణంగా పనిచేస్తుందని ప్రధానంగా చెప్పారు. సామర్థ్యం, భద్రత, పర్యావరణ పరిరక్షణ ప్రయోజనాలను దేశవ్యాప్తంగా సాకారం చేసుకునేలా ఉత్తమ పద్ధతులను అన్ని గనులలో అవలంభించే అంశానికి ఉన్న ప్రాముఖ్యతను ఆయన పునరుద్ఘాటించారు. అవార్డు గెలుచుకున్న గనుల కంపెనీలను ఆయన అభినందించారు. బొగ్గు ఉన్న ప్రాంతాలలో సామాజిక-ఆర్థిక అభివృద్ధికి, ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు, జీవన నాణ్యతను మెరుగుపరచడానికి గనుల తవ్వకం అనేది ఒక ఉత్ప్రేరకంగా పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు.
పనితీరు, పారదర్శకత విషయంలో ప్రపంచ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా కొత్త ప్రమాణాలను నిర్దేశించినందుకు అవార్డు గెలుచుకున్న గనులను బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్ ప్రశంసించారు. స్టార్ రేటింగ్ విధానం నిరంతరం మెరుగురుచుకునేందుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని.. ప్రతి గని చట్టపరమైన అంశాలను పాటించే స్థాయిని దాటి అన్ని రకాల కార్యకలాపాలలో శ్రేష్ఠతను తీసుకొచ్చేలా ప్రేరేపిస్తుందని ప్రధానంగా పేర్కొన్నారు. గత సంవత్సరంలో భారత్ ఒక బిలియన్ టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి, సరఫరా చేసి చారిత్రాత్మక విజయాన్ని సాధించిందనదని.. ఇది ఈ రంగంలోని స్థిరమైన వృద్ధి, ధృడత్వాన్ని తెలియజేస్తోందని అన్నారు. ఇంధన భద్రతను పర్యావరణపరమైన చర్యలతో సమతుల్యం చేస్తూ నేటి గనుల తవ్వకం బాధ్యతాయుతంగా, సుస్థిరతతో, పోటీతత్వంతో ఉండాలని పేర్కొన్నారు. ప్రతి గని బాధ్యతాయుతమైన తవ్వకంతో మరింత ఉన్నత ప్రమాణాల కోసం కృషి చేయాలని.. తద్వారా స్వావలంబన కలిగిన వికసిత్ భారత్ను నిర్మించేందుకు సహాయపడాలని అన్నారు.
అదనపు కార్యదర్శి రూపిందర్ బ్రార్, బొగ్గు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ రంగ గనుల తవ్వకం కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వేడుకలో ప్రతిభ, సృజనాత్మకత, దృఢ సంకల్పాన్ని తెలియజేస్తూ దివ్యాంగులైన పిల్లలు సాంస్కృతిక ప్రదర్శన చేశారు. ఈ స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణను నిలిచింది. సమాజంలోని అందరి సామర్థ్యాలు, విజయాలను వేడుక చేసుకోవటం.. అందరినీ కలుపుకొని వెళ్లటానికి ఉన్న ప్రాముఖ్యతను ఇది ప్రధానంగా తెలియజేసింది.
(Release ID: 2164307)
Visitor Counter : 2