అంతరిక్ష విభాగం
దేశాన్ని "విశ్వబంధు" భారత్ గా ఆవిష్కరించిన శుభాన్షు శుక్లా అంతరిక్ష ప్రయోగాలు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లో భారత తొలి వ్యోమగామి చేరిక దేశ అంతరిక్ష ప్రయాణంలో
కొత్త అధ్యాయానికి నాంది: డాక్టర్ జితేంద్ర సింగ్
అంతరిక్ష సంస్కరణలు, స్టార్టప్ లు 8 బిలియన్ డాలర్ల అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో వేగవంతమైన వృద్ధిని ప్రేరేపిస్తాయి: లోక్ సభలో మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
వికసిత భారత్ రోడ్మ్యాప్లో భాగంగా 2027 నాటికి గగన్యాన్, 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రం, స
2040 నాటికి చంద్రునిపై అడుగు: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
18 AUG 2025 6:44PM by PIB Hyderabad
భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్షంలో నిర్వహించిన ప్రయోగాలు దేశాన్ని విశ్వబంధుగా మార్చాయని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, ఎర్త్ సైన్సెస్ శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర), పీఎంవో, అణుశక్తి విభాగం, అంతరిక్ష, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ ప్రయోగాలు ఒక భారతీయుడు స్వదేశీ సాధనాలతో చేసినప్పటికీ, వాటి లాభాలు మొత్తం మానవాళికి అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. స్థూలంగా, ఈ ప్రయోగాలు జీవశాస్త్రం, వృక్ష శరీరధర్మ శాస్త్రానికి సంబంధించినవి.
2047 నాటికి వికసిత భారత్ కోసం అంతరిక్ష కార్యక్రమం కీలక పాత్ర అనే అంశంపై ఈ రోజు లోక్ సభలో ప్రత్యేక చర్చను ప్రారంభించిన డాక్టర్ జితేంద్ర సింగ్... గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర కేవలం ఒక అసాధారణ విజయం మాత్రమే కాదని, తక్కువ ఖర్చుతో కూడుకున్న అంతరిక్ష సాంకేతికత, అంతర్జాతీయ సహకారం, స్వదేశీ ఆవిష్కరణలలో పెరుగుతున్న భారత్ సామర్థ్యానికి నిదర్శనమని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో భారత మొదటి వ్యోమగామి ఉండటాన్ని "చారిత్రాత్మక విజయ ప్రస్థానం"గా మంత్రి అభివర్ణించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా భారత్ ప్రయాణంతో ఈ విజయాన్ని అనుసంధానించారు.
ఐఎస్ఎస్ మిషన్ను ప్రపంచంలోని ఇతర దేశాల వ్యయంతో పోలిస్తే ఎంతో తక్కువ ఖర్చులో పూర్తి చేయగలిగినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇది భారతదేశం తన మేధో వనరులను అధునాతన శాస్త్రీయ ప్రణాళికతో సమన్వయం చేసుకునే సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. “ఈ విజయం మన శాస్త్రవేత్తల ప్రతిభను, అలాగే సంస్కరణల ద్వారా అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అనుమతించినప్పుడు ఏర్పడిన అనుకూల వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది” అని మంత్రి అన్నారు. అలాగే, ప్రస్తుతం 300కు పైగా అంతరిక్ష అంకుర సంస్థలు భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన తెలిపారు.
ఐఎస్ఎస్ లో జీవశాస్త్రం, వ్యవసాయం, బయోటెక్నాలజీ, మెదడుకు సంబంధించిన పరిశోధనా రంగాల్లో... శుక్లా ప్రయోగాలు చేశారనీ, ఇవన్నీ భారతదేశంలోనే రూపకల్పన చేసి అభివృద్ధి చేసినవే కావడంతో, ఆత్మనిర్భర్ భారత్ దృష్టిని ఇవి మరింత బలపరుస్తాయని మంత్రి అన్నారు. ఈ అధ్యయనాల ప్రయోజనాలు అంతరిక్షానికి మాత్రమే పరిమితం కాకుండా, ఆరోగ్యం, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి రంగాలకు కూడా ఉపయోగపడతాయని ఆయన స్పష్టం చేశారు.
భారత అంతరిక్ష పురోగతిని వేగవంతం చేసే సానుకూల విధాన వ్యవస్థను అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని డాక్టర్ జితేందర్ సింగ్ ప్రశంసించారు. 2018 లో ఎర్రకోట నుంచి ప్రకటించిన భారత అంతరిక్ష ప్రయాణ లక్ష్యాలు ఇప్పుడు నాసా, అక్సియమ్ స్పేస్, స్పేస్ఎక్స్ వంటి సంస్థలతో సాంకేతిక సహకారాలకు దారి వేసిందని ఆయన పేర్కొన్నారు.
2026లో వ్యోమిత్ర హ్యూమనాయిడ్ మిషన్, 2027లో గగన్ యాన్ కార్యక్రమం కింద తొలి భారతీయ వ్యోమగామి ప్రయాణం, 2035 నాటికి సొంతంగా భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, 2040 నాటికి చంద్రుడిపై భారతీయ వ్యోమగామి అడుగు పెట్టడం భారత్ నిర్దేశించుకున్న పెద్ద లక్ష్యాలని శ్రీ జితేంద్ర సింగ్ వివరించారు. “2047కి కొన్ని సంవత్సరాల ముందే ఒక యువ భారతీయుడు చంద్రుని ఉపరితలం నుంచి ‘వికసిత్ భారత్’ ఆవిర్భావాన్ని ప్రకటిస్తాడు” అని ఆయన సభాముఖంగా ప్రగాఢ విశ్వాసాన్ని వెలిబుచ్చారు.
“ఇది కేవలం ఒక వ్యోమగామి గురించి మాత్రమే కాదు. ప్రపంచంలో భారత్ స్థానానికి, నక్షత్రాలను అందుకోవాలనే ప్రతి ఒక్కరి ఆలోచనలకు సంబంధించినది” అని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.
***
(Release ID: 2157732)