రక్షణ మంత్రిత్వ శాఖ
భారత సైన్యం ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ 26వ వార్షికోత్సవం
Posted On:
26 JUL 2025 3:05PM by PIB Hyderabad
దేశ వ్యాప్తంగా అందరూ 26వ కార్గిల్ విజయ్ దివస్ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కార్గిల్ యుద్ధంలో సైనికుల శౌర్యం, అత్యున్నత త్యాగాలను గౌరవిస్తూ భారత సైన్యం దేశవ్యాప్త భాగస్వామ్యంతో సగర్వంగా కార్గిల్ విజయ దివస్ వేడుకలను నిర్వహించింది. రెండు రోజుల పాటు ద్రాస్లోని కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద జరిగిన ప్రధాన కార్యక్రమానికి కార్మిక - ఉపాధి, యువజన వ్యవహారాలు - క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కవిందర్ గుప్తా, ఆర్మీ స్టాఫ్ చీఫ్ (సీఓఏఎస్) జనరల్ ఉపేంద్ర ద్వివేది హాజరయ్యారు. సైనిక దళాల సీనియర్లు, పౌర ప్రముఖులు ఈ సందర్భంగా నివాళులు అర్పించారు. అమరవీరుల జ్ఞాపకార్థం 545 దీపాలను వెలిగించారు. వీర నారులు, ప్రాణ త్యాగం చేసిన చేసిన వారి బంధువులను సత్కరించారు. భారత్, నేపాల్ వ్యాప్తంగా ఉన్న 545 మంది అమరవీరుల కుటుంబాలను సైన్యం కలిసింది. ఇండస్ వ్యూపాయింట్, ఈ-శ్రద్ధాంజలి పోర్టల్, క్యూఆర్ ఆధారిత ఆడియో గేట్వే వంటి సాంస్కృతిక ప్రాజెక్టులను సీఓఏఎస్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రారంభించారు. ఆధునికీకరణ, స్వావలంబన దిశగా మొబిలిటీ, నిఘా, ఆయుధ శక్తిలో అత్యాధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, మతపరమైన ప్రార్థనలు, చర్చాపూర్వక కార్యక్రమాలు దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికులతో ఉన్న లోతైన భావోద్వేగ సంబంధాన్ని తెలియజేశాయి.
25 జూలై 2025 - యుద్ధ జ్ఞాపకాలు, శౌర్య సంధ్య
ద్రాస్లోని లామోచెన్ వ్యూపాయింట్లో యుద్ధ వివరాలను గుర్తు చేసుకోవటంతో కార్యక్రమం ప్రారంభమైంది. కార్గిల్ వివాదం జరిగిన అదే పర్వత శిఖరాలను చూస్తూ మాజీ సైనికులు, ప్రస్తుతం విధుల్లో ఉన్న వారు తమ అనుభవాలను గుర్తుకు తెచ్చుకున్నారు. త్యాగం, ధైర్యం, మనోధైర్యానికి సంబంధించిన కథకు జీవం పోస్తూ ఉత్తేజకరమైన దృశ్య శ్రవణ ప్రదర్శనను ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్ సమక్షంలో గౌరవ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కార్గిల్ యుద్ధ వీరుల బంధువులను సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వారి అచంచల ధైర్యసాహసాలు, త్యాగాలను గుర్తు చేశారు. ఐక్యత, కృతజ్ఞతా భావాన్ని తెలియజేసేలా విజయ్ భోజ్ అనే స్మారక సంయుక్త భోజనం కార్యక్రమంలో ప్రముఖులంతా పాల్గొన్నారు. సైనికులు, ఎన్సీసీ కేడెట్లు, ఆర్మీ గుడ్విల్ పాఠశాలల విద్యార్థుల ఉత్సాహభరితమైన ప్రాంతీయ సాంస్కృతిక ప్రదర్శనల్లో దేశభక్తిని ప్రదర్శించారు. కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ… స్వార్మ్ డ్రోన్లు, రవాణా డ్రోన్లు, ఎఫ్పీవీ డ్రోన్లు వంటి వాటితో సాంకేతిక ప్రదర్శనలు జరిగాయి. ఎత్తైన భూబాగాల్లో అత్యాధునిక సాంకేతిక ఆయుధాలను, పరిష్కారాలను ఉపయోగిస్తూ సైన్యం సంసిద్ధంగా ఉండటాన్ని ఇది తెలియజేసింది.
సాయంత్రం కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద అమరులైన వారికి హృదయపూర్వక నివాళిగా 'శౌర్య సంధ్య' కార్యక్రమం జరిగింది. సంగీతంతో వీరత్వ గాథలను తెలియజేస్తూ ఆర్మీ బ్యాండ్ చేపట్టిన 'గౌరవ గాథ' ప్రదర్శనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జాతి ఐక్యతను ప్రతిబింబిస్తూ అన్ని ప్రధాన మత విశ్వాసాలకు చెందిన ఐదుగురు గురువులు.. అమరవీరుల కోసం ప్రార్థనలు చేశారు. ఆపరేషన్ విజయ్లో తన ప్రాణాలను అర్పించిన సైనికులను సూచించేలా మొత్తం 545 దీపాలను వెలిగించారు.
ప్రాణాలు త్యాగం చేసిన తొమ్మిది మంది వీరుల దగ్గరి బంధువులను తూర్పు కమాండ్ జనరల్ కమాండింగ్ ఆఫీసర్ ఇన్ ఛీప్, లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ సత్కరించారు. ఇది ఈ సాయంత్రానికి అత్యంత కృతజ్ఞతాపూర్వక క్షణంగా నిలిచింది. పౌర, సైనిక ప్రముఖులు.. వీర నారులు, వీర మాతలు, స్థానిక ప్రజలు సహా 400 మందికి పైగా విశిష్ట అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
2025 జూలై 26 - కార్గిల్ విజయ్ దివస్
కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాలను సమర్పించటంతో ప్రధాన కార్యక్రమం ప్రారంభమైంది. గౌరవ కార్మిక - ఉపాధి, యువజన వ్యవహారాల - క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ.. గౌరవ రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్.. గౌరవ లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కవిందర్ గుప్తా.. సీఓఏఎస్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మొదట అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం సీనియర్ సైనిక అధికారులు, శౌర్య అవార్డు గ్రహీతలు, వీర నారులు, యుద్ధంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. భావోద్వేగాలను రేకెత్తిస్తూ, జ్ఞాపకాలను గుర్తు చేస్తూ "లాస్ట్ పోస్ట్" ధ్వని లోయ అంతటా ప్రతిధ్వనించింది.
సీఓఏఎస్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలకోవన్యాసం చేశారు. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలర్పించిన సైనికులకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. వారి అచంచల ధైర్యాన్ని , త్యాగాన్ని కొనియాడారు. 1999లో భారత సైన్యం సాధించిన చరిత్రాత్మక విజయం, ఇటీవలి ఆపరేషన్ సిందూర్ సందర్భంగా దేశ సార్వభౌమత్వాన్ని ధృడంగా కాపాడిన తీరును ఆయన గుర్తు చేశారు. భారత్ శాంతిని కోరుకుంటుందని, అయితే రెచ్చగొట్టే చర్యలకు నిర్ణయాత్మకంగా స్పందిస్తుందని ప్రధానంగా చెబుతూ.. ప్రజలకు ఎలాంటి హాని కలిగించకుండా ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై సైన్యం ఖచ్చితత్వంతో విజయవంతంగా దాడి చేసిందని అన్నారు. 'రుద్ర' ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్లు, 'భైరవ్' తేలికపాటి కమాండో బెటాలియన్లు, 'శక్తిబాన్' శతఘ్ని రెజిమెంట్లు, 'దివ్యాస్త్ర' బ్యాటరీలు, డ్రోన్లతో ఉన్న పదాతిదళ బెటాలియన్లు, స్వదేశీ వైమానిక రక్షణ వ్యవస్థల ద్వారా భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శక్తిగా సైన్యం రూపాంతరం చెందడాన్ని సీఓఏఎస్ వివరించారు. జాతి నిర్మాణంలో ముఖ్యంగా సరిహద్దు మౌలిక సదుపాయాలు, పర్యాటకం, ఆర్థిక వ్యవస్థ, మాజీ సైనికుల సంక్షేమంలో సైన్యం పోషిస్తోన్న పాత్రను ఆయన ప్రశంసించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ను తయారు చేయటంలో సైనికుల పాత్ర ఎప్పటికీ ఉంటుందని అన్నారు. నిజాయితీ, అంకితభావంతో దేశానికి సేవ చేయాలని యువతకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడటానికి దృఢమైన నిబద్ధతతో ఉన్నట్లు తెలియజేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
సీఓఏఎస్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రారంభించిన ప్రాజెక్టులు:
* సింధు వ్యూ పాయింట్: బటాలిక్ సెక్టార్లో ఇది ఉంది. పాకిస్తాన్ ఆక్రమిత బాల్టిస్తాన్లోకి ప్రవేశించే సింధు నదిని ఇక్కడి నుంచి చూడొచ్చు. ఇది యుద్ధ ప్రాంత పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది.
* ఈ-శ్రధాంజలి పోర్టల్: కార్గిల్ అమరవీరులకు ప్రజలు వర్చువల్గా నివాళులు అర్పించడానికి ఉద్దేశించిన వెబ్సైట్ ఇది. ఇది దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తుంది.
* క్యూఆర్ ఆధారిత ఆడియో గేట్వే: యుద్ధ స్మారకం వద్ద ఉన్న దీనితో డిజిటల్ పరికరాలను ఉపయోగించి చారిత్రక వివరాలను కథన రూపంలో తెలియజేసే సౌకర్యం.
‘సీఓఏఎస్’ ప్రశంసా కార్డులను- అర్హులయిన వారికి ప్రదానం చేశారు. సైనికులు, వీరు నారులు, అమరవీరుల కుటుంబాలతో సంభాషించారు. వారి సంక్షేమం పట్ల సైన్యానికి ఉన్న నిరంతర నిబద్ధతను మరోసారి వ్యక్తం చేశారు.
వారసత్వాన్ని కొనసాగించటం:
ఈ సంవత్సరం అనేక కీలక కార్యక్రమాలను చేపట్టారు
* అమరుల కుటుంబాలను చేరుకునేందుకు ప్రత్యేక కార్యక్రమం: 27 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు, నేపాల్లోని 545 మంది అమరవీరుల బంధువులను 37 భారత ఆర్మీ బృందాలు సందర్శించాయి. ఇది వారి కుటుంబాలకు ఓదార్పునిచ్చింది. వారిలో గర్వాన్ని నింపింది.
* చరిత్రలో ఈ రోజు( ఆన్దిస్డే) కార్యక్రమం: యువతలో అవగాహనను వ్యాప్తి చేయడానికి డిజిటల్ వేదికల ద్వారా కథలు చెప్పే కార్యక్రమంతో కార్గిల్ యుద్ధాన్ని కళ్ల ముందు ఉంచారు.
* సాంస్కృతిక, సాహాస కార్యక్రమాలు: కార్గిల్, ద్రాస్, బటాలిక్ ప్రాంతాల్లో నిర్వహించారు. స్థానికులు, విద్యార్థులు, మాజీ సైనికులు, ప్రజలు ఉత్సహంగా పాల్గొన్నారు.
సామర్థ్య ప్రదర్శన: సాంకేతికత ఆధారిత పరివర్తన
ఆధునికీకరణ, కార్యాచరణ సంసిద్ధతతో పాటు ముఖ్యంగా ఎత్తయిన ప్రాంతాల్లో యుద్ధానికి సంబంధించిన సామర్థ్య ప్రదర్శన కార్యక్రమాన్ని భారత సైన్యం నిర్వహించింది. “సాంకేతిక సౌలభ్యం: గ్రహించు, ఆవిష్కరించు, ఏకీకృతం’’
అనే ఇతివృత్తం కింద జరిగిన ఈ ప్రదర్శన చలనశీలత, నిఘా, ఆయుధ సామర్థ్యం, పదాతిదళ వ్యవస్థలలో పురోగతిని ప్రధానంగా తెలియజేసింది.
ద్రాస్ పర్వత శిఖరాల వెనుక సూర్యుడు అస్తమిస్తుండగా దేశ గౌరవాన్ని, త్యాగానికి చిహ్నంగా కార్గిల్ యుద్ధ స్మారకం.. త్రివర్ణ పతాక రంగుల్లో ప్రకాశించింది. 26వ కార్గిల్ విజయ్ దివాస్ కేవలం చరిత్రకు సంబంధించినది మాత్రమే కాదు, సైనికులు ఎప్పటికి దేశ ఆత్మలో శాశ్వతంగా ఉంటారని తెలియజేయటమే.
‘గొప్ప దేశం తన వీరులను స్మారకాల్లో మాత్రమే కాకుండా పొందుపరుస్తుంది”
‘‘కృతజ్ఞతాపూర్వక దేశం… తన వీరుల్ని కేవలం శిలారూపంలోనే కాదు, జ్ఞాపకాల్లో భద్రం చేసుకుంటుంది’’
***
(Release ID: 2148933)