రక్షణ మంత్రిత్వ శాఖ
హైదరాబాద్లో డీఆర్డీఓకు చెందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ క్షిపణి కాంప్లెక్సును సందర్శించిన కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి
Posted On:
18 JUL 2025 1:14PM by PIB Hyderabad
హైదరాబాద్ డీఆర్డీఓకు చెందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ క్షిపణి కాంప్లెక్సును కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్ ఈ నెల 16, 17 తేదీల్లో సందర్శించారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల (డీఆర్డీఎల్), రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ)లతో పాటు మిసైల్ క్లస్టర్ ల్యాబ్స్లో భాగంగా ఉన్న అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ (ఏఎస్ఎల్) చేపడుతున్న క్షిపణులు, ఆయుధ వ్యవస్థలకు సంబంధించిన కార్యక్రమాన్ని మంత్రి ఈ సందర్భంగా సమీక్షించారు.
డీఆర్డీఎల్ లో కీలక విభాగాలైన అస్త్ర ఎంకే I అండ్ II, స్క్రాంజెట్ ఇంజిన్ రూపకల్పన కేంద్రాలతో పాటు స్వల్ప శ్రేణి దూర లక్ష్యాలను ఛేదించడానికి ఉపరితలం నుంచి నింగిలోకి నిలువుగా ప్రయోగించడానికి అనువైన క్షిపణి రూపకల్పన కేంద్రాలను కూడా రక్షణ శాఖ సహాయ మంత్రి సందర్శించారు. ఈ ప్రాజెక్టుల పురోగతి ఏ స్థితిలో ఉన్నదీ ప్రముఖ శాస్త్రవేత్త, డైరెక్టర్ జనరల్ (మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్) శ్రీ యు. రాజబాబుతో పాటు డీఆర్డీఎల్ డైరెక్టర్ శ్రీ జి.ఎ. శ్రీనివాసమూర్తి మంత్రికి వివరించారు.
వివిధ కీలక పనులను నిర్వహిస్తున్న రీసెర్చ్ సెంటర్ ఇమారత్ విభాగాలను కూడా శ్రీ సంజయ్ సేథ్ సందర్శించారు. ఈ సందర్భంగా... స్వదేశీ నావిగేషన్ సిస్టమ్స్, ఏవియేషన్ సిస్టమ్స్, ఆన్బోర్డ్ కంప్యూటర్ విభాగంతో పాటు ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సీకర్ సదుపాయాల పురోగతిని ఆర్సీఐ డైరెక్టర్ శ్రీ అనింద్య బిశ్వాస్ మంత్రికి వివరించారు.
దేశీయంగా అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను రూపొందిస్తూ ‘ఆత్మనిర్భర్ భారత్’ (స్వయంసమృద్ధ భారత్) ఆవిష్కారంలో కీలకపాత్రను పోషిస్తున్నారంటూ డీఆర్డీఎల్ శాస్త్రవేత్తలను రక్షణ శాఖ సహాయ మంత్రి ప్రశంసించారు. ప్రస్తుత పరిస్థితులలో ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనే విధంగా శాస్త్రవేత్తలు... సాయుధ దళాలను బలోపేతం చేయాలని ఆయన సూచించారు.
***
(Release ID: 2145866)