సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో భారత 44వ ప్రదేశంగా మరాఠా సైనిక స్థావరాలు
Posted On:
11 JUL 2025 10:08PM by PIB Hyderabad
యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో భారత 44వ వారసత్వ ప్రదేశంగా ‘మరాఠా సైనిక స్థావరాల’కు స్థానం లభించింది. దీనికి సంబంధించి 2024-25కుగాను భారత్ అధికారిక ప్రతిపాదనను ఆమోదిస్తూ ప్రపంచ వారసత్వ కమిటీ 47వ సమావేశం ప్రశంసనీయ నిర్ణయం తీసుకుంది. ఈ అంతర్జాతీయ గుర్తింపుతో నిత్య చైతన్య భారత సాంస్కృతిక వారసత్వానికి అరుదైన గౌరవం దక్కింది. విభిన్న వాస్తుశిల్ప వైభవం, ప్రాంతీయ వైశిష్ట్యం, చారిత్రక కొనసాగింపు సంప్రదాయాలను ఇది ప్రస్ఫుటం చేస్తుంది.
భారత్కు ఈ చారిత్రక ఘనత దక్కడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మంత్రిమండలిలో తన సహచరుడైన సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్లతో కలసి హర్షం ప్రకటిస్తూ, దేశ ప్రజలందరికీ అభినందనలు తెలిపారు.
భారత్లో మరాఠా సైనిక స్థావరాలు
మరాఠా సామ్రాజ్యం 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దందాకా కొనసాగిన నేపథ్యంలో 12 అసాధారణ దుర్గాలతో కూడిన సైనిక స్థావరాలు నాటి పాలకుల వ్యూహాత్మక సైనిక దృక్కోణం, నిర్మాణ చతురతకు నిదర్శనాలుగా నిలిచాయి.
సింధుదుర్గ్ కోట
కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను 2024 జనవరిలో ప్రపంచ వారసత్వ కమిటీ పరిశీలనకు పంపింది. అనంతరం సలహా సంస్థలతో పలుమార్లు సాంకేతిక సమావేశాలు సహా ప్రతిపాదిత ప్రదేశాల సమీక్షకు ‘ఐసీవోఎంవోఎస్’ బృందం సందర్శన, తదితర 18 నెలల నిశిత, సుదీర్ఘ ప్రక్రియ కొనసాగింది. అనంతరం ఈ రోజు సాయంత్రం పారిస్ నగరంలోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కమిటీ సభ్యులు చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.
ప్రతిపాదిత ప్రదేశాలలో మహారాష్ట్రలోని సల్హెర్, శివనేరి, లోహ్గడ్, ఖండేరి, రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, సువర్ణదుర్గ్, పన్హాల, విజయదుర్గ్, సింధుదుర్గ్, తమిళనాడులోని జింజి కోట ఉన్నాయి.
రాయ్గఢ్ కోట
ప్రతాప్గఢ్ కోట
శివనేరి కోట, లోహ్గడ్, రాయ్గడ్, సువర్ణదుర్గ్, పన్హాల కోట, విజయదుర్గ్, సింధుదుర్గ్, జింజి కోట భారత పురావస్తు అధ్యయన విభాగం సంరక్షణలో ఉన్నాయి. అలాగే సల్హెర్ కోట, రాజ్గఢ్, ఖండేరి కోట, ప్రతాప్గఢ్ మహారాష్ట్ర ప్రభుత్వ పురావస్తు-మ్యూజియంల డైరెక్టరేట్ సంరక్షణలో ఉన్నాయి.
సువర్ణదుర్గ్ కోట
తీరప్రాంత శిబిరాల నుంచి పర్వతాలపై బలమైన కోటల దాకా విభిన్న ప్రదేశాల్లోగల ఈ దుర్గాలు భౌగోళిక ప్రాధాన్యంతోపాటు అత్యాధునిక వ్యూహాత్మక రక్షణ ప్రణాళికపై అవగాహనను ప్రతిబింబిస్తాయి. అలాగే ఇవన్నీ భారతదేశంలో దుర్గాల సంప్రదాయాన్ని ఆవిష్కరిస్తూ, ప్రాంతీయానుసరణను విశదీకరిస్తూ సమగ్ర సైనిక స్థావర వలయాన్ని కళ్లకు కడతాయి.
సల్హెర్, శివనేరి, లోహ్గఢ్, రాయ్గఢ్, రాజ్గఢ్, జింజి కోటలు పర్వత ప్రాంతాల్లో నిర్మించినవి కావడంతో వీటిని పర్వత దుర్గాలుగా వ్యవహరిస్తారు. దట్టమైన అడవులలోగల ప్రతాప్గఢ్ను పర్వత-అటవీ దుర్గంగా వర్గీకరించారు. పీఠభూమిపైగల పన్హాలాను పర్వత-పీఠభూమి కోటగా పేర్కొన్నారు. తీరప్రాంతం వెంబడిగల విజయదుర్గం ఓ కీలక తీరప్రాంత కోట కాగా- ఖండేరి, సువర్ణదుర్గ్, సముద్రం మధ్యలోగల సింధుదుర్గ్ ద్వీప దుర్గాలుగా గుర్తింపు పొందాయి.
జింజి కోట
ఈ ప్రదేశాలపై ఫ్రాన్స్లోని పారిస్ నగరంలో ప్రపంచ వారసత్వ కమిటీ 47వ సమావేశం తీసుకున్న ఈ ఐతిహాసిక నిర్ణయాన్ని భారత్లోని సుసంపన్న, విభిన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రపంచవ్యాప్త గుర్తింపునివ్వడంలో కీలక ఘట్టంగా పరిగణించవచ్చు.
ఈ సమావేశం సందర్భంగా అందులో పాల్గొన్న సభ్య దేశాల్లో 18 నుంచి 20 వరకూ భారత్ ప్రతిపాదనను బలపరిచాయి. ఈ అంశంపై 59 నిమిషాలపాటు చర్చ కొనసాగగా, సభ్యదేశాల సానుకూల సిఫారసు అనంతరం ఆమోదముద్ర పడింది. దీనిపై యునెస్కో, ప్రపంచ వారసత్వ కేంద్రం, యునెస్కో సలహా సంస్థలు (ఐసీవోఎంవోఎస్, ఐయూసీఎన్) భారత ప్రతినిధి బృందానికి అభినందనలు తెలిపాయి.
నిర్దేశిత 4, 5 ప్రమాణాల కింద ప్రతిపాదించిన భారత మరాఠా సైనిక స్థావరాలు నిత్యచైతన్య సాంస్కృతిక సంప్రదాయానికి అపురూప సాక్ష్యాలు. నిర్మాణ, సాంకేతిక ప్రాధాన్యం, చారిత్రక ఉదంతాలు, సంప్రదాయాలతో ముడిపడిన లోతైన అనుబంధాలకు ప్రతిబింబాలు.
ప్రపంచంలోని 196 దేశాల్లో కనిపించే సాంస్కృతిక, సహజ, మిశ్రమ విశిష్టతను ఉమ్మడి విలక్షణ సార్వత్రిక విలువల ప్రాతిపదికన పరిరక్షిస్తూ, ప్రాచుర్యం కల్పించడమే వీటిని యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చడంలోని ఉద్దేశం. ఈ కృషిలో తన వంతుగా భారత్ 2021-25 మధ్య కాలానికిగాను ప్రపంచ వారసత్వ కమిటీలో సభ్యురాలుగా కొనసాగుతోంది.
అంతర్జాతీయ వేదికపై భారత వారససత్వాన్ని ప్రస్ఫుటం చేయడం లక్ష్యంగా నవ భారత్ చేస్తున్న అవిశ్రాంత కృషికి ఈ ప్రపంచ గుర్తింపు ఒక నిదర్శనం. అలాగే ఈ చారిత్రక సంపద పరిరక్షణలో భారత పురావస్తు విభాగం, మహారాష్ట్ర ప్రభుత్వ నిర్విరామ కృషిని కూడా ఇది చాటిచెబుతుంది.
కాగా, నిరుడు న్యూఢిల్లీలో 46వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం నిర్వహించిన సందర్భంగా అస్సాంలోని చరైడియోలోగల మొయిడామ్స్ కు ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం దక్కింది.
ప్రపంచ వారసత్వ జాబితాలో అత్యధిక ప్రదేశాల సంఖ్య రీత్యా భారతదేశం ప్రపంచంలో 6వ స్థానంలో, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో 2వ స్థానంలో ఉంది. కాగా, 1972నాటి ప్రపంచ వారసత్వ సదస్సు తీర్మానాన్ని 196 దేశాలు ఆమోదించాయి.
ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో భారత్లోని 62 ప్రదేశాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఏదో ఒక ప్రదేశానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించాలంటే తాత్కాలిక జాబితాలో చేర్చే ప్రమాణాన్ని పాటించడం తప్పనిసరి. అయితే, ప్రతి సభ్య దేశం ఏటా ఒక ప్రదేశాన్ని మాత్రమే ప్రపంచ వారసత్వ కమిటీ పరిశీలనకు ప్రతిపాదించవచ్చు.
ఈ మేరకు దేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల విషయంలో భారత పురావస్తు అధ్యయన విభాగం కేంద్ర ప్రభుత్వం తరపున నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.
(Release ID: 2144244)
|