సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
నమ్మకం, బాధ్యత, నైతిక విలువలతో కూడిన తదుపరి తరం వాణిజ్య ప్రకటనదారులను రూపొందించేందుకు ఐఐఎంసీలో సమావేశమైన వాణిజ్య ప్రకటనల రంగానికి చెందిన నాయకులు, విద్యావేత్తలు
రూపాంతరం చెందుతోన్న మీడియా రంగంలో నైతిక, బాధ్యతాయుతమైన ప్రకటనలు.. స్వీయ-నియంత్రణను తీసుకొచ్చేందుకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఐఐఎంసీ, ఏఎస్సీఐ
మంచి వాణిజ్య ప్రకటనలను తప్పుదారి పట్టించే వాటి నుంచి వేరు చేసేందుకు నైతిక ప్రకటనల అంశానికి విద్యాపరంగా ప్రాధాన్యత ఇవ్వాలన్న ఐఐఎంసీ వీసీ డాక్టర్ అనుపమ భట్నాగర్
ప్రకటనల నిబంధనలపై క్రియేటర్లకు మరింత అవగాహన కలిగించాలన్న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సీ. సెంథిల్ రాజన్.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ గురించి వివరాల వెల్లడి
Posted On:
04 JUL 2025 5:36PM by PIB Hyderabad
ఐఐఎంసీ ఢిల్లీలో అడ్వర్టైజింగ్ స్డాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఏఎస్సీఐ)తో కలిసి డీమ్డ్ విశ్వవిద్యాలయమైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ) భారీ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని (ఎఫ్డీపీ) నిర్వహించింది. మీడియా, ప్రకటనల రంగం, మార్కెటింగ్, న్యాయ సేవ, మేనేజ్మెంట్ రంగాల్లో మాత్రమే కార్యకలాపాలు నిర్వహించే వివిధ సంస్థల అధ్యాపకులకు బాధ్యతాయుతమైన ప్రకటనలు, స్వీయ నియంత్రణ, రూపాంతరం చెందుతోన్న మీడియా రంగ సూత్రాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రారంభ సెషన్లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ) సంయుక్త కార్యదర్శి శ్రీ సీ. సెంథిల్ రాజన్.. ఐఐఎంసీ ఉపకులపతి డాక్టర్ అనుపమ భట్నాగర్.. ఏఎస్సీఐ సీఈఓ, సెక్రటరీ జనరల్ శ్రీమతి మనీషా కపూర్.. నెస్లే డైరెక్టర్, సీనియర్ ఉపాధ్యక్షులు (వ్యూహాం, మార్కెటింగ్, కమ్యూనికేషన్) శ్రీ చందన్ ముఖర్జీ పాల్గొన్నారు. ఐఐఎంసీ రిజిస్ట్రార్ డాక్టర్ నిమిష్ రుస్తాగి కూడా దీనికి హాజరయ్యారు.
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ సీ. సెంథిల్ రాజన్ కీలకోపన్యాసం చేశారు. ప్రకటనలకు సంబంధించిన నియమావళి, నైతిక చట్రాల గురించి అవగాహన కూడిన తదుపరి తరం కంటెంట్ క్రియేటర్లను సన్నద్ధం చేసేందుకు ఇటువంటి కార్యక్రమాలను తప్పకుండా నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రధానంగా ప్రస్తావించారు. "ప్రకటనలను సంబంధించిన నియమ నిబంధనలను ప్రతి కంటెంట్ క్రియేటర్ అర్థం చేసుకోవాలి. భారతదేశంలో అత్యుత్తమ సృజనాత్మక కలిగిన వారిని ఐఐఎంసీ బయటకు తీసుకొస్తోంది. ఈ వర్క్షాప్ వంటి కార్యక్రమాలు వారి నైపుణ్యాలను పదును పెట్టటమే కాకుండా వారి అవగాహనను పెంచుతాయి. ప్రకటనల రంగంలో నైతికత గురించి అవగాహన పెంచేందుకు వీలుగా అధ్యాపకులు, విద్యార్థుల కోసం ఇలాంటి మరిన్ని వర్క్షాప్లు, కార్యక్రమాలకు సహాయం చేసేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది" అని వ్యాఖ్యానించారు.
సృజనాత్మక రంగాల్లో నైపుణ్యాన్ని ప్రోత్సహించడానికి ముంబయిలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తోందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
ఐఐఎంసీ ఉపకులపతి డాక్టర్ అనుపమ భట్నాగర్ మాట్లాడుతూ నైతిక విలువలతో ఉన్న ప్రకటనల ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో పొందిన పరిజ్ఞానాన్ని తరగతి గదిలో బోధించాలని ఆధ్యాపకులను కోరారు. " నైతిక పద్ధతులను అనుసరిస్తూ విద్యార్థుల సృజనాత్మక సామర్థ్యాలను పెంపొందించటాన్ని మేం నమ్ముతాం. మంచి ప్రకటనలు, తప్పుదారి పట్టించే ప్రకటనల మధ్య తేడాను విద్యార్థులు గుర్తించగలగాలి" అని అన్నారు.
ఏఎస్సీఐ సెక్రటరీ జనరల్, సీఈఓ శ్రీమతి మనీషా కపూర్ మాట్లాడుతూ ఇటువంటి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. ఏఎస్సీఐ కోడ్, డిజిటల్ యుగంలో విస్తరిస్తోన్న స్వీయ-నియంత్రణ పాత్ర గురించి పలు విషయాలను పంచుకున్నారు. “బాధ్యతాయుతమైన ప్రకటనలలో మన పాత్రను విస్తరించాలంటే.. భవిష్యత్తు నిపుణులకు శిక్షణ ఇచ్చే వారితో మన పని ప్రారంభించాలి. వినియోగదారుల విశ్వాసంతో నడిచే ప్రకటనల వ్యవస్థను తయారు చేయటంలో ఇక్కడ చేపడుతోన్న ఈ చర్చలు చాలా ముఖ్యమైనవి” అని అన్నారు.
బాధ్యతాయుతమైన ప్రకటనల గురించి నెస్లే డైరెక్టర్, సీనియర్ ఉపాధ్యక్షులు (వ్యూహాం, మార్కెటింగ్, కమ్యూనికేషన్) చందన్ ముఖర్జీ మాట్లాడారు. ప్రజలకు ఇచ్చే ప్రతీ వాణిజ్య ప్రకటన, సమాచారం.. నమ్మకం, నైతికత, బాధ్యతను నిలబెట్టేలా ఉండాలని ప్రధానంగా పేర్కొన్నారు. “వాణిజ్య ప్రకటనలు అంటే కేవలం అమ్మకాల గురించి కాదు. ఇది సమాజంతో నమ్మకాన్ని, సంబంధాలను ఏర్పరచుకోవటం” అని అన్నారు.
వినియోగదారు ప్రవర్తనకు సంబంధించిన పరిశోధన చేసే ఐఐఎంసీ రిజిస్ట్రార్ డాక్టర్ నిమిష్ రుస్తాగి మాట్లాడుతూ.. "నేటి డిజిటల్ యుగంలో వాణిజ్య ప్రకటనల విషయంలో నైతికత ఎన్నడూ లేనంత ముఖ్యమైనదిగా మారింది. ఆన్లైన్ వినియోగదారు ప్రవర్తనను తెలుసుకునే విషయంలో డేటా మైనింగ్ అనేది ప్రకటనదారులకు ఇస్తోన్న శక్తి సామర్థ్యాలు కూడా నైతికత ఆధారంగానే ప్రకటనదారు ఉండాలని తెలియజేస్తున్నాయి. వినియోగదారుల క్షేమం తగ్గకుండా, వారిని గౌరవించేలా ఇది మాత్రమే చేస్తుంది" అని అన్నారు.
రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో ‘బాధ్యతాయుత వాణిజ్య ప్రకటనల అవసరం’, ‘ఏఎస్సీఐ నియమావళి’, ‘ సమర్థవంతమైన ప్రకటనల నుంచి బాధ్యతాయుతమైన ప్రకటనలకు మార్పు’, "పెరుగుతోన్న ఏఎస్సీఐ పాత్ర" వంటి అంశాలపై లోతైన పరిజ్ఞానాన్ని అందిస్తూ చర్చలు జరిగాయి. ప్రకటనల రంగంలో నైతిక ప్రమాణాలు, స్వీయ-నియంత్రణపై సమగ్ర అవగాహనను ఇవి అందించాయి. ఈ చర్చా కార్యక్రమాన్ని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) ఆపరేషన్స్ డైరెక్టర్ డాక్టర్ సహేలి సిన్హా నిర్వహించారు. వాణిజ్య ప్రకటనలకు సంబంధించి స్వీయ-నియంత్రణ సూత్రాలు, పద్ధతుల గురించి లోతైన అవగాహనను ఆమె అందించారు.
ఏఎస్సీఐ అకాడమీ డైరెక్టర్ శ్రీమతి నమ్రతా బచాని మాట్లాడుతూ.. " వాణిజ్య ప్రకటనలపై ప్రజలు నమ్మకాన్ని కలిగి ఉండేలా చూసుకునేందుకు ఏఎస్సీఐ నిబద్ధతకు సంయుక్తంగా నిర్వహించిన ఈ భారీ ఎఫ్డీపీ నిదర్శనం. ఈ వర్క్షాప్లో తెలుసుకున్న విషయాలను అధ్యాపకులు తదుపరి తరం ప్రకటన రంగ నిపుణులకు బోధిస్తారు. ఐఐఎం, ఎంఐబీతో భాగస్వామ్యం కలిగి ఉన్నందుకు సంతోషిస్తున్నాం" అని అన్నారు.
ప్రారంభ కార్యక్రమాన్ని ఐఐఎంసీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మీతా ఉజ్జయిని సమన్వయం చేశారు. ఎఫ్డీపీ కన్వీనర్ ప్రొఫెసర్ (డాక్టర్) ప్రమోద్ కుమార్ ధన్యవాదాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న 98 మంది అధ్యాపకులు పాల్గొన్నారు.
***
(Release ID: 2142479)