పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఢిల్లీ, ముంబయి సహా ప్రధాన విమానాశ్రయాల్లో సమగ్ర పరిశీలన నిర్వహించిన డీజీసీఏ
విమానాల్లో తరచూ తలెత్తుతున్న లోపాలకు.. అసమర్థ పర్యవేక్షణ, దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడమే కారణం
వ్యవస్థలోని లోపాలను గుర్తించడానికి భవిష్యత్తులోనూ కొనసాగనున్న సమగ్ర పరిశీలన
Posted On:
24 JUN 2025 6:12PM by PIB Hyderabad
దేశంలో సురక్షితమైన విమాన ప్రయాణానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కట్టుబడి ఉంది. వైమానిక రంగంలో భద్రతా చర్యలను బలోపేతం చేసే విషయంగా సంస్థ నిబద్ధతలో భాగంగా విమానయాన వ్యవస్థలోని లోపాలను గుర్తించడం కోసం సమగ్ర పరిశీలన ప్రక్రియను ప్రారంభిస్తూ డీజీసీఏ ఈనెల 19న ఆర్డర్ నెం. DGCA-22034/2/2025-FSD ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.
డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ జనరల్ నేతృత్వంలోని రెండు బృందాలు ఢిల్లీ, ముంబయి సహా ప్రధాన విమానాశ్రయాల్లో రాత్రివేళ, తెల్లవారుజామున సమగ్ర పరిశీలనలు నిర్వహించాయి. విమాన కార్యకలాపాలు, విమాన యోగ్యత, ర్యాంప్ భద్రత, ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ (ఏటీసీ), కమ్యూనికేషన్, నావిగేషన్, నిఘా (సీఎన్ఎస్) వ్యవస్థలు, ప్రీ-ఫ్లైట్ మెడికల్ ఎవాల్యూయేషన్స్ సహా అనేక అంశాలను ఈ బృందాలు క్షుణ్ణంగా పరిశీలించాయి. ఈ పరిశీలన ప్రక్రియలో భాగంగా.. నియంత్రణ సంస్థలు నిర్దేశించిన నియమాల అమలు తీరును, అలాగే బలహీనంగా ఉన్న అంశాలను గురించి విస్తృత తనిఖీలు నిర్వహించారు. విమానం ఎగిరే ముందు దాని నిర్వహణ, మరమ్మత్తుల ప్రక్రియను.. అలాగే విమానం ఎగరడం, రన్వేపై దిగడం వంటి కార్యకలాపాలను బృందంలోని సభ్యులు జాగ్రత్తగా పరిశీలించారు.
పరిశీలన సందర్భంగా గుర్తించిన విషయాలు:
విమానాల్లో తరచూ తలెత్తుతున్న లోపాలకు కారణం తగిన పర్యవేక్షణ లేకపోవడం, సరిపడా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడమేనని గుర్తించారు. బ్యాగేజ్ ట్రాలీలు, బీఎఫ్ఎల్ వంటి గ్రౌండ్ హ్యాండ్లింగ్ పరికరాలు పనిచేయడం లేదని తేలింది. లైన్ మెయింటనెన్స్ స్టోర్స్, టూల్ కంట్రోల్ విధానాలనూ పాటించడం లేదు.
విమానాల నిర్వహణ సమయంలో వర్క్ ఆర్డర్ పాటించడం లేదు. థ్రస్ట్ రివర్సర్ సిస్టమ్ పనిచేయడం లేదు. ఫ్లాప్ స్లాట్ లీవర్ లాక్ చేయలేదు. నిర్వహణ సమయంలో ఏఎమ్ఎమ్ ప్రకారం ఏఎమ్ఈ భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని గుర్తించారు. కొన్ని చోట్ల చిన్నపాటి లోపాలు, అసంపూర్తి పనిని గుర్తించాల్సిన ఏఎమ్ఈ తన పనిని నిర్వర్తించడం లేదు. విమాన వ్యవస్థలో గుర్తించిన లోపాల నివేదికలు టెక్నికల్ లాగ్బుక్లో నమోదు చేయలేదు. అనేక లైఫ్ వెస్ట్లను.. కేటాయించిన సీట్ల కింద సరిగ్గా భద్రపరచలేదు. విమానం కుడి వైపున గల రెక్క కింది బ్లేడ్పై తుప్పును-నిరోధించే టేప్ దెబ్బతిన్నట్లు గుర్తించారు.
అదేవిధంగా ఒక విమానాశ్రయంలో రన్వే సెంటర్ లైన్ మార్కింగ్ అస్పష్టంగా ఉన్నట్లు గమనించారు. ర్యాపిడ్ ఎగ్జిట్ టాక్సీవే, గ్రీన్ సెంటర్ లైట్లు సరైన దిశలో లేవు. గత మూడేళ్లుగా అబ్స్ట్రక్షన్ లిమిటేషన్ డేటాను నవీకరించలేదు. ఏరోడ్రోమ్ సమీపంలో అనేక కొత్త నిర్మాణాలు జరిగినప్పటికీ ఎటువంటి సర్వే నిర్వహించలేదు. స్పీడ్ గవర్నర్లు లేకుండా ర్యాంప్ ప్రాంతంలో అనేక వాహనాలు కనిపించాయి. ఈ వాహనాల ఏవీపీ రద్దు చేయడం ద్వారా వాటిని ఉపసంహరించుకున్నారు అలాగే డ్రైవర్స్ ఏడీపీలను సస్పెండ్ చేశారు.
ఒక చోట సిమ్యులేటర్.. విమానం కాన్ఫిగరేషన్తో సరిపోలడం లేదు. సాఫ్ట్వేర్ ప్రస్తుత వెర్షన్కు అప్డేట్గా లేదు.
ఓ విమానాశ్రయంలో ఒక దేశీయ విమానం అరిగిపోయిన టైర్ల కారణంగా నిలిచిపోయినట్లు గుర్తించారు. అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపట్టిన అనంతరం దానిని పంపించారు. పరిశీలనలో గుర్తించిన అన్ని లోపాల కోసం ఏడు రోజుల్లోగా అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆపరేటర్లకు సూచించారు.
ఈ నెల 19 నాటి ఆర్డర్ నెం. DGCA-22034/2/2025-FSDకి అనుగుణంగా వ్యవస్థలోని లోపాలను గుర్తించడానికి ఈ సమగ్ర పరిశీలన ప్రక్రియ భవిష్యత్తులో కొనసాగనుంది.
డీజీసీఏ అనేది పౌర విమానయాన రంగ నియంత్రణ సంస్థ. ఇది ప్రధానంగా భద్రతా సమస్యలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. దేశంలో విమాన కార్యకలాపాల భద్రత, రక్షణకు పూర్తిగా కట్టుబడి ఉంది.
***
(Release ID: 2139476)