భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎస్‌పీఎంఈపీసీఐలో భాగంగా ఒక పోర్టల్‌కు నాందీప్రస్తావన... ప్రపంచ విద్యుత్తు వాహన రంగ దిగ్గజాలకు భారత్ ఆహ్వానం

• విద్యుత్తు వాహనాల తయారీకి విధానపరమైన మద్దతు...
‘మేక్ ఇన్ ఇండియా’కు పెద్ద ఊతం

• భారత్‌లో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల తయారీని ప్రోత్సహించే పథకం...
అందులో భాగంగా దరఖాస్తుల పోర్టల్ ప్రారంభం

Posted On: 24 JUN 2025 1:13PM by PIB Hyderabad

భారత్‌లో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల తయారీని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పథకం (‘స్కీమ్ టు ప్రమోట్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్స్ ఇన్ ఇండియా’..ఎస్‌పీఎంఈపీసీఐ)లో భాగంగా దరఖాస్తులు పెట్టుకొనే ప్రక్రియకు సంబంధించిన ఒక పోర్టల్‌ను మొదలుపెట్టినట్లు ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ స్కీమును 2024 మార్చి నెల 15న జారీ చేసిన ఒక అధికార ప్రకటన ద్వారా తెలియజేశారు. పథకానికి సంబంధించిన సమగ్ర  మార్గదర్శక సూత్రాలను ఆ తరువాత... 2025 జూన్ 2వ తేదీ నాటి నోటిఫికేషన్ (దీని సంఖ్య ఎస్.ఒ. 2450(ఈ)) ద్వారా విడుదల చేశారు. మార్గదర్శక సూత్రాలు, నోటిఫికేషన్‌ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ (https://heavyindustries.gov.in/scheme-promote-manufacturing-electric-passenger-cars-india-0) లో అందుబాటులో ఉన్నాయి.

ఈ సందర్భంగా, అర్హత కలిగిన దరఖాస్తుదారు సంస్థల వద్ద నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తుదారులు spmepci.heavyindustries.gov.in లో దరఖాస్తు మాడ్యూల్‌ను ఉపయోగించుకొని, దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తుల కోసం అప్లికేషన్ పోర్టల్‌ను ఈ రోజు (2025 జూన్ 24)న ఉదయం 10.30 గంటల నుంచి తెరిచారు. దీనిని ఈ సంవత్సరం అక్టోబరు 21న సాయంత్రం 6.00 గంటల వరకు తెరిచి ఉంచుతారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం విద్యుత్తు వాహనాల (ఈవీస్)పై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొంటూ ఉండడంతో పాటు, ప్రయాణికుల కార్లను దేశంలోనే తయారు చేయడాన్ని ప్రోత్సహించడానికి ముందుచూపు కలిగిన ఓ పథకానికి ఆమోదం తెలిపింది. ఆటోమోటివ్ తయారీ, నవకల్పన.. ఈ రెండు అంశాల్లోనూ భారత్‌లో పెట్టుబడి పెట్టడానికి ప్రపంచ దేశాలు ఉవ్విళ్లూరే విధంగా ఒక ప్రధాన ఆకర్షణీయ గమ్యస్థానంగా మన దేశాన్ని తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈ పథకాన్ని  రూపొందించారు.

పోర్టల్‌ను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ హెచ్.డి. కుమారస్వామి మాట్లాడుతూ, ‘‘ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శక నాయకత్వంలో ఈ కార్యక్రమం స్వచ్ఛ, స్వయంసమృద్ధ, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సన్నద్ధంగా ఉండే మొబిలిటీ (రాకపోకలు) మార్గంలో భారత్ సాగిస్తున్న ప్రయాణంలో ఓ నిర్ణాయక క్షణం ఇది. ఎస్‌పీఎంఈపీసీఐ స్కీములో భాగంగా ఈ పోర్టల్‌ను ప్రారంభించడంతో, ప్రపంచ విద్యుత్తు వాహనాల తయారీదారు సంస్థలకు భారత్‌లోని శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమోటివ్ రంగంలో పెట్టుబడి పెట్టడానికి కొత్త అవకాశాలు అందివస్తాయి. ఈ పథకం 2070 కల్లా ‘నెట్ జీరో’ (నికర శూన్య ఉద్గారాల) స్థాయికి చేరుకోవాలన్న మన దేశ నిబద్ధతను సమర్ధించడం ఒక్కటే కాకుండా, ఒక సుస్థిర, నవకల్పన ప్రధాన ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దుకోవాలన్న మన సంకల్పానికి మరింత బలాన్ని కూడా అందిస్తుంది. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాలను బలపరుస్తుంది. అంతేకాక రాబోయే తరం ఆటోమోటివ్ తయారీ, సాంకేతిక నాయకత్వం.. వీటి విషయంలో ఒక విశ్వసనీయ ప్రపంచ కూడలిగా భారత్‌ను నిలబెడుతుంది’’ అన్నారు.

ఈ పథకం ప్రపంచ ఈవీ తయారీదారుల వద్ద నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలోనూ, ఈ-వాహనాల తయారీకో నిలయంగా భారత్‌ను ప్రోత్సహించడంలోనూ తోడ్పడుతుంది. ఈవీల తయారీకి సంబంధించిన చిత్రపటంలో భారత్‌ చోటు దక్కించుకోవడంలో, ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో, ‘‘మేక్ ఇన్ ఇండియా’’ లక్ష్యాన్ని సాధించడంలో కూడా ఈ పథకం సాయపడనుంది.

ప్రపంచ తయారీదారు సంస్థలు ఈ పథకంలో భాగంగా పెట్టుబడి పెట్టేటట్లు ప్రోత్సహించడానికి ఆమోదించిన దరఖాస్తుదారులకు... దరఖాస్తుకు ఆమోదం తెలిపిన తేదీ నుంచి 5 సంవత్సరాల కాలానికి... 15 శాతం తగ్గించిన కస్టమ్స్ సుంకంపై కనీసం 35,000 అమెరికన్ డాలర్ల సీఐఎఫ్ విలువతో ఈ-4డబ్ల్యూను కలిగి ఉంటూ పూర్తి స్థాయిలో నిర్మించిన యూనిట్ల (కంప్లీట్లీ బిల్ట్-ఇన్... సీబీయూస్)ను దిగుమతి చేసుకొనేందుకు అనుమతిస్తారు.

ఆమోదించిన దరఖాస్తుదారులు పథకం నిబంధనల ప్రకారం కనీసం రూ.4,150 కోట్ల పెట్టుబడిని పెట్టాల్సి ఉంటుంది.

విద్యుత్తు వాహనాల తయారీకి ప్రపంచంలోనే ఒక కూడలిగా భారత్‌ను నిలబెట్టడానికి ఒక వ్యూహం ప్రకారం ఈ పథకానికి రూపకల్పన చేశారు. రూ.4,150 కోట్ల కనీస పెట్టుబడి పరిధితో, ఈ పథకం ఇండియాలో దీర్ఘకాలిక తయారీ కేంద్రాల్ని ఏర్పాటు చేయడానికి అగ్రగామి ప్రపంచ సంస్థలతో పాటు దేశీయ సంస్థలకు విధానాల పరంగా సానుకూల వాతావరణాన్ని సమకూరుస్తుంది. ఒక క్రమ పద్ధతిలో సవరించే కస్టమ్స్ డ్యూటీ రాయితీలతోనూ, స్పష్ట నిర్వచనాన్నిచ్చిన దేశీయంగా విలువను పెంచే (డీవీఏ) పద్ధతులతోనూ అత్యాధునిక విద్యుత్తు వాహన సాంకేతికతలను ప్రవేశపెట్టడం, స్వదేశీ సామర్థ్యాలను పెంచి పోషించడం.. ఈ రెండింటికీ మధ్య సమతౌల్యాన్ని ఈ పథకం ఏర్పరుస్తుంది.

దేశీయంగా విలువ పెంచే లక్ష్యాలను తప్పనిసరి నియమంగా పేర్కొని, ఈ పథకం భారత్‌లో పర్యావరణానుకూల రాకపోకల విప్లవంలో చురుకైన భాగస్వాములుగా మారేందుకు ప్రపంచ కంపెనీలకు, దేశీయ కంపెనీలకు సాధికారతను కల్పించడంతో పాటు ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాలకు మరింత ఊతాన్ని అందించనుంది.  ‌


 

**‌*


(Release ID: 2139328)