రక్షణ మంత్రిత్వ శాఖ
జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్లో రక్షణ మంత్రి నేతృత్వంలో సాయుధ దళాల అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు..
2,500 సైనికులతో కలిసి యోగాసనాలు, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేసిన మంత్రి
యోగా సాధన ద్వారా మన సాయుధ దళాలు సాధించిన శారీరక సామర్థ్యం, మానసిక నియంత్రణను ఆపరేషన్ సిందూర్ అద్దం పడుతోంది: రాజ్నాథ్ సింగ్
Posted On:
21 JUN 2025 10:06AM by PIB Hyderabad
2025 జూన్ 21న జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్లోని ఉత్తర కమాండ్లో సుమారు 2,500 మంది సైనికులతో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై) వేడుకలకు రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగాను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ప్రశంసించారు. ఆరోగ్యం, రోగ రహిత జీవనానికీ యోగా సమగ్రంగా పనిచేస్తుందని ప్రధానంగా పేర్కొన్నారు. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి వాటితో ఉన్న నేటి వేగవంతమైన ప్రపంచంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు యోగా సార్వత్రిక పరిష్కారమని అన్నారు.
“సమస్యల్లో ఉన్న ప్రజలకు యోగా సాంత్వన అందిస్తుంది. ఇది ఒక కళ, శాస్త్రం, తాత్వికత, ఆధ్యాత్మికత. దైనందిన జీవితంలో యోగా సాధన చేసేవారికి శరీరంపైనా, మనస్సుపైనా నియంత్రణ ఉంటుంది. ఇది మనల్ని ఒక దానికి వెంటనే ఆనాలోచితంగా ప్రతిస్పందించేలా కాకుండా చురుగ్గా చేస్తుంది.” అని మంత్రి అన్నారు.
శారీరక, మానసిక నియంత్రణకు ఒక మంచి ఉదాహరణ ఆపరేషన్ సిందూర్ అని మంత్రి అన్నారు. ఈ ఆపరేషన్ సమయంలో భారత సాయుధ దళాలు సంయమనం, సమతుల్యత, ఖచ్చితత్వాన్ని ప్రదర్శించాయని పేర్కొన్నారు. ఇది యోగా సాధన ద్వారా వారు సాధించిన అంతర్గత సామర్థ్యాన్ని తెలియజేస్తోందని అన్నారు. భారతదేశ సామాజిక ఐక్యతను, మత సామరస్యాన్ని పహల్గామ్ ఉగ్రవాద దాడి లక్ష్యంగా చేసుకుందని పేర్కొన్నారు. భారత్కు వ్యతిరేకంగా జరుగుతోన్న ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చినందుకు పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న స్పష్టమైన సందేశాన్ని పాకిస్తాన్కు ఆపరేషన్ సిందూర్ ఇచ్చిందని తెలిపారు.
“2016 మెరుపుదాడులు(సర్జికల్ స్ట్రైక్స్), 2019 వైమానిక దాడులు (ఎయిర్ స్ట్రైక్స్) సహాజంగా పురోగమనమే ఆపరేషన్ సిందూర్. కాల్పుల విరమణ కోసం పాక్ అభ్యర్థించే విధంగా ఇది చేసింది. తర్వాతే మనం ఆపరేషన్కు విరామం ఇచ్చాం. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు. ఉగ్రవాదంపై అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి భారతదేశం పూర్తిగా సిద్ధంగా ఉంది.” అని వ్యాఖ్యానించారు.
భారతదేశాన్ని అంతర్గతంగా బలహీనపరచాలని పాకిస్తాన్ కోరుకుంటున్నదని రక్షణ మంత్రి వెల్లడించారు. కానీ మేజర్ సోమనాథ్ శర్మ మాదిరిగానే బ్రిగేడియర్ ఉస్మాన్ కూడా దేశ ఐక్యత, సమగ్రత కోసం తన ప్రాణాలను త్యాగం చేశారన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నారు. దేశం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న ప్రస్తుత సమయంలో సమాజంలోని ప్రతి వర్గాన్ని భారతదేశ ఆత్మీయ భావన, సంస్కృతితో అనుసంధానించడమే యోగా సాధన నిజమైన అర్థమని గుర్తించుకోవాలని పేర్కొన్నారు. "ఒక వర్గం వెనుకబడి ఉన్నా.. సామరస్యం, భద్రత అనే చక్రం విరిగిపోతుంది. కాబట్టి నేడు మనం యోగాను వ్యక్తిగత స్థాయిలోనే కాకుండా సమాజ గురించే ఆలోచించే స్థాయిలో ప్రదర్శించాలి" అని వ్యాఖ్యానించారు.
సాయుధ దళాలు సిబ్బంది యోగా పట్ల చూపిస్తోన్న మొగ్గును రక్షణ మంత్రి అభినందించారు. ఇది వారి క్రమశిక్షణ, ఏకాగ్రతపై ప్రత్యక్ష ప్రభావాన్ని కనబరుస్తుంది. యోగా ఒక సైనికుడిని శారీరకంగా, మానసికంగా సిద్ధం చేస్తుందని.. దీని ప్రయోజనాలు యుద్ధక్షేత్రంలో కనిపిస్తాయన్న మంత్రి.. సైనికులు ప్రతిరోజూ యోగా సాధన చేయాలని కోరారు.
‘యోగా ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన బహుమతి’ అన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను పునరుద్ఘారిస్తూ.. ఇది కేవలం దౌత్యపరమైన వ్యాఖ్య కాదని, ఒక దార్శనికత అని పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచానికి సరిహద్దులు, మతం, సంస్కృతికి అతీతమైన సాధనాన్ని యోగా రూపంలో అందించిందని అన్నారు.
వివిధ సంవత్సరాల అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇతివృత్తాలను ప్రస్తావించారు. ఈసారి ఇతివృత్తమైన ‘ఒకే ధరిత్రి, ఒకే ఆరోగ్యం కోసం యోగా’.. భారత్ తన కోసం మాత్రమే కాకుండా ప్రపంచ క్షేమం కోసం ఆలోచిస్తుందన్న సందేశాన్ని ప్రపంచానికి పంపుతోందని ప్రధానంగా చెప్పారు. "మొత్తం ప్రపంచం ఒక కుటుంబం. దీని కోసం పనిచేయడం మన ఆలోచనలో ఒక భాగం. ఆలోచనను ఆచరణఆత్మకంగా వ్యక్తీకరించటమే యోగా" అని అన్నారు.
యోగా నిశ్శబ్దంగా ప్రపంచాన్ని మారుస్తోందని… భారత ప్రాచీన సంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుండటం, అంగీకరించడం పట్ల ప్రతి ఒక్కరు గర్వపడాలని రక్షణ మంత్రి అన్నారు. యోగాను ఒక ట్రెండ్గా మాత్రమే కాకుండా ఒక జీవన విధానంగా మలుచుకోవటం అనేది బాధ్యత అని పేర్కొన్నారు. "మన జీవితాల్లో యోగాను ఒక సంకల్పంగా అనుసరించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో సానుకూల మార్పులను తీసుకొస్తుంది కాబట్టి దీనిని మన దినచర్యలో భాగంగా చేసుకోవాలి" అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఉత్తర కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ పాల్గొన్నారు.
విశాఖపట్నంలో జరిగిన ప్రధాన కార్యక్రమంలో ప్రధానమంత్రి అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రసంగాన్ని ఇక్కడి వారందరూ వీక్షించారు. జమ్మూకాశ్మీర్, లడఖ్లలో సరిహద్దుల వద్ద అనేక భౌగోళిక, వ్యూహాత్మక సవాళ్లతో కూడిన ప్రాంతాల్లో కూడా యోగా కార్యక్రమాలు జరిగాయి. ఇది మన సైనికుల నిబద్ధత, ఉత్సాహాన్ని తెలియజేస్తోంది.
జార్ఖండ్ రాజధాని రాంచీలోని కుమ్హారియాలో పీఎం శ్రీ హై స్కూల్లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్ హాజరయ్యారు. విద్యార్థులు, అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆరోగ్యకరమైన దేశాన్ని నిర్మించడంలో యోగాకు ఉన్న ప్రాముఖ్యతను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. క్రమశిక్షణ, సామర్థ్యాన్ని యోగాను తీసుకొస్తుందని.. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా పిల్లలు వారి దైనందిన జీవితంలో యోగా సాధన చేసే విధంగా ప్రోత్సహించాలని ప్రధానంగా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగాను ప్రోత్సహించడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.
దిల్లీలోని డిఫెన్స్ అకౌంట్స్ కంట్రోలర్ జనరల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్, రక్షణ మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు యోగా సాధన చేశారు.
దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం, మ్యూజియంలో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రధాన కార్యాలయంలోనూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (సీఐఎస్సీ) ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ ముఖ్య అతిథిగా హాజరై.. ఆరోగ్యం, ఐక్యత పట్ల సాయుధ దళాల నిబద్ధతను ప్రధానంగా పేర్కొన్నారు.
ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి (రీసెర్చ్ అండ్ రెఫరల్)లో 1,500 మందికి పైగా వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, రోగులు.. యోగా దినోత్సవ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణం, సుస్థిర ఆరోగ్యం పట్ల నిబద్ధతకు చిహ్నంగా కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ శంకర్ నారాయణ్, డిప్యూటీ కమాండెంట్ మేజర్ జనరల్ అముల్ కపూర్.. సిబ్బంది, రోగులు కూడా ఆసుపత్రి ప్రాంగణంలో చెట్లు నాటారు.
(Release ID: 2138265)