సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
పీఎంఈజీపీ పథకంలో భాగంగా దేశమంతటా 11,480 సేవా రంగ లబ్ధిదారులకు రూ.300 కోట్లకు పైగా మార్జిన్ మనీ సబ్సిడీని అందించిన కేవీఐసీ
• లబ్ధిదారులకు సబ్సిడీని న్యూఢిల్లీ లోని రాజ్ఘాట్ ఆఫీసు నుంచి దృశ్య మాధ్యమం ద్వారా
విడుదల చేసిన కేవీఐసీ చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్
• ‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, ప్రతి పల్లెలో ఉపాధితో పాటు స్వయంఉపాధి పునాదులను
పీఎంఈజీపీ పథకం బలపరచింది: కేవీఐసీ చైర్మన్
Posted On:
17 JUN 2025 9:30PM by PIB Hyderabad
ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) లో భాగంగా దేశవ్యాప్తంగా 11,480 సేవా రంగాల లబ్ధిదారులకు రూ.300 కోట్ల రుణ సబ్సిడీని ఖాదీ, గ్రామ పరిశ్రమల సంఘం (కేవీఐసీ) మంగళవారం (ఈ నెల 17న) దృశ్య మాధ్యమం ద్వారా పంపిణీ చేసింది. ఈ సబ్సిడీని రూ.906 కోట్ల రుణాలకు సంబంధించి అందించారు. న్యూఢిల్లీలోని రాజ్ఘాట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కేవీఐసీ చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ తన బృందంతో కలసి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాలను వర్చువల్ మాధ్యమం ద్వారా అందించారు. ఈ కార్యక్రమంలో కేవీఐసీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) రూప్ రాశితో పాటు కేంద్ర కార్యాలయంలోని ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ మాట్లాడుతూ... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘స్వయంసమృద్ధి సహిత, అభివృద్ధి చెందిన భారత్’ దృష్టికోణానికి గుర్తింపు లభిస్తోందనీ, దీనికి ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) బలమైన స్తంభంగా మారిందంటూ అభివర్ణించారు. ఈ పథకం ఆర్థిక సహాయాన్ని అందించడానికి మాత్రమే పరిమితం కాదనీ, ఇది ఒక సామాజిక ఉద్యమంగా కూడా రూపుదిద్దుకొందనీ, లక్షలమంది యువతీ యువకులకు, మహిళలకు, చేతివృత్తిదారులకు స్వతంత్రోపాధిని కల్పించడంతో పాటు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఉపకరిస్తుందన్నారు. ప్రతి గ్రామంలో ఉపాధినీ, స్వయంసమృద్ధినీ అంకురింప చేయడంలో ఈ పథకం పోషిస్తున్న పాత్ర ప్రధానమైందని ఆయన అన్నారు.

దేశంలోని మొత్తం ఆరు మండలాలు ఉత్సాహంగా ఈ ఆర్థిక సహాయ పథకంలో భాగం పంచుకొన్నాయి. కేంద్రీయ మండలంలో 2403 ప్రాజెక్టుల కోసం రూ.72 కోట్ల సబ్సిడీని పంపిణీ చేశారు. ఈ ప్రాజెక్టులు ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్లలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు మొత్తం రూ.218 కోట్ల రుణాన్ని మంజూరు చేశారు. తూర్పు మండలంలో బీహార్, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అండమాన్-నికోబార్ దీవులలోని 996 ప్రాజెక్టులకు సుమారు రూ.71 కోట్లను రుణాల రూపంలో మంజూరు చేసి, రూ.22 కోట్లను సబ్సిడీగా ఇచ్చారు.
ఉత్తర భారతదేశంలోని పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్, లద్దాఖ్, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత చండీగఢ్ ప్రాంతానికి మొత్తం 2713 ప్రాజెక్టులకు గాను రూ.61 కోట్ల సబ్సిడీని ఇచ్చారు. వాటికే రుణాల రూపంలో రూ.184 కోట్లను మంజూరు చేశారు. ఈశాన్య ప్రాంతంలో 81 ప్రాజెక్టులకు రూ.2 కోట్ల సబ్సిడీని ఇచ్చారు. ఈ ప్రాంతంలో అసోమ్, మణిపుర్, మేఘాలయ, మిజోరమ్, నాగాల్యాండ్, సిక్కిమ్, త్రిపురలు ఉన్నాయి.
దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళ నాడు, కేరళ, పాండిచ్చేరిలలో 4565 ప్రాజెక్టులకు సంబంధించి రూ.116 కోట్ల సబ్సిడీని పంపిణీ చేశారు. ఈ ప్రాజెక్టులకు రూ.343 కోట్ల కన్నా ఎక్కువ రుణాలను మంజూరు చేశారు. పశ్చిమ మండలానికి చెందిన మహారాష్ట్ర, గుజరాత్, గోవాలలో 722 ప్రాజెక్టులకు గాను రూ.26 కోట్ల కన్నా ఎక్కువ సబ్సిడీని, రూ.82 కోట్ల రుణాన్ని మంజూరు చేశారు.
ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమాన్ని (పీఎంఈజీపీ) 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదలుపెట్టిన తరువాత ఇది గ్రామీణ భారతంతో పాటు మన దేశంలోని పట్టణ ప్రాంతాలలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, స్వావలంబనకు ఒక దృఢమైన స్తంభంగా నిలిచింది. ఈ పథకంలో భాగంగా ఇంతవరకు మొత్తం 10,18,185 సూక్ష్మ వాణిజ్య సంస్థలను ఏర్పాటు చేయగా, ఇందుకోసం భారత ప్రభుత్వం ఇంతవరకు రూ. 73,348 కోట్ల రుణాలను మంజూరు చేసింది. దీనికిగాను రూ.27,166 కోట్లకు పైగా మార్జిన్ మనీ సబ్సిడీని లబ్ధిదారులకు అందించారు. ఇప్పటి వరకు, దేశవ్యాప్తంగా 90,04,541 మంది ఈ పథకం ద్వారా ప్రత్యక్ష ఉపాధినీ, పరోక్ష ఉపాధినీ అందుకొన్నారు. దీంతో ఇది దేశంలో స్వయంఉపాధి పథకాలన్నిటిలోకీ అత్యంత ప్రభావాన్ని కలగజేసిన పథకంగా మారింది. ఈ కార్యక్రమం స్వయంఉపాధిని ప్రోత్సహించడం ఒక్కటే కాకుండా, ప్రధానమంత్రి చెబుతున్న స్వయంసమృద్ధి యుక్త భారత్ దార్శనికతను క్షేత్ర స్థాయిలో సాకారం చేయడంలో కూడా ముఖ్య పాత్రను పోషిస్తోంది.
***
(Release ID: 2137217)