రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతీయ రైల్వేల్లో రెండు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోదం... ఝార్ఖండ్, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్‌లలో ఏడు జిల్లాలకు ఈ ప్రాజెక్టులతో మేలు... సుమారు 318 కి.మీ. మేర పెరగనున్న ప్రస్తుత రైల్వే నెట్‌వర్క్


* వీటితో ప్రయాణ సౌలభ్యం మెరుగు...
తగ్గనున్న ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ ఖర్చు, చమురు దిగుమతులు..
కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల్లో క్షీణత...
దీర్ఘకాల ప్రాతిపదికన, సమర్ధ రీతిలో రైల్వే నిర్వహణ కార్యకలాపాలకు ప్రోత్సాహం

* ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ.6,405 కోట్లు
* ప్రాజెక్టుల నిర్మాణ కాలంలో దాదాపు కోటీ 8 లక్షల పనిదినాల
ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు అందుబాటులోకి

Posted On: 11 JUN 2025 3:06PM by PIB Hyderabad

రైల్వే మంత్రిత్వ శాఖ రూ.6,405 కోట్ల మొత్తం వ్యయంతో ప్రతిపాదించిన రెండు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన గల ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు:-

1.     కోడర్‌మా-బర్‌కాకానా డబ్లింగు (133 కిలోమీటర్లు): ఈ ప్రాజెక్ట్ సెక్షను ఝార్ఖండ్‌లోని ఒక ముఖ్య బొగ్గు ఉత్పాదక క్షేత్రం మీదుగా సాగుతుంది. దీనికి అదనంగా ఇది పాట్నా, రాంచీల మధ్య అన్నింటి కన్నా చిన్నదీ, ఎక్కువ సమర్ధమైన రైలు లింకుగా కూడా ఉండబోతోంది.

2.    బళ్లారి-చిక్‌జాజుర్ డబ్లింగు (185 కి.మీ.): ఈ ప్రాజెక్ట్ లైను కర్నాటకలోని బళ్లారి, చిత్రదుర్గ జిల్లాలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ‌లోని అనంతపురం జిల్లా నుంచి సాగుతుంది.

లైన్ సామర్థ్యాన్ని పెంచడం రాకపోకలను చెప్పుకోదగ్గ స్థాయిలో పెంపొందించనుంది. దీంతో భారతీయ రైల్వేల నిర్వహణ కార్యకలాపాల సామర్థ్యంతో పాటు సేవాపరమైన విశ్వసనీయత కూడా మెరుగవుతుంది. ఈ మల్టీట్రాకింగ్  ప్రతిపాదనలతో నిర్వహణ కార్యకలాపాలు సువ్యవస్థితం కావడంతో పాటు రద్దీని నివారించడానికీ అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘న్యూ ఇండియా’ (నవ భారత్) దార్శనికతకు అనుగుణంగా ఉన్నాయి. ఇవి ఆయా ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతూ, ఆ ప్రాంతాల ప్రజలను ‘‘ఆత్మనిర్భర్’’ (స్వయంసమృద్ధం)గా తీర్చిదిద్దగలవు. దీంతో వారికి ఉద్యోగావకాశాలు, స్వయంఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.  

బహుళ విధ సంధానాన్ని (మల్టి-మోడల్ కనెక్టివిటీ) అందుబాటులోకి తీసుకు రావాలని ఉద్దేశించిన పీఎం-గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌లో ఆ ప్రాజెక్టులు ఒక భాగం. ఏకీకృత ప్రణాళిక రచనతో ఇది సాధ్యపడింది. ఈ తరహా సంధానం ప్రజల రాక- పోక, వస్తువులు-సేవల రవాణాకు ఎలాంటి అంతరాయం ఎదురవకుండా చూస్తుంది.

ఈ రెండు ప్రాజెక్టులూ ఝార్ఖండ్, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్‌లలో ఏడు జిల్లాల మీదుగా సాగుతాయి. దీంతో భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్‌వర్క్ మరో 318 కి.మీ. మేర విస్తరిస్తుంది.

ఆమోదించిన మల్టి-ట్రాకింగ్ ప్రాజెక్టు తో దాదాపుగా 28.19 లక్షల మంది జనాభాకు మేలు కలుగుతుంది. సుమారుగా 1,408 గ్రామాలకు సంధాన (కనెక్టివిటీ) సదుపాయం పెరుగుతుంది.

ఇవి బొగ్గు, ఇనుప ఖనిజం, తుది ఉక్కు, వ్యావసాయక సరకులతో పాటు పెట్రోలియం ఉత్పాదనలు తదితర సరకుల రవాణాకు అత్యంత ముఖ్యమైన మార్గాలు. సామర్థ్యాన్ని పెంచడానికి చేపట్టే పనులతో అదనంగా 49 ఎంటీపీఏ (మిలియన్ టన్స్ పర్ యానమ్) మేరకు సరకును రవాణా చేయవచ్చు. రైల్వేలు పర్యావరణానుకూలమైనవి, తక్కువ ఇంధనాన్ని వినియోగించుకొనే రవాణా సాధనం కావడం వల్ల వాతావరణ పరంగా నిర్దేశిత లక్ష్యాల సాధనకు దోహదపడడంతో పాటుగా దేశానికి అవుతున్న ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ (లాజిస్టిక్స్) ఖర్చును, చమురు దిగుమతి ని తగ్గించడం (52 కోట్ల లీటర్లు)తో పాటు కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉద్గారాలను 264 కోట్ల కేజీల మేర కుదించనున్నాయి.  కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల కుదింపు పరిమాణం 11 కోట్ల మొక్కలను నాటి, వాటిని పెంచినందువల్ల కలిగే ఫలితాలకు సమానంగా ఉండబోతోంది.

 

***


(Release ID: 2135736)