సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
రాజ్ కపూర్కు వందేళ్లు: సినీతార మాత్రమే కాదు... ఈ దేశపు నైతిక అంతర్వాణి
• శతజయంతి ఉత్సవం 2025లో భాగంగా ‘శబ్దాంజలి: రాజ్ కపూర్- ది ఐడియా ఆఫ్ షోమాన్షిప్’ కార్యక్రమాన్ని నిర్వహించిన ఐజీఎన్సీఏ
Posted On:
02 JUN 2025 9:25PM by PIB Hyderabad
‘మేరా నామ్ జోకర్’, ‘బాబీ’ వంటి సినిమాలను యువతీయువకులు తమ మదిలో పదిల పరచుకొనేవిగా తీర్చిదిద్ది, యువతలో ఓ ఉద్వేగాన్ని రగిలించారు రాజ్ కపూర్. మీరు సినిమా హాలుకు వెళ్లి సినిమా చూడలేదు... సినిమా టికెట్టు కొనేందుకు అప్పు చేయలేదు… అంటే సినీ మాయాజాలం గురించి మీకు తెలియదన్నట్లే! రాజ్ కపూర్ వట్టి సినిమాలే తీయలేదు. ఆయన తీయనైన తిరుగుబాటుకు స్ఫూర్తి. మనం ఆ మధురమైన జ్ఞాపకాలను సగర్వంగా స్మరించుకొంటున్నాం’’ అని ఐజీఎన్సీఏ సభ్య కార్యదర్శి డాక్టర్ సచ్చిదానంద్ జోషి అభివర్ణించారు. రాజ్ కపూర్ శతజయంతి ఉత్సవం- 2025 సందర్భంగా అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమానికి అనేక మంది మేధావులు పాల్గొనగా, వారిని ఉద్దేశించి డాక్టర్ సచ్చిదానంద్ జోషి భావావేశంతో చెప్పిన మాటలు సభాస్థలిలో మార్మోగి చిక్కని అనుభవాన్ని అందించాయి. ఢిల్లీకి చెందిన రెస్పెక్ట్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి ‘శబ్దాంజలి: రాజ్ కపూర్- ది ఐడియా ఆఫ్ షోమాన్షిప్’ అనే శీర్షికను ఉంచారు. భారతదేశంలో అత్యంత విశిష్ట సినిమా దర్శకుల్లో ఒకరైన మహనీయునికి సంవత్సరం పొడవునా నివాళి అర్పిస్తూ నిర్వహించే ఉత్సవానికి దీంతో లాంఛనప్రాయగా నాందీప్రస్తావన జరిగినట్లయింది.
న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాయంత్రం వేళ జరిగిన సదస్సుకు సిక్కిం మాజీ గవర్నరు శ్రీ బి.పి. సింగ్ అధ్యక్షత వహించగా, పార్లమెంట్ సభ్యుడు శ్రీ మనోజ్ తివారీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ , పద్మ శ్రీ డాక్టర్ యశ్ గులాటీ, సీనియర్ నటుడు శ్రీ ముకేశ్ త్యాగి గౌరవ అతిథులుగా విచ్చేశారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి నిరుపమ కొట్రు- ఐఆర్ఎస్ కీలకోపన్యాసాన్నిచ్చారు. సభా కార్యక్రమం ఆరంభంలో రెస్పెక్ట్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ నిర్మల్ గహ్లోత్ ఆహ్వానితులకు స్నేహపూర్వక స్వాగత వచనాలు పలికారు.
రాజ్ కపూర్ ది వినోద రంగంలో అందె వేసిన చేయి. అంతే కాదు, మన దేశంలో యువతీయువకులతో పాటు మారుతున్న దేశానికి ఒక నైతిక దర్పణం కూడా అని డాక్టర్ జోషి విశ్లేషించారు. ఆయన చలనచిత్రాల్లో కళ్లు చెదిరే ఉదంతాలతో పాటు అప్పుడే రూపుదాల్చిన నూతన స్వతంత్ర దేశంలో మానవ భావావేశాలు, నైతిక మీమాంసలను వడబోసిన లోతైన సాంస్కృతిక సన్నివేశాలు కూడా ఒకదాని తరువాత మరొకటిగా పోగుపడేవి. భారత్ వలసవాద ఛాయల నుంచి బయటకు వచ్చాక, స్వీయ గుర్తింపు కోసం తపిస్తున్న ప్రజలకు అర్థం చేసుకోదగ్గ చలనచిత్ర పరిభాషను కపూర్ అందించారు. ‘‘ఇండియా స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాక, చలనచిత్ర పరిశ్రమ కూడా స్వేచ్ఛావాయువులను పీల్చుకొనేటంత దాకా కపూర్ వేచి ఉండలేదు. మూడు సంవత్సరాల స్వల్ప కాలంలోనే ఆయన మనకు ‘ఆగ్’, ‘బర్సాత్’, ‘ఆవారా’ వంటి సినిమాలను అందించారు. మానసిక అంతర్మథనం పొరలు పొరలుగా విప్పుకొన్నాయి ఆ సినిమాల్లో. సినిమా భాష ఒకటొకటిగా వర్ణమాల స్థాయిని అందిపుచ్చుకుంటూ ఉన్న కాలమది’’ అని డాక్టర్ జోషి వక్కాణించారు. కపూర్ సినిమాలు వినోదానికి, ప్రబోధాత్మకతకు మధ్య గల రేఖలను తుడిచివేస్తూ, ఒక దేశ ప్రజానీకం సామూహిక మానసాన్ని తీర్చిదిద్దాయని ఆయన భాష్యం చెప్పారు.
శ్రీమతి నిరుపమ కొట్రు ప్రారంభోపన్యాసమిస్తూ, కపూర్ గారి చలనచిత్రాలు సామాజిక అంశాలను లోతుగా చర్చించేవని వివరించారు. ‘‘తొలి నాళ్లలో ఆయన ఒక సహాయకునిగా ఉన్నప్పుడు సైతం సమాజానికి అద్దం పట్టే సినిమాలను తీసిన ప్రతిభాశాలి. ‘బూట్ పాలిష్’, ‘జాగ్తే రహో’, ఇంకా ‘బావ్రే’ వంటి చిత్రాలు విస్మరించిన, నిరాదరణకు గురి అయిన వర్గాల వారంటే ఆయనకున్న కరుణను కళ్లకు కట్టాయి’’ అని ఆమె తెలిపారు. కథను చెప్పడంలో కపూర్ గారికున్న శక్తి సినిమా హాళ్ల కన్నా విస్తృతమైందన్నారు. ‘‘ఆయన కథనాల ప్రభావం అంతటిది’’ అని ఆమె చెబుతూ, ‘‘ఆయన చిత్రాల్లో చెడ్డ మనుషులు మనసు మార్చుకొని తమ జీవనాన్ని ఉద్ధరించుకున్న వైనాలను చూసి విచలితులై, దేశంలోని బందిపోటు దొంగలు 1970వ దశాబ్దంలో లొంగిపోవడం మొదలుపెట్టార’’న్నారు. స్వయంగా తన జీవితంలో తటస్థించిన ఒక సంఘటనను వెల్లడిస్తూ ‘‘భారతీయ డాక్టరొకరు ఆఫ్రికాలో ఓ రోగికి శస్త్రచికిత్స చేశారు. ఆ డాక్టరు భారత్కు చెందిన వారని తెలుసుకొని, ఆ రోగి ముఖం చాటంత అయింది. ఏమిటీ! మీరు రాజ్ కపూర్ గారి మల్లేనే భారత్ వారా’ అని ఉబ్బితబ్బిబ్బు అయ్యారు. ప్రపంచ ఊహాలోకంలో ఆయన అంతగా ముద్రవేసుకున్నార’’న్నారు.
సభాధ్యక్షత వహించిన శ్రీ బి.పి. సింగ్ మాట్లాడుతూ... ప్రజాదరణకు పాత్రమైన చలనచిత్ర మాధ్యమం ద్వారా నైతిక నిష్ఠను సమాజంలోకి చొప్పించాలని తలచిన కపూర్ గారి అపురూప సామర్థ్యాన్ని వేనోళ్ల ప్రశంసించారు. కళను ఒక సాధనంగా ఎంచుకొని మనం అనుసరించాల్సిన నైతిక సూత్రాలను సూచించిన మార్గదర్శి ఆయన అని శ్రీ సింగ్ వాఖ్యానించారు. రాజ్ కపూర్ గారిని ‘‘ఒక తరంలో చలనచిత్ర రంగ అంతరాత్మగా వెలుగులీనారు’’ అంటూ శ్రీ మనోజ్ తివారీ ప్రశంసించారు. ప్రేమ, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం.. వీటిని నిరంతరం అన్వేషిస్తూ పయనాన్ని సాగించడంలోనే కపూర్ గారి వారసత్వం ఇమిడివుందన్నారు. ఆయన తీసిన సినిమాల్లో మానవత్వం పరిమళించిందంటూ డాక్టర్ యశ్ గులాటీ, శ్రీ ముకేశ్ త్యాగి…. కపూర్ కు నివాళి అర్పించారు. ‘‘ఇండియా ఆత్మను తెరపై ఆవిష్కరించిన ఒక కళాకారునికి దేశమంతా కలిసికట్టుగా కృతజ్ఞతలు తెలియజేసుకొనే ఘడియలే ఈ శతజయంతి’’ అని డాక్టర్ నిర్మల్ గహ్లోత్ తన స్వాగతోపన్యాసంలో అన్నారు.
ఈ సంవత్సరం పొడవునా రాజ్ కపూర్ శతజయంతి ఉత్సవాన్ని కొనసాగించనున్నారు. దీనిలో భాగంగా ఉపన్యాసాలు, గత స్మృతులను గుర్తుకు తెచ్చేందుకు సంబంధించిన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రదర్శనలను దేశ, విదేశాల్లో ఏర్పాటు చేయనున్నారు. నవ తరానికి రాజ్ కపూర్ను కేవలం ఒక లబ్ధ ప్రతిష్ఠ సినిమా దర్శకుడు-నిర్మాతగానే కాక, ఒక నాగరికతకు నైతిక అంతర్వాణిగా తన సందేశాలనిచ్చిన ఒక సహృదయ దార్శనికునిగా కూడా పునఃపరిచయం చేయాలన్నదే రెస్పెక్ట్ ఇండియా ఉద్దేశంగా ఉంది. డాక్టర్ జోషి మనస్సుకు హత్తుకొనేటట్టు చెబుతూ తన ప్రసంగం చివర్లో చెప్పినట్లు ‘‘రాజ్ కపూర్ ఒక చలనచిత్ర దర్శకుడు మాత్రమే కాదు. ఆయన భారతదేశ భావుకతను ఒక ఆత్మకథగా తెరపై ఆవిష్కరించారు’.
***
(Release ID: 2133510)