సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
‘భారత్ జెన్’కు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ శ్రీకారం
· భారతీయ భాషల కోసం ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటుతో దేశీయంగా రూపొందించిన తొలి కృత్రిమ మేధ ఆధారిత మల్టీమోడల్ ‘ఎల్ఎల్ఎం’ భారత్జెన్
· “లోతైన భారతీయ విలువలు... నైతికతకు అనుగుణంగా నైతిక.. సమ్మిళిత.. బహుభాషా కృత్రిమ మేధ సృష్టి ‘భారత్జెన్ జాతీయ కార్యక్రమ లక్ష్యం”
· “ప్రాంతీయ భాషలలో సంభాషించగల కృత్రిమ మేధ డాక్టర్ ద్వారా మారుమూల గ్రామాల్లో దూరవైద్య ప్రక్రియ విప్లవాత్మకం కాగలదు”
· “విద్యార్థుల సమగ్ర అభ్యసనం దిశగా మానవ విజ్ఞాన శాస్త్రాలతో సాంకేతికత సంధానానికి ‘ఎన్ఇపి-2020’ తోడ్పడుతుంది”
Posted On:
02 JUN 2025 8:29PM by PIB Hyderabad
భారతీయ భాషల కోసం ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటుతో దేశీయంగా రూపొందించిన తొలి కృత్రిమ మేధ ఆధారిత మల్టీమోడల్ ‘ఎల్ఎల్ఎం’ ‘భారత్జెన్’కు కేంద్ర శాస్త్ర-సాంకేతిక శాఖ (స్వతంత్ర బాధ్యత) సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ‘భారత్జెన్’ పేరిట దేశంలోనే అత్యంత భారీగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) సమ్మిట్-హ్యాకథాన్ శిఖరాగ్ర సదస్సులో భారత్జెన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
‘నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్-ఫిజికల్ సిస్టమ్స్’ (ఎన్ఎం-ఐసిపిఎస్) కింద రూపొందించిన ‘భారత్జెన్’ నమూనాను ‘ఐఐటి-బాంబే-లో ‘టిఐహెచ్ ఫౌండేషన్ ఫర్ ఐఒటి-ఐఒఇ’ ద్వారా ప్రయోగాత్మకంగా పరిశీలించారు. దేశ భాషా-సాంస్కృతిక పట్టకంలో కృత్రిమ మేధ రూపకల్పనను విప్లవాత్మకం చేయడం భారత్జెన్ లక్ష్యం. ఈ కార్యక్రమానికి చేయూతనిస్తున్న శాస్త్ర-సాంకేతిక విభాగం (డిఎస్టి) ప్రముఖ విద్యాసంస్థలు, నిపుణులు, ఆవిష్కర్తలతో కూడిన బలమైన సమూహాన్ని ఒక వేదికపైకి తెచ్చింది.
ఈ సదస్సులో కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ, భూవిజ్ఞాన శాఖ, ప్రధాని కార్యాలయ, సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పెన్షన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల (స్వతంత్ర బాధ్యతగల) సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ- “లోతైన భారతీయ విలువలు, నైతికతకు అనుగుణంగా నైతిక, సమ్మిళిత, బహుభాషా కృత్రిమ మేధ సృష్టి ‘భారత్జెన్ జాతీయ కార్యక్రమ లక్ష్యం” అని ప్రకటించారు. అలాగే “ఈ వేదిక వచనం, ప్రసంగం, చిత్రాలు నమూనాలు తదితరాలను ఏకీకృతం చేస్తూ, 22 భారతీయ భాషలలో సముచిత ‘ఏఐ’ పరిష్కారాలను అందిస్తుంది” అని చెప్పారు.
అంతేకాకుండా “ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, పరిపాలన వంటి కీలక రంగాలకు ఇది సాధికారతనిస్తుంది. ప్రతి భారతీయుడినీ అర్థం చేసుకుంటూ సేవలందించే ప్రాంతీయ-నిర్దిష్ట ఏఐ పరిష్కారాలను సమకూరుస్తుంది” అని డాక్టర్ సింగ్ వివరించారు.
ఈ సందర్భంగా తన సొంత నియోజకవర్గం విజయగాథను ఆయన గుర్తుచేసుకుంటూ- ఏఐ దూరవైద్య (టెలిమెడిసిన్) సేవలను ప్రస్తావించారు. ఈ ప్రక్రియలో ‘ఏఐ వైద్యుడు’ రోగి మాతృభాషలో సరళంగా సంభాషించగలడని పేర్కొన్నారు. “దీనివల్ల విశ్వాసం ఇనుమడిస్తుంది... అంతేగాక సానుకూల మానసిక ప్రభావం చూపుతుంది. దేశవ్యాప్తంగా సూపర్స్పెషాలిటీ ఆస్పత్రులతో అనుసంధానించిన మారుమూల ప్రాంతాలోనూ మెరుగైన ఆరోగ్య సంరక్షణకు తోడ్పడుతుంది” అని ఆయన వివరించారు.
‘భారత్జెన్’ కార్యక్రమం ‘భారత సాంకేతికాబ్దం’ (టెకేడ్)పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృక్కోణానికి అనుగుణంగా రూపొందినదని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దీని ధ్యేయం కేవలం ఆవిష్కరణ కాదని, సార్వజనీనత సాధనకేనని తెలిపారు. ‘సిపిగ్రామ్స్’ (సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రస్ అండ్ మోనిటరింగ్ సిస్టమ్) సహా భారత కృత్రిమ మేధ పురోగమనం ప్రపంచానికి ప్రామాణికంగా మారిందని అభివర్ణించారు. అనేక దేశాలు నేడు ‘సిపిగ్రామ్స్’ను ఒక ఆదర్శప్రాయ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా అధ్యయనం చేస్తున్నాయని వెల్లడించారు.
భారత పరిశోధన-అభివృద్ధి-ఆవిష్కరణావరణ వ్యవస్థకు ‘అనుసంధాన్ ఎన్ఆర్ఎఫ్’ మరింత ఉత్తుజమిస్తుందని మంత్రి పునరుద్ఘాటించారు. వీధి వర్తకులు, చేతివృత్తులవారు, సూక్ష్మ పరిశ్రమల వ్యవస్థాపకుల సముద్ధరణకు ఉద్దేశించిన ‘పిఎం ముద్రా యోజన, పిఎం స్వానిధి, పిఎం విశ్వకర్మ యోజన’ వంటి ప్రధాన పథకాల ద్వారా వస్తున్న ప్రగతిశీల మార్పులను ఆయన ప్రస్తావించారు.
పౌరులతో మమేకం కావడం, ఫిర్యాదుల పరిష్కార స్థాయిని పెంచడం కోసం బహుభాషా అభిప్రాయ సేకరణ వ్యవస్థలను ‘సిపిగ్రామ్స్’ వంటి వేదికలలో ఏకీకృతం చేయడాన్ని ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు. ఈ మేరకు క్షేత్రస్థాయి పాలనలో జనరేటివ్ ఏఐ ప్రగతిశీల పాత్రను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే ‘ఎన్ఇపి-2020’ సమగ్ర దృక్కోణాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- విద్యార్థుల అభ్యసనం కోసం మానవ విజ్ఞాన శాస్త్రాలతో సాంకేతికతను సంధానించేందుకు ఇది వీలు కల్పిస్తుందన్నారు. తద్వారా వారి ఉపాధి-ఆవిష్కరణ సామర్థ్యం కూడా పెరుగుతాయి.
దేశంలోని 3,000కుపైగా వ్యవసాయ-సాంకేతిక అంకుర సంస్థల విజయాన్ని... ముఖ్యంగా జమ్ముకశ్మీర్లో లావెండర్ సాగు వంటి మార్గదర్శక కార్యక్రమాలపై డాక్టర్ జితేంద్ర సింగ్ హర్షం వ్యక్తం చేశారు. మెట్రో, ఐటీ రంగాలకు మించి ఆవిష్కరణల వృద్ధికి ఇది నిదర్శనమన్నారు. ప్రభుత్వ విభాగాలు, పరిశోధన కేంద్రాల్లో సహకారాన్ని మరింత పెంచే లక్ష్యంతో ఈ శిఖరాగ్ర సదస్సులో ఓ కీలక అవగాహన ఒప్పంద మార్పిడి కార్యక్రమం కూడా పూర్తయింది.
కృత్రిమ మేధ ద్వారా వాస్తవ ప్రపంచ సమస్యల పరిష్కారం దిశగా విద్యార్థి ఆవిష్కర్తలను ప్రోత్సహించడంలో జనరేటివ్ ఏఐ హ్యాకథాన్-2025 ప్రారంభం ఓ కీలక ముందడుగుగా గుర్తింపు పొందింది. ‘భారత్జెన్’ కార్యక్రమం మొత్తం 25 సాంకేతిక ఆవిష్కరణల కూడళ్ల ద్వారా అమలవుతోంది. ఈ కూడళ్లలో నాలుగింటిని ఇప్పటికే సాంకేతిక మార్పిడి (ట్రాన్స్లేషనల్) పరిశోధన పార్కులు (టిటిఆర్పి)గా ఉన్నతీకరించారు. ఈ మిషన్ పరిధిలోని 4 మూల స్తంభాల్లో సాంకేతిక రూపకల్పన, వ్యవస్థాపన, మానవ వనరుల అభివృద్ధి, అంతర్జాతీయ సహకారం కీలకమైనవి.
భారత్జెన్ సదస్సులో శాస్త్ర-సాంకేతిక విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరండికర్, పరిపాలన సంస్కరణలు-ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యదర్శి వి.శ్రీనివాస్, నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన మంత్రిత్వ శాఖ కార్యదర్శి రజిత్ పున్హాని, ఎలక్ట్రానిక్స్-ఐటీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అభిషేక్ సింగ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే పారిశ్రామిక రంగ ప్రముఖుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడైన క్రిస్ గోపాలకృష్ణన్, భారత్జెన్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ గణేష్ రామకృష్ణన్ కూడా హాజరయ్యారు.
ప్రభుత్వంలోని పలువురు సీనియర్ అధికారులు, ప్రముఖ విద్యావేత్తలు, యువ విద్యార్థి ఆవిష్కర్తల హాజరీతోపాటు వారి భాగస్వామ్యంతో భారత కృత్రిమ మేధావరణ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంపై సదస్సు లక్ష్యం, దృక్పథం మరింత బలోపేతమయ్యాయి.
***
(Release ID: 2133423)