రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఉగ్రవాదంపై భారత సమర్థ చర్యల్లో నారీశక్తిది కీలక పాత్ర: రక్షణ మంత్రి


· లెఫ్టినెంట్ కమాండర్లు దిల్నా. కె, రూప ‘నావికా సాగర్ పరిక్రమ-2’ ప్రపంచయాత్రను విజయవంతంగా పూర్తిచేసుకుని తిరిగొచ్చిన సందర్భంగా ఐఎన్ఎస్వీ తారిణి పతాకావిష్కరణ చేసిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్

· భారత్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి ద్వయం వీరే

Posted On: 29 MAY 2025 6:49PM by PIB Hyderabad

“ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్తాన్, పీవోకేలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకున్న సమర్థమైన చర్యల్లో మహిళా పైలట్లు, ఇతర మహిళా సైనికులు కీలక పాత్ర పోషించారు” అని రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మే 29న గోవాలో జరిగిన ఐఎన్ఎస్వీ తారిణి పతాకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సాయుధ దళాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పటి నుంచి ప్రతి పాత్రలోనూ వారు అద్భుత ప్రదర్శన కనబరిచారని, ప్రతి బాధ్యతనూ సంపూర్ణంగా నెరవేర్చారని రక్షణ మంత్రి పునరుద్ఘాటించారు.

“సియాచిన్ శిఖరాల నుంచి సముద్ర అగాధాల వరకు భారతీయ మహిళలు అనేక బాధ్యతలను నెరవేరుస్తున్నారు. ఇది దేశ భద్రత వలయాన్ని మరింత బలోపేతం చేస్తోంది. సైనిక పాఠశాలల ద్వారాలు నేడు బాలికల కోసమూ తెరుచుకుంటున్నాయి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఈ నెలలో 17 మంది మహిళలు బయటికొస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత సాయుధ దళాల్లోని అన్ని శాఖల్లోనూ మహిళలు క్రియాశీలకంగా, సమర్థంగా పాలుపంచుకున్నారు” అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

‘నావికా సాగర్ పరిక్రమ-2ను విజయవంతంగా పూర్తిచేసుకుని తిరిగొచ్చిన భారత నావికా దళాధికారులైన ధీర వనితలు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా.కె, లెఫ్టినెంట్ కమాండర్ రూప.ఎ ను రక్షణ మంత్రి అభినందించారు. ఈ చరిత్రాత్మక యాత్రను పూర్తిచేసుకుని ప్రపంచాన్ని చుట్టివచ్చిన వారి ధైర్యం, అంకితభావం, సహనశీలతను ఆయన ప్రశంసించారు. వారి సాగరయానాన్ని నారీ శక్తికి ప్రతిరూపంగా ఆయన అభివర్ణించారు.

ఈ సాహసయాత్ర రెండో ఎడిషన్‌లో వీరిద్దరూ భారత్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి ద్వయంగా వీరు నిలిచారు. ఈ అధికారులిద్దరూ ఎనిమిది నెలల కాలంలో 25,600 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించారు. ఈ మొత్తం ప్రయాణంలో ఫ్రీమాంటిల్ (ఆస్ట్రేలియా), లిటెల్టన్ (న్యూజిలాండ్), పోర్ట్ స్టాన్లీ (ఫాక్లాండ్ దీవులు), కేప్ టౌన్ (దక్షిణాఫ్రికా) నౌకాశ్రయాల వద్ద వారు ఆగారు.

భౌతిక, మానసిక అవరోధాలను ఎదుర్కొని, శక్తియుక్తులతో వాటిని అధిగమించి, తాము భారత వీరపుత్రికలమని ప్రపంచానికి చాటారంటూ రాజ్‌నాథ్ సింగ్ వారిని ప్రశంసించారు. ఎనిమిది నెలల సుదీర్ఘ సాగరయానంలో ఒంటరితనాన్ని విజయవంతంగా ఎదుర్కొన్న మహిళా అధికారుల మానసిక స్థైర్యాన్ని కొనియాడారు. ఈ లెఫ్టినెంట్ కమాండర్లిద్దరూ సాధించిన ఘనత అందరికీ సాధ్యం కాదని, వారి ధైర్యసాహసాలు, సంకల్పం, బలాన్ని ఇది తెలియజేస్తుందని వ్యాఖ్యానించారు.

పలు నౌకాశ్రయాల్లో ఆగిన సందర్భంగా స్థానికులు, భారతీయ ప్రవాసులు వీరిద్దరికీ ఘనస్వాగతం పలికారు. త్రివర్ణ పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా రెపరెపలాడించడం ద్వారా ఈ ఇద్దరు మహిళా అధికారులూ దేశం గర్వించేలా చేశారని రక్షణ మంత్రి అన్నారు.

“ఈ గొప్ప ప్రయాణాన్ని పూర్తి చేసిన స్ఫూర్తితోనే ఆ అనుభవాలను మీరు నమోదు చేయాలి. మీకు ఎదురైన చేదు అనుభవాలనూ మధురానుభూతులనూ, నేర్చుకున్న విషయాలనూ అన్నింటినీ రికార్డు చేయండి. అవి భావి తరానికి, ముఖ్యంగా మన యువతులకు స్ఫూర్తినిస్తాయి” అని ఈ ధీరవనితలకు రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

పతాకావిష్కరణకు కొన్ని రోజుల ముందు మహిళా అధికారులతో తన వర్చువల్ సంభాషణను గుర్తుచేసుకున్న రక్షణ మంత్రి.. ఆ సంభాషణ తనలో భావోద్వేగాలను నింపిందని చెప్పారు. ఇది దేశానికి గర్వకారణమన్న ఆయన.. గోవాలో స్వాగత కార్యక్రమంలో పాల్గొనడం సంతోషాన్నిచ్చిందన్నారు.

విభిన్నమైన సవాళ్లను అధిగమించడంలో భారత నావికాదళం ధైర్యసాహసాలకు, పరిస్థితులను సానుకూలం చేసుకునే తీరుకు ఈ యాత్ర నిదర్శనమని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. యాత్రకు సహకరించిన సిబ్బందిని అభినందించారు. నావికా సాగర్ పరిక్రమ-II విజయవంతంగా పూర్తవడానికి దోహదపడిన శిక్షకులు, సాంకేతిక బృందం, నావికాదళ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి తన ప్రసంగంలో ఈ ఇద్దరి అసాధారణ ధైర్యసాహసాలు, పట్టుదల, అచంచలమైన స్ఫూర్తిని కొనియాడారు. అద్భుతమైన మన సముద్ర ఘనతను చాటేలా, సాగర చైతన్యాన్ని పెంపొందించే దిశగా ఈ ప్రయాణం ముఖ్యమైన ముందడుగు అన్నారు. నారీశక్తికి నిదర్శనంగా నిలిచే వీరి గాథ ప్రతి భారతీయుడికీ స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన వివరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ‘బ్రేకింగ్ వేవ్స్, మేకింగ్ హిస్టరీ’ శీర్షికతో ప్రపంచాన్ని చుట్టివచ్చిన ఈ అద్భుత యాత్రను వివరించే ఫోటో ఎస్సే బుక్‌ను విడుదల చేశారు. అద్భుతమైన ఈ సాగరయానాన్ని వివరించేలా ఈ ఎస్సేబుక్‌ను రూపొందించారు. సజీవమైన ఛాయాచిత్రాలు, సముద్ర జీవుల వివరాలను ఇందులో పొందుపరిచారు. సముద్ర సాహస కృత్యాలు, సాగరయాన పరిశోధనను ప్రత్యేకమైన దృష్టితో ఇది అందిస్తుంది.

ప్రతిభను పెంపొందించడంలో, సాహస కృత్యాలను ప్రోత్సహించడంలో భారత నావికాదళ నిబద్ధతకు నావికా సాగర్ పరిక్రమ-2 నిదర్శనం. సముద్ర అన్వేషణలో భారత స్వావలంబనను ఇది ప్రతిబింబిస్తుంది. 2024 అక్టోబరు 2న గోవాలోని ఐఎన్ఎస్- మాండోవి నుంచి నావికా దళాధిపతి ఈ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర మొదటి ఎడిషన్‌ను 2017-18లో ఆరుగురు మహిళా సభ్యులతో కూడిన బృందం పూర్తి చేసింది.

గోవా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి కాండవెలో, సాయుధ దళాల వైద్య సేవల డైరెక్టర్ జనరల్ వైస్ అడ్మిరల్ ఆర్తి సరిన్, ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, సదరన్ నావల్ కమాండ్ వైస్ అడ్మిరల్ వి. శ్రీనివాస్, ఇతర సీనియర్ నౌకాదళ అధికారులు, కమాండర్ అభిలాష్ టోమీ (విశ్రాంత), లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా. కె, లెఫ్టినెంట్ కమాండర్ రూప కుటుంబాలు ఈ కార్యక్రమానికి హాజరయ్యాయి.  

 

***


(Release ID: 2132674)