ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఐఎంఎఫ్లో భారత్ వైఖరి
Posted On:
09 MAY 2025 9:21PM by PIB Hyderabad
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఈరోజు పాకిస్థాన్ కు ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (ఇఎఫ్ఎఫ్) రుణ కార్యక్రమాన్ని (1 బిలియన్ డాలర్లు) సమీక్షించింది. అలాగే, ఆ దేశానికి కొత్తగా 1.3 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చే రిజిలియెన్స్ అండ్ సస్టెయినబిలిటీ ఫెసిలిటీ (ఆర్ఎస్ఎఫ్) కార్యక్రమాన్ని పరిశీలించింది. చురుకైన, బాధ్యత గల సభ్యదేశంగా భారత్ గతంలో పాకిస్థాన్ విషయంలో ఐఎంఎఫ్ రుణాల నిర్వహణకు సంబంధించి సందేహాలు వ్యక్తం చేసింది. దాని పేలవమైన ట్రాక్ రికార్డ్ తో పాటు, రుణ సహాయ నిధులను సరిగా వినియోగించకుండా వాటిని సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు వాడే అవకాశం ఉందని కూడా భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
పాకిస్తాన్ ఐఎంఎఫ్ నుంచి చాలా కాలంగా రుణాలు తీసుకుంటున్న దేశం. అయితే, వాటిని నిర్దేశిత కార్యక్రమాల కోసం అమలు చేయడంలోనూ, ఐఎంఎఫ్ విధించిన షరతులను పాటించడంలోనూ చాలా ప్రతికూల రికార్డును కలిగి ఉంది. 1989 నుంచి గత 35 సంవత్సరాల్లో, 28 సంవత్సరాలు ఐఎంఎఫ్ నుంచి పాకిస్థాన్ కు రుణాలు విడుదలయ్యాయి.
2019 నుంచి గత ఐదేళ్లలో పాకిస్థాన్ నాలుగు ఐఎంఎఫ్ పథకాల ద్వారా రుణాలు పొందింది. అయితే అవి సరైన ఆర్థిక విధాన వ్యవస్థను ఏర్పరచడంలో విజయవంతమయ్యుంటే, పాకిస్థాన్ మళ్లీ ఐఎంఎఫ్ దగ్గరకు సహాయం కోసం రావాల్సిన అవసరం ఉండేది కాదు. ఇటువంటి ట్రాక్ రికార్డ్ ఉన్న పాకిస్థాన్ విషయంలో ఐఎంఎఫ్ రుణ కార్యక్రమాల రూపకల్పన ప్రభావం పైన, లేదా వాటిని పర్యవేక్షించడం పైనా సందేహాలు వస్తాయని, అలాగే పాకిస్తాన్ వాటిని అమలు చేసిన తీరుపై ప్రశ్నలు కూడా తలెత్తుతాయని భారత్ పేర్కొంది.
పాకిస్థాన్ సైన్యం ఆర్థిక వ్యవహారాల్లో మితిమీరి జోక్యం జేసుకోవడం వల్ల విధానాలు తారుమారు కావడం, సంస్కరణల తిరోగమనం వంటి నష్టాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి పౌర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, సైన్యం దేశ రాజకీయాల్లో ఎంతో ప్రభావం చూపిస్తూ, ఆర్థిక వ్యవస్థలో కూడా తన పరిధిని విస్తరిస్తోంది. వాస్తవానికి, 2021 ఐక్యరాజ్యసమితి నివేదిక పాకిస్థాన్ లో సైనిక సంబంధిత వ్యాపారాలను “ఆ దేశంలో అతిపెద్ద వ్యాపార సమూహంగా" గా అభివర్ణించింది. ఇప్పటికీ ఆ పరిస్థితి ఏ మాత్రం మారలేదు. ఇప్పటికీ పాకిస్థాన్ సైన్యం ఆ దేశం లోని స్పెషల్ ఇన్వెస్ట్ మెంట్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది.
ఐఎంఎఫ్ వనరుల దీర్ఘకాలిక వినియోగంపై ఆ సంస్థ మూల్యాంకన నివేదికలోని పాకిస్థాన్ భాగాన్ని భారత్ ప్రముఖంగా ప్రస్తావించింది. పాకిస్థాన్ కు ఐఎంఎఫ్ రుణాలు ఇవ్వడంలో రాజకీయ అంశాలు కీలక పాత్ర పోషిస్తాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోందని పేర్కొంది. పదేపదే ఇచ్చే రుణ సహాయాల ఫలితంగా, పాకిస్థాన్ రుణ భారం పెరిగిపోయి, ఇది పాకిస్థాన్ ను ఐఎంఎఫ్ కు విఫల బాకిదారుగా మార్చే విపరీత పరిస్థితి ఏర్పడుతుందని భారత్ పేర్కొంది.
సీమాంతర ఉగ్రవాదాన్ని నిరంతరం ప్రోత్సహిస్తున్న దేశానికి మరింత మద్దతు ఇవ్వడం ద్వారా ప్రపంచానికి ప్రమాదకరమైన సంకేతం వెళ్తుందని భారత్ హెచ్చరించింది. ఇది నిధులందించే సంస్థలు, దాతల ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని, అంతర్జాతీయ విలువలను పరిహాసం చేసినట్టు అవుతుందని భారత్ స్పష్టంగా పేర్కొంది. ఐఎమ్ఎఫ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి వచ్చే నిధులను సైనిక, ప్రభుత్వ ప్రాయోజిత సీమాంతర ఉగ్రవాద ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయవచ్చనే భారత్ ఆందోళన అనేక సభ్య దేశాల నుంచి కూడా వ్యక్తం అవుతోంది. అయితే, ఐఎంఎఫ్ ప్రతిస్పందన విధానపరమైన, సాంకేతిక పరమైన నిబంధనల పరిమితుల్లో ఉంటుంది. ప్రపంచ ఆర్థిక సంస్థలు అనుసరిస్తున్న విధానాల్లో నైతిక విలువలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిన తక్షణ అవసరాన్ని ఎత్తిచూపుతున్న తీవ్రమైన అంతరం ఇది.
భారత్ అభ్యంతరాలను, ఓటింగ్ లో పాల్గొనకపోవడాన్ని ఐఎంఎఫ్ పరిగణనలోకి తీసుకుంది.
***
(Release ID: 2128059)