సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ జోక్యంతో పిప్రాహ్వా బౌద్ధ స్మారక చిహ్నాల వేలం వాయిదా వేసిన సోథ్బీ హాంకాంగ్ సంస్థ
Posted On:
07 MAY 2025 3:45PM by PIB Hyderabad
ఈరోజు నిర్వహించాల్సిన పవిత్రమైన పిప్రాహ్వా బౌద్ధ స్మారక చిహ్నాల వేలాన్ని భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ జోక్యంతో సోథ్బీ హాంగ్ కాంగ్ సంస్థ వాయిదా వేసింది.
1898లో విలియం క్లాక్స్టన్ పెప్పే పిప్రాహ్వాలో నిర్వహించిన తవ్వకాల్లో సోప్స్టోన్, స్ఫటికంతో చేసిన పేటికలు, ఇసుకరాయి పెట్టెతో పాటు బుద్ధుని ఎముకల భాగాలు, విలువైన బంగారు ఆభరణాలు, రత్నాల వంటి చారిత్రక అవశేషాలు లభించాయి. ఈ పేటికల్లో ఒకదానిపై బ్రాహ్మి లిపిలో ఉన్న శాసనం ద్వారా వీటిని బుద్ధుని అవశేషాలుగా నిర్ధారించారు. వీటిని శాక్య వంశం వారు నిక్షిప్తం చేశారు. ఈ అవశేషాల్లో ఎక్కువ భాగం 1899లో కోల్కతాలోని ఇండియన్ మ్యూజియంకు తరలించారు. భారతీయ చట్టం ప్రకారం 'AA' పురాతన వస్తువులుగా వీటిని వర్గీకరిస్తూ, వీటిని తొలగించడం లేదా అమ్మడంపై నిషేధం విధించారు. బుద్ధుని పవిత్ర ఎముక అవశేషాల్లో కొంత భాగాన్ని డబ్ల్యు.సి. పెప్పే సియామ్ రాజుకు బహుమతిగా ఇచ్చారు. బుద్ధుని అంత్యక్రియల సమయంలో ఉపయోగించిన రత్నాలు పెప్పే మునిమనవని సంరక్షణలో ఉండగా వాటిని కూడా వేలానికి ఉంచారు.
మీడియా నివేదికల ద్వారా వేలం గురించి తెలుసుకున్న సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెంటనే కింది చర్యలను ప్రారంభించింది:
· వేలాన్ని వెంటనే నిలిపివేయాలని అభ్యర్థిస్తూ భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ) డైరెక్టర్ జనరల్ ఈనెల 2వ తేదీన హాంకాంగ్ కాన్సులేట్ జనరల్కు లేఖ రాశారు.
· అదే రోజు జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ఈ విషయాన్ని గురించి యూకే సాంస్కృతిక, మీడియా, క్రీడల మంత్రి గౌరవనీయ లిసా నాండీతో చర్చించి, ఆ పవిత్ర స్మారక చిహ్నాల సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యత దృష్ట్యా వేలం వాయిదాకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
· తదనంతర చర్యలను గురించి చర్చించడం కోసం ఈనెల 5వ తేదీన సాంస్కృతిక శాఖ కార్యదర్శి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
· అదే రోజున సోథ్బీకి (ప్రతినిధులైన శ్రీమతి ఐవీ వాంగ్, జూలియన్ కింగ్ ద్వారా), క్రిస్ పెప్పేకు వేలం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసు జారీ అయింది.
· వేలం నిలిపివేశారని నిర్ధారించుకోవడానికి దాని యూరప్ పశ్చిమ, తూర్పు ఆసియా విభాగాలు, యూకే అలాగే హాంకాంగ్లోని రాయబార కార్యాలయాల ద్వారా సమాచారాన్ని తెలుసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు
ఈ నెల 5వ తేదీన లీగల్ నోటీసును అందుకున్నట్లు ఈమెయిల్ ద్వారా ప్రకటించిన సోథ్బీ హాంకాంగ్, ఈ విషయం పరిశీలనలో ఉందనీ, రాతపూర్వక సమాధానం సమర్పిస్తామని హామీ ఇచ్చింది.
జాయింట్ సెక్రటరీ (తూర్పు ఆసియా విభాగం, ఎమ్ఈఏ), హాంకాంగ్లోని భారత కాన్సుల్ జనరల్తో సహా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈ నెల 6న సోథ్బీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ స్మారక చిహ్నాలు సాధారణ కళాఖండాలు కాదనీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది బౌద్ధులకు అత్యంత పవిత్రమైనవని ప్రతినిధి బృందం స్పష్టం చేసింది. ఈ స్మారక చిహ్నాలు పూర్తిగా భారత్కు చెందినవేనని, అయితే వీటిని వలస రాజ్యాల కాలంలో పలు ప్రాంతాలకు తరలించారని ప్రతినిధి బృందం వారికి స్పష్టంగా వివరించింది.
పిప్రాహ్వా స్మారక చిహ్నాల వేలాన్ని వాయిదావేస్తున్నట్లు 6వ తేదీన ఆలస్యంగా ఈమెయిల్ ద్వారా ప్రకటించిన సోథ్బీ హాంకాంగ్ సంస్థ ఈ విషయంగా మరింత చర్చ జరగాలని ప్రతిపాదించింది. అనంతరం సోథ్బీ వెబ్సైట్ నుంచి వేలానికి సంబంధించిన పేజీని తొలగించింది.
యునెస్కోలో భారత శాశ్వత ప్రతినిధి క్రిస్టా పిక్కట్, యునెస్కో డైరెక్టర్, భారత్, శ్రీలంక, ఇతర దేశాల బౌద్ధ సంస్థల ప్రతినిధి ప్రొఫెసర్ నమన్ అహుజాలు ఈ విషయంగా మంత్రిత్వ శాఖ ప్రయత్నాలకు పూర్తి మద్దతునిచ్చారు, అలాగే ప్రధానమంత్రి పోర్టల్, జాతీయ, అంతర్జాతీయ మీడియాకు ఈ విషయంగా వారు అధికారిక నివేదికను సమర్పించారు.
ఏఎస్ఐ, ఎమ్ఈఏల సహకారంతో, ఆ పవిత్ర స్మారక చిహ్నాలను తిరిగి భారత్కు అప్పగించే విషయంగా చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంబంధిత వ్యక్తులందరినీ దీనిలో భాగస్వామ్యం చేయనుంది.
***
(Release ID: 2127621)