రక్షణ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి మధ్య ద్వైపాక్షిక సమావేశం
* ఉగ్రవాదం, దానిని సమర్థిస్తున్న దేశాలకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలని పిలుపు
* పహల్గాం ఉగ్రదాడి అంశంలో భారత్కు సంపూర్ణ మద్ధతు ప్రకటించిన జపాన్
* ట్యాంక్ ఇంజిన్లు, ఏరో ఇంజిన్లు సహా నూతన రంగాల్లో జపాన్తో భాగస్వామ్యం కుదుర్చుకొనేలా భారతీయ రక్షణ పరిశ్రమ సామర్థ్యాలను వివరించిన రక్షణ మంత్రి
Posted On:
05 MAY 2025 5:47PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని మానెక్షా సెంటర్లో జపాన్ రక్షణ మంత్రి జనరల్ నకతానితో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు (2025, మే 5) ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఇరుపక్షాల నాయకులు ఖండించారు. ఈ అంశంలో అంతర్జాతీయ సహకారం అవసరం గురించి తెలియజేశారు.
ప్రత్యక్షంగా, పరోక్ష శక్తుల సహకారంతో భారత్పై సీమాంతర ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్ ప్రభుత్వ విధానాన్ని రక్షణ మంత్రి ఖండించారు. ఇలాంటి దాడులు స్థానికంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయని ఆయన అన్నారు. ఉగ్రవాదం, దానికి సహకరిస్తున్న పాకిస్థాన్ ప్రాయోజిత కార్యకలాపాలకు వ్యతిరేకిస్తూ ఐక్యంగా నిలబడాలని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి పట్ల జపాన్ రక్షణ మంత్రి సంతాపం వ్యక్తం చేశారు. ఈ అంశంలో భారత్కు సంపూర్ణ మద్దతు అందిస్తామని తెలిపారు.
భారత్-జపాన్ మధ్య ఉన్న వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యానికి సంబంధించి భద్రత, రక్షణకు చెందిన ప్రధానాంశాలపై ఇరుదేశాల మంత్రులు సమీక్షించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు ప్రాంతీయంగా శాంతి స్థాపనకు కృషి చేయడంలో వారి నిబద్ధతను పునరుద్ఘాటించారు. రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ విన్యాసాలు, పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటున్న అంశాల్లో పెరుగుతున్న వైవిధ్యం, స్థిరత్వాన్ని ఇరువురూ స్వాగతించారు. అలాగే ఈ సంబంధాల పరిధిని, పెట్టుబడులను విస్తరించేందుకు, నౌకా వాణిజ్యంలో భారత్, జపాన్ మధ్య సహకారంలో కొత్త మార్గాలను అన్వేషించేందుకు ఇద్దరు నాయకులు అంగీకరించారు.
ట్యాంక్ ఇంజిన్లు, ఏరో ఇంజిన్లు సహా కొత్త రంగాల్లో జపాన్తో భాగస్వామ్యం కుదుర్చుకొనేలా భారతీయ రక్షణ పరిశ్రమ సామర్థ్యాలను రక్షణ మంత్రి వివరించారు. నిర్వహణ, మరమ్మత్తు, తనిఖీ కార్యకలాపాల్లో సామర్థ్యాల గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఆటోమేషన్, కృత్రిమ మేధ వంటి ప్రత్యేకమైన రంగాల్లో భాగస్వామ్యాన్ని అన్వేషించడంతో సహా పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. సైబర్, స్పేస్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఇద్దరు మంత్రులు నిర్ణయించారు.
భారత్, జపాన్ దేశాలు దీర్ఘకాలంగా స్నేహసంబంధాలను కొనసాగిస్తున్నాయి. ఇవి 2014లో ప్రత్యేక, వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యంగా హోదాకు ఎదిగినప్పటి నుంచి మరింత వేగం పుంజుకున్నాయి. ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింత విస్తరించాలనే బలమైన అంకితభావాన్ని ప్రదర్శిస్తూ.. ఇరుపక్షాలు చర్చను ముగించాయి.
అంతకు ముందు జపాన్ రక్షణ మంత్రి జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమరవీరులకు నివాళి అర్పించారు. ద్వైపాక్షిక చర్చల ప్రారంభానికి ముందు మానెక్షా సెంటర్ వద్ద త్రివిధ దళాలు ఆయనకు గౌరవ వందనంతో స్వాగతం పలికాయి.
***
(Release ID: 2127223)