సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇ-గవర్నెన్స్‌పై 28వ జాతీయ సమావేశాన్ని (ఎన్‌సీఈజీ) నిర్వహిస్తున్నాం: పరిపాలక సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం


* ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఈ ఏడాది జూన్ 9, 10వ తేదీల్లో ఎన్‌సీఈజీ నిర్వహణ

* అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర ప్రాతినిధ్య సంస్థలు నమోదు చేసుకోవడానికి
https://nceg.gov.in/ పోర్టల్ సిద్ధం

Posted On: 30 APR 2025 5:18PM by PIB Hyderabad

ఇ-గవర్నెన్స్‌ (ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా పరిపాలన) అంశంపై 28వ జాతీయ సమావేశాన్ని (ఎన్‌సీఈజీ) ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జూన్ 9,10లలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతోపాటు పరిపాలక సంస్కరణలు, ప్రజాఫిర్యాదుల విభాగం (డీఏఆర్‌పీజీ) కలిసి నిర్వహిస్తాయి.

‘‘వికసిత్ భారత్: సివిల్ సర్వీసు-డిజిటల్ మాధ్యమం దన్నుతో అభివృద్ధి’’ అనేది ఈ రెండు రోజుల సమావేశానికి ముఖ్య ఇతివృత్తంగా ఉంటుంది. దీనిలో భాగంగా ఆరు సర్వసభ్య చర్చావేదికలను, ఆరు బ్రేకవుట్ సెషన్లను నిర్వహిస్తారు. ప్రజలకు ప్రభుత్వాలు అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరచడానికి, సుపరిపాలనలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ ‘అభివృద్ధి చెందిన భారత్’ సంకల్పాన్ని సాకారం చేసే దిశగా అడుగులు వేయడానికి ‘‘కనీస స్థాయి ప్రభుత్వం-గరిష్ఠ స్థాయి పరిపాలన’’ విధానాన్ని స్ఫూర్తిదాయకంగా అమలుపరచడం.. అందుకు ఎలాంటి కార్యాచరణ వ్యూహాన్ని అవలంబిస్తే చక్కని ఫలితాలు సాధించవచ్చో విధాన రూపకర్తలు, పరిశ్రమ రంగ ప్రముఖులు, విద్యారంగ ప్రముఖులు చర్చోపచర్చలు జరిపి తమ అభిప్రాయాలు వెల్లడించేందుకు ఒక వేదికను ఈ సమావేశం సమకూరుస్తుంది.

ఈ సమావేశంలో భాగంగా ఈ ఏడాది జాతీయ ఇ-గవ్ పురస్కారాలను (ఎన్ఏఈజీ 2025) ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డులను సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి, సైన్స్-టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), భూ విజ్ఞ‌ానశాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా),  ప్రధాన మంత్రి కార్యాలయ శాఖ సహాయ మంత్రి, అణు ఇంధన విభాగం శాఖ సహాయ మంత్రి,  అంతరిక్ష విభాగ శాఖ సహాయ మంత్రి అయిన డాక్టర్ జితేంద్ర సింగ్ అందజేస్తారు.

ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు హాజరవుతారు. ఆయన ఈ సమావేశాన్ని ప్రారంభంచడంతోపాటు ఐటీ కూడలిగా విశాఖపట్నం అంశంపై ఒక సర్వసభ్య కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ ఎన్. లోకేశ్ ఈ సమావేశంలో ప్రధానోపన్యాసాలు ఇస్తారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు పాల్గొంటారు.

28వ ‘ఎన్‌సీఈజీ 2025’లో పాల్గొనడానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు-కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, పరిశ్రమ రంగం, విద్యారంగం, అంకుర సంస్థలు, ప్రదర్శనలో పాల్గొనే వారు, పురస్కారాల విజేతలు, వక్తలు, ప్యానలిస్టులు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి nceg.gov.in పేరిట ఒక పోర్టల్‌ను డీఏఆర్‌పీజీ రూపొందించింది.

ఈ కార్యక్రమ సన్నాహక చర్యలలో భాగంగా బుధవారం (2025 ఏప్రిల్ 30న) డీఏఆర్‌పీజీ కార్యదర్శి శ్రీ వి. శ్రీనివాస్ అధ్యక్షతన ఒక వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సమావేశ స్వరూపం, వివిధ కార్యక్రమాలు, వాటికున్న ప్రాధాన్యం.. ఈ అంశాలపై పూర్తి వివరాలు  తెలియజేశారు. ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఐటీఈ-సీ విభాగ కార్యదర్శి, ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, నాస్‌కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంటు, ఐఐఎం విశాఖపట్నం తోపాటు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సన్నాహక చర్యలు ఏ దశలో ఉన్నదీ తెలిపే ఒక నివేదికను సమర్పించింది.
 

***


(Release ID: 2125735)
Read this release in: English , Urdu , Hindi , Tamil