ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
‘సుఫలాం 2025’:
• ప్రపంచానికి ఆహార పాత్రగా మారాలన్న భారత్ దార్శనికతను ప్రముఖంగా చాటిన సమావేశమిది
Posted On:
29 APR 2025 4:39PM by PIB Hyderabad
ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ‘సుఫలాం 2025’ (స్టార్టప్ ఫోరమ్ ఫర్ యాస్పైరింగ్ లీడర్స్-మెంటార్స్) పేరిట ఒక సమావేశాన్ని ఫుడ్ టెక్నాలజీ ఆంత్రప్రన్యోర్షిప్ మేనేజ్మెంట్ నేషనల్ ఇనిస్టిట్యూట్-కుండ్లీ (ఎన్ఐఎఫ్టీఈఎం..‘నిఫ్టెమ్’-కే) సహకారంతో నిర్వహించింది. ఈ సమావేశాన్ని ఈ నెల 25, 26వ తేదీల్లో నిఫ్టెమ్-కే ప్రాంగణంలో నిర్వహించారు.
యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఉత్సాహభరిత ప్రసంగాలతో ‘సుఫలాం 2025’ రెండో రోజు కార్యక్రమాలు మొదలయ్యాయి. వారు తమ ప్రేరణాత్మక ప్రస్థానాలను, తమ వినూత్న ఆలోచనలను శ్రోతలతో పంచుకున్నారు. దీని తరువాత, సాంకేతిక కార్యక్రమాలు చోటుచేసుకున్నాయి. వాటిలో తొలుత ‘‘అంకుర సంస్థలకు ప్రభుత్వ ఆర్థిక సహాయం- విధాన మద్దతు’’ అంశంపై స్టార్టప్ ఇండియా ప్రతినిధులు ప్రధాన ప్రసంగాన్నిచ్చారు. ఈ సందర్భంగా వారు అంకుర సంస్థలను పెంచి పోషించడానికి ఉద్దేశించిన ఆర్థిక సహాయపథకాలు, ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలకు సంబంధించిన విలువైన సమాచారాన్ని తెలియజేశారు. ఐఐఎం ముంబయి ప్రొఫెసరు డాక్టర్ టి. ప్రసాద్ ‘‘అంకుర సంస్థల జగతిలో నిలదొక్కుకోవడం’’ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమం ఎంతో ప్రేరణాత్మకంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో భాగంగా సవాళ్లకు ఎలా ఎదురొడ్డి నిలవాలి, ఆటుపోట్లను తట్టుకోవడమెలా?, ఔత్సాహిక పారిశ్రామికత్వ స్ఫూర్తిని పదిలపరచుకోవడం వంటి ముఖ్య అంశాలపై మార్గదర్శకత్వాన్ని అందజేశారు.
‘‘దీర్ఘకాలం పాటు మన్నిక కలిగి ఉండే ఆహార పదార్థాల తయారీ’’ అంశంపై హుషారైన బృంద చర్చను చేపట్టారు. ఈ కార్యక్రమం ఇప్పుడిప్పుడే తెర మీదకు వస్తున్న సుస్థిర సాంకేతికతలు, పర్యావరణానుకూల, బాధ్యతాయుత ఆహారోత్పత్తిపై దృష్టి పెడుతున్న ఉత్తమ పద్ధతులను పరిగణనలోకి తీసుకుంది. బృంద చర్చకు ముందు నెస్లే కార్పొరేట్ వ్యవహారాలు, సుస్థిరత విషయాల మాజీ డైరెక్టరు శ్రీ సంజయ్ ఖజూరియా కీలకోపన్యాసాన్నిచ్చారు.
తుది కార్యక్రమంలో, ఎంఓఎఫ్పీఐ కార్యదర్శి డాక్టర్ సుబ్రత గుప్త పథకాన్ని పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎంఎఫ్పీఈ) పథకం ఏయే ధ్యేయాలతో ఏర్పడిందీ, వాటిని ఎలా అమలుచేస్తోందీ విపులంగా వివరించారు. సూక్ష్మ వాణిజ్య సంస్థలకు మద్దతును ఇవ్వడానికి ప్రభుత్వం ఏయే కార్యక్రమాలను నిర్వహిస్తోందీ ఆయన ఈ సందర్భంగా ప్రధానంగా చెప్పారు.
అంతకు ముందు మొదటి రోజున, కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ చిరాగ్ పాసవాన్ విచ్చేసి రెండు రోజుల కార్యక్రమంతో పాటు ఒక ప్రదర్శనను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 23 రాష్ట్రాల నుంచి 500 మందికి పైగా తరలివచ్చారు. వారిలో పరిశ్రమ ప్రముఖులు, విద్యావేత్తలు, పెట్టుబడిదారులే కాకుండా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో 20 రాష్ట్రాలకు చెందిన 65 మంది ప్రదర్శకులు కూడా పాల్గొన్నారు. వారు భారత ఆహార శుద్ధి రంగంలోని విలక్షణ, ఘన వైవిధ్యాన్ని, నవకల్పనలను సందర్శకుల కళ్లెదుట నిలిపారు. సందర్శకుల హాజరుకు తోడు, ఈ కార్యక్రమాన్ని నిఫ్టెమ్-కేకు చెందిన యూ ట్యూబ్ చానల్లోనూ ప్రత్యక్షంగా ప్రసారం చేశారు. ఈ ప్రసారంలో 2,600 మందికి పైగా పాలుపంచుకోవడం ఈ కార్యక్రమ వ్యాప్తిని విస్తృతం చేయడం ఒక్కటే కాకుండా తనదైన ప్రభావాన్ని కూడా చూపింది.
‘సుఫలాం 2025’ విజయవంతంగా ముగిసింది అని నిఫ్టెమ్-కే డైరెక్టరు డాక్టర్ హరీందర్ం సింగ్ ఓబెరాయ్ అన్నారు. నవకల్పనకు ఉత్ప్రేరకంగా నిలవడం, భారత ఆహార శుద్ధి రంగంలో సహకారాన్ని, ఔత్సాహిక పారిశ్రామిక తత్వాన్ని ప్రోత్సహించడం, నాయకులతోపాటు మార్పును తీసుకురాదలుస్తున్న వ్యక్తులతో కూడిన కొత్త తరానికి సాధికారతను సమకూర్చడం వంటి విషయాల పట్ల ఎంఓఎఫ్పీఐ, నిఫ్టెమ్-కే .. ఈ రెండూ తమ నిబద్ధతను ఇక ముందూ కొనసాగిస్తాయని ఆయన పునరుద్ఘాటించారు.
డాక్టర్ కోమల్ చౌహాన్ బృందం అభివృద్ధిపరిచిన మిల్లెట్ న్యూట్రిబార్కు సంబంధించిన సాంకేతికతను హర్యానాలోని కర్నాల్కు చెందిన స్మిల్లెట్ సంస్థకు (M/s SMILLET) బదలాయించడం ఈ కార్యక్రమంలోని ముఖ్య సంఘటనల్లో ఒకటి. ఇదే విధంగా, మఖానాతో చేసే వంటకాలకు సంబంధించిన సాంకేతికతను డాక్టర్ ఆనంద్ కిశోర్ బృందం అభివృద్ధిపరిచింది. ఈ సాంకేతికతను బీహార్కు చెందిన పాటలీపుత్ర ఫుడ్స్కు బదలాయించారు. నిఫ్టెమ్-కే, ఫుడ్ ఇండస్ట్రీ కెపాసిటీ-స్కిల్ ఇనీషియేటివ్ (ఎఫ్ఐసీఎస్ఐ)లు ఒక అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యం ఆహార సంబంధిత సాంకేతికతలో సరికొత్త మార్పులను ఆవిష్కరించాలని, ఆహార రంగంలో నైపుణ్యాల అభివృద్ధితోపాటు నవకల్పనను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
‘సుఫలాం 2025’లో పాల్గొన్న ప్రతినిధులు ఒక మార్గదర్శి వెంట రాగా నిఫ్టెమ్-కే ప్రాంగణాన్ని చూశారు. ప్రతినిధులు ప్రయోగాత్మక కర్మాగారాన్ని, ప్రయోగశాల సదుపాయాలను కూడా సందర్శించారు. దీంతో వారు ఆహార శుద్ధికి సంబంధించిన పరిశోధన, నవకల్పనల గురించి అనేక అంశాలపై చక్కని అవగాహనను ఏర్పరచుకోగలిగారు.
***
(Release ID: 2125294)