ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
వినిమయ మూత్రపిండాల మార్పిడి: తొలిసారి ఫలప్రదంగా ముగించిన ఎయిమ్స్ రాయ్పుర్… ఈ సంక్లిష్ట, ప్రాణరక్షక ప్రక్రియను పూర్తి చేసిన నూతన ఎయిమ్స్ సంస్థల్లో ఇదే మొదటిది... ఈ ఖ్యాతిని సాధించిన ఛత్తీస్గఢ్ రాష్ట్ర తొలి వైద్య సంస్థ కూడా ఇదే
• ఈ మూత్ర పిండ మార్పిడితో ఈ తరహా శస్త్రచికిత్సల సంఖ్య 15 శాతం వరకు పెరగొచ్చని అంచనా
• మరణించిన వ్యక్తి శరీర అవయవ దానాన్ని, మృత దాత నుంచి మూత్ర పిండాన్ని మార్పిడి చేయడాన్ని మొదలుపెట్టిన కొత్త ఎయిమ్స్ సంస్థల్లో … తొలి ఆస్పత్రి ఎయిమ్స్ రాయ్పుర్….
చనిపోయిన వ్యక్తి మూత్ర పిండాన్ని అవసరమైన శిశువు శరీరంలోకి అమర్చడానికి రాష్ట్రంలో నాంది పలికిన తొలి ఆస్పత్రి- రాయ్పుర్ ఎయిమ్స్
• ఇంతవరకు, 54 సందర్భాల్లో మూత్ర పిండ మార్పిడులను నిర్వహించిన ఎయిమ్స్ రాయ్పుర్
కొత్తగా మూత్ర పిండాలను పొందిన రోగుల్లో 95 శాతం మంది జీవించి ఉన్నారు...
దానానంతరం రోగులు జీవించి ఉన్న సందర్భాలు 97 శాతం...
ఇది సంస్థకున్న రోగచికిత్సా ప్రావీణ్యానికీ, రోగికి అత్యత్తమ స్థాయి సంరక్షణ సేవల్ని అందించాలన్న నిబద్ధతకూ నిదర్శనం
Posted On:
24 APR 2025 9:39AM by PIB Hyderabad
రాయ్ పూర్ లోని ఎయిమ్స్ వైద్య విద్యా సంస్థ తొలిసారిగా వినిమయ విధానంలో (స్వాపింగ్) మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో ఫలప్రదంగా పూర్తి చేసింది. స్వాప్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ‘కిడ్నీ పెయిర్డ్ ట్రాన్స్ప్లాంట్’ (కేపీటీ)గా కూడా వ్యవహారంలో ఉంది. ఈ ఘనతను సాధించిన కొత్త ఎయిమ్స్ సంస్థల్లో మొదటిదిగాను, సంక్లిష్టమైన, ప్రాణాలను కాపాడే ప్రక్రియలో సఫలమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే మొదటి ప్రభుత్వ ఆసుపత్రిగాను ఎయిమ్స్ రాయ్పుర్ రికార్డు సృష్టించింది.
ఈ మూత్ర పిండ మార్పిడి సఫలం కావడంతో ఈ తరహా మార్పిడుల సంఖ్య 15 శాతం వరకు పెరగవచ్చని భావిస్తున్నారు. దీనిలో ఉన్న అవకాశాలను గుర్తిస్తూ, అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ స్వాప్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్ను ఆచరణలోకి తీసుకురావాల్సిందిగా నేషనల్ ఆర్గనైజేషన్ - టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ (ఎన్ఓటీటీఓ) సిఫారసు చేసింది. ఈ ఐచ్ఛికానికి వీలు కల్పించడం వల్ల దాతలు మరింత మంది ముందుకు వచ్చేందుకు ఆస్కారం ఉంది. దేశవ్యాప్తంగా ఈ తరహా ఆపరేషన్లకు ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో- యూనిఫాం వన్ నేషన్ స్వాప్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామును అమలుచేయాలని కూడా ఎన్ఓటీటీఓ నిర్ణయించింది.
స్వాప్ ట్రాన్స్ప్లాంట్ (మూత్ర పిండాల వినిమయం)లో మూత్ర పిండాలు పనిచేయడం మానేసిన రోగికి ఆ అవయవాన్ని దానం చేయడానికి ఎవరైనా సిద్ధపడి ముందుకు వచ్చినప్పటికీ- ఆ వ్యక్తి రక్తం గ్రూపుతో సరిపోలని రక్తం ఇవతలి వ్యక్తిది అయినప్పుడు, లేదా ఇవతలి వ్యక్తి దేహంలో హెచ్ఎల్ఏ రోగనిరోధక కణాలు ఆ శరీరావయవాన్ని తిరస్కరించే ప్రమాదం పొంచి ఉన్నప్పుడు- అవయవ వినిమయ - శస్త్రచికిత్సను ఆశ్రయించేందుకు అవకాశం ఉంటుంది. దీనికోసం స్వీకర్త తనకు దానంగా లభించిన అవయవాలను వేరే అవసరార్థులతో మార్పు చేసుకోవాలి. ఈ రకమైన సర్దుబాటు ద్వారా, స్వీకర్తలిద్దరూ తమ ఒంటికి సరిపడే కిడ్నీలను పొందగలుగుతారు. ఇలాంటి స్థితిలో రోగులు ఇరువురికీ వినిమయ విధాన శస్త్రచికిత్స విజయవంతంగా ముగుస్తుంది.
ఎయిమ్స్ రాయ్పుర్ చేజిక్కించుకొన్న ఈ చరిత్రాత్మక విజయాన్నిప్పుడు పరిశీలిద్దాం... బిలాస్పుర్ నివాసులైన 39 ఏళ్లు, 41 ఏళ్ల వయసున్న ఇద్దరు ఈఎస్ఆర్డీ పురుష రోగులు మూడు సంవత్సరాలుగా డైయాలిసిస్ (రక్తశుద్ధి) చేయించుకొంటున్నారు. ఇద్దరికీ మూత్ర పిండాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోగులకు మూత్ర పిండాలను దానం చేయడానికి వారివారి భార్యలు ముందుకు వచ్చారు. అయితే, బ్లడ్ గ్రూపులు వేర్వేరుగా ఉన్నాయి. అంటే ఒక జోడీ బ్లడ్ గ్రూపు బీ+, ఓ+ కాగా, రెండో జోడీ ఓ+, బీ+ బ్లడ్ గ్రూపు ఉన్న కారణంగా నేరుగా దానం చేయడానికి అవకాశం లేదు. ఈ సవాలును ఎయిమ్స్ రాయ్పుర్ వైద్య బృందం ఒక పరిష్కారాన్ని కనుగొన్నది. ప్రతి మహిళా దాత తన మూత్ర పిండాన్ని రెండో స్వీకర్తకు ఇచ్చారు. దీంతో బ్లడ్ గ్రూపుల మధ్య సమన్వయం సాధ్యం అయింది. ఇలా చేసినందువల్ల ఇద్దరు రోగులకూ ప్రాణరక్షణకు అవసరమైన అవయవాలను సేకరించడానికి మార్గం ఏర్పడింది. రోగుల శస్త్ర చికిత్సను ఈ ఏడాది మార్చి నెల 15న నిర్వహించారు. దీంతో నలుగురు వ్యక్తులు.. దాతలూ, స్వీకర్తలూ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ఆధునిక వైద్య సంరక్షణలో ఎయిమ్స్ రాయ్పుర్ తన సామర్థ్యాలను అంతకంతకు పెంచుకొంటోందని, చాలా కాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న రోగులకు వినూత్న పద్ధతుల్లో చికిత్స చేసి వారిని ఆరోగ్యవంతులుగా చేయాలన్న తన నిబద్ధతను చాటుకున్నది. అవయవ మార్పిడి చేసి వేరే వ్యక్తులకు అమర్చే బృందంలో ట్రాన్స్ ప్లాంట్ వైద్యుడు డాక్టర్ వినయ్ రాఠౌడ్, ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ అమిత్ ఆర్. శర్మ, డాక్టర్ దీపక్ బిస్వాల్, డాక్టర్ సత్యదేవ్ శర్మ, ఎనస్తీషియా డాక్టర్లు జితేంద్ర, సరిత రాంచందానీలే కాకుండా ట్రాన్స్ప్లాంట్ సమన్వయ బృంద సభ్యులు, ఓటీతో పాటు ట్రాన్స్ప్లాంట్ నర్సింగ్ సిబ్బంది కూడా సభ్యులుగా ఉన్నారు.
ఛత్తీస్గఢ్లో ఒకరి శరీర అవయవాలను మరొకరికి అమర్చే వైద్య విధానాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఎయిమ్స్ రాయ్పుర్ కీలక పాత్రను పోషించింది. మూత్ర పిండాలను వేరొకరికి అమర్చే విషయంలో ఈ సంస్థ ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా అభివృద్ధిపరచగలిగింది. దీనిలో జీవించి ఉన్న దాత, చనిపోయిన దాత.. ఇలాగ రెండు విధాలైన దాతల శరీర భాగాలను ట్రాన్స్ ప్లాంట్ చేసే ప్రక్రియలు ఉన్నాయి. కనుమూసిన ఆరుగురు దాతలు తమ అవయవాలను గత రెండేళ్ల వ్యవధిలో అవయవదానం చేయడానికి నిశ్చయించుకున్నారు.
చనిపోయిన వ్యక్తి శరీరంలోని అవయవాలను దానంగా ఇచ్చిన, మృత వ్యక్తి మూత్ర పిండాన్ని అవసరమైన మరో మనిషికి అమర్చిన కొత్త ‘ఎయిమ్స్’ ఆస్పత్రుల్లో- ఎయిమ్స్ రాయ్పుర్ మొదటిది. విగతజీవుడైన దాతకు చెందిన మూత్ర పిండాన్ని శిశువుకు అమర్చే ప్రక్రియను మొదలుపెట్టిన రాష్ట్ర మొట్టమొదటి ఎయిమ్స్ కూడా ఇదే. ఇంత వరకు, ఈ సంస్థ 54 మూత్ర పిండాలను వేరే వ్యక్తులకు అమర్చింది. వీటిని పొందిన రోగుల్లో 95 శాతం మంది ప్రస్తుతం జీవించి ఉన్నారు. అలాగే, అవయవ దానం చేసిన తరువాత కూడా రోగులు జీవించి ఉన్న సందర్భాలు 97 శాతంగా లెక్కతేలింది. ఈ గణాంకాలు ఈ సంస్థ కున్న రోగచికిత్స సంబంధిత ప్రావీణ్యాన్ని, రోగికి అత్యత్తమ స్థాయి సంరక్షణ సేవల్ని అందించాలన్న సంస్థ నిబద్ధతను తెలియజేస్తున్నాయి.
***
(Release ID: 2124033)
Visitor Counter : 10