బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు గని కార్మికులే నిజమైన ఇంధన యోధులు: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి
· ప్రపంచంలోనే రెండో అతి పెద్ద బొగ్గు గని గెవ్రాలో మైనింగ్ కార్యకలాపాలను పరిశీలించిన మంత్రి
· గని కార్మికులు, మహిళా కార్మికులకు సత్కారం: వారితో కలిసి భోజనం చేసి, సెల్ఫీలు దిగిన మంత్రి
Posted On:
10 APR 2025 7:36PM by PIB Hyderabad
ఛత్తీస్గఢ్లోని సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఈసీఎల్)కు చెందిన గెవ్రా గనులను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఈ రోజు సందర్శించారు. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద బొగ్గు గనిగా పేరు గాంచిన గెవ్రా, వృద్ధి చెందుతున్న భారత ఇంధన శక్తికి చిహ్నంగా నిలుస్తుంది. క్షేత్రస్థాయిలో పని చేసే కార్మికుల పట్ల, బొగ్గు రంగంలో ఉత్పాదకత, సంక్షేమాన్ని మెరుగుపరచడంలో ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని మంత్రి పర్యటన తెలియజేస్తోంది.
గెవ్రా హౌస్ వద్ద సీఐఎస్ఎఫ్ బలగాల గౌరవ వందనాన్ని కేంద్రమంత్రి స్వీకరించారు. గని వ్యూ పాయింట్ వద్ద ఎస్ఈసీఎల్ సాధించిన విజయాలు, కొనసాగుతున్న అభివృద్ధి పనుల గురించి మంత్రికి అధికారులు వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు. దేశ ఇంధన వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన బొగ్గు రంగంలో నిరంతరాయంగా సేవలు అందించేందుకు అంకితభావంతో పనిచేస్తున్న మహిళా కార్మికులతో సహా గని కార్మికులను శ్రీ కిషన్ రెడ్డి సత్కరించారు.
గని లోపలికి వెళ్లిన మంత్రి, అక్కడ భారీ స్థాయిలో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలను పరిశీలించారు. అంతర్జాతీయంగా వినియోగించే హెవీ ఎర్త్ మూవింగ్ మెషీన్ (హెచ్ఈఎంఎం)లైన తవ్వకానికి వినియోగించే 42 క్యూబిక్ మీటర్ల యంత్రం, 240 టన్నుల డంపర్ లాంటి భారీ యంత్రాల పనితీరును పరిశీలించారు. అలాగే పేలుడు రహిత ఉపరితల మైనింగ్ సాంకేతికత వినియోగాన్ని సమీక్షించారు. సుస్థిరమైన, పర్యావరణ హిత బొగ్గు తరలింపే లక్ష్యంగా, ఫస్ట్ మైల్ కనెక్టివిటీ (ఎఫ్ఎంసీ) కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన ఆధునిక బొగ్గు నిల్వ వ్యవస్థ (సైలో)లను సందర్శించారు.
మెషిన్ ఆపరేటర్లతో వారి క్యాబిన్లలో ముచ్చటించిన శ్రీ కిషర్ రెడ్డి, బొగ్గు ఉత్పత్తిలో వారు అందిస్తున్న ప్రధాన సహకారాన్ని ప్రశంసించారు. ఈ చర్య ఆపరేటర్లలో స్థైర్యాన్ని నింపింది. క్యాంటీన్లో కార్మికులతో కలసి భోజనం చేసిన మంత్రి, వారితో సెల్ఫీలు దిగారు. ఇది కార్మికులను ఆకట్టుకుంది.
ఈ పర్యటనలో భాగంగా ఎస్ఈసీఎల్ అమలు చేస్తున్న హరిత కార్యక్రమాలను సైతం పరిశీలించారు. జపాన్ అటవీకరణ పద్ధతి మియావాకీ ఉపయోగించి ప్రయోగాత్మక పద్ధతిలో చెట్లను పెంచుతున్న స్థలాన్ని సందర్శించారు. అలాగే ఉద్యోగులకు సంబంధించిన కార్యక్రమాలు, సామాజిక సమావేశాలు తదితరమైనవి నిర్వహించడానికి వీలుగా నిర్మించిన కల్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి దేశాభివృద్ధిలో బొగ్గు పోషిస్తున్న కీలక పాత్ర గురించి వివరించారు. దేశంలో విద్యుదుత్పత్తి 70 శాతం కంటే ఎక్కువే బొగ్గుపై ఆధారపడి ఉందని వెల్లడించారు. సుస్థిరతతో కూడిన సమతౌల్యాభివృద్ధి, బాధ్యతాయుతమైన గనుల మూసివేత పద్ధతులను వేగవంతం చేయడం, పర్యావరణ ప్రమాణాలను నిరంతరం మెరుగుపరచాల్సిన అవసరాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. గెవ్రా దేశానికే గర్వకారణమన్న ఆయన.. ‘‘ఆహారం కోసం ఎవరూ ఎదురుచూడకూడదు. విద్యుత్ సరఫరా ఆలస్యం కాకూడదు. దేశం ప్రకాశవంతంగా, శక్తిమంతంగా ఉండేలా గని కార్మికులు భరోసా ఇస్తున్నారు’’ అని తెలిపారు.
***
(Release ID: 2120922)