జౌళి మంత్రిత్వ శాఖ
ఎంఎస్పీలో భాగంగా తన నోడల్ ఏజెన్సీ ద్వారా 100 లక్షల బేళ్ల పత్తిని కొనుగోలు చేసిన భారత ప్రభుత్వం
• ఈ ఏడాది మార్చి నెల 31 వరకూ ఎంఎస్పీ భాగంగా మొత్తం పత్తిలో 38 శాతం సరకు కొనుగోలు
• పత్తి రైతులకు చెల్లించింది రూ.37,450 కోట్లు
• 40 లక్షల బేళ్లతో తెలంగాణ ప్రథమ స్థానం. మహారాష్ట్ర 30 లక్షల బేళ్లు, గుజరాత్ 14.02 లక్షల బేళ్లు
• పని చేస్తున్న 508 కొనుగోలు కేంద్రాలు
• ‘ఆధార్’ ఆధారంగా చెల్లింపులు... కాట్-ఏలై మొబైల్ యాప్ ద్వారా పర్యవేక్షణ
Posted On:
08 APR 2025 3:27PM by PIB Hyderabad
ప్రస్తుత పత్తి సీజను 2024-25లో, ఈ ఏడాది మార్చి నెల 31 వరకు చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం జౌళి శాఖ ఆధీనంలోని తన నోడల్ ఏజెన్సీ- కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా 525 లక్షల క్వింటాళ్ల సీడ్ కాటన్ కొనుగోళ్లను కనీస మద్దతు ధర (మినిమం సపోర్ట్ ప్రైస్.. ఎంఎస్పీ) ప్రకారం పూర్తి చేసింది. ఇది 100 లక్షల బేళ్లకు సమానం. ఈ కొనుగోళ్లు మార్కెటుకు వచ్చిన మొత్తం పత్తి సరకులో 38 శాతం. అంతేకాదు, దేశంలో మొత్తం 294.25 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి చేసినట్లు తేల్చిన అంచనాలో ఇది 34 శాతంగా ఉంది.
రాష్ట్రాల వారీగా చూస్తే, తెలంగాణలో 40 లక్షల బేళ్ల మేర అత్యధిక స్థాయిలో కొనుగోళ్లు నమోదయ్యాయి. 30 లక్షల బేళ్లతో మహారాష్ట్ర, 14 లక్షల బేళ్లతో గుజరాత్ తరువాతి స్థానాలలో ఉన్నాయి. చెప్పుకోదగ్గ స్థాయిలో కొనుగోళ్లు సాగిన ఇతర రాష్ట్రాల్లో కర్నాటక (5 లక్షల బేళ్లు), మధ్య ప్రదేశ్ (4 లక్షల బేళ్లు), ఆంధ్రప్రదేశ్ (4 లక్షల బేళ్లు), ఒడిశా (2 లక్షల బేళ్లు) ఉన్నాయి. హర్యానా, రాజస్థాన్, పంజాబ్లలో 1.15 లక్షల బేళ్ల పత్తి కొనుగోళ్లు నమోదయ్యాయి. మొత్తంమీద, పత్తిని పండిస్తున్న రాష్ట్రాల్లో దాదాపు 21 లక్షల మంది పత్తి రైతులకు రూ.37,450 కోట్లను చెల్లించారు.
ఎంఎస్పీ విధానం పత్తి రైతులకు లాభదాయక ధరలను సమకూరుస్తూ, మార్కెట్లో ధరలు ఎంఎస్పీ కన్నా కిందకు పడిపోయినప్పుడు వారు సరకును తెగనమ్ముకోకుండా కాపాడుతుంది. సమర్థమైన రీతిలో కొనుగోళ్లు జరిగేలా చూడడానికి, సీసీఐ దేశవ్యాప్తంగా 508 కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తోంది. అక్కడికక్కడ ‘ఆధార్’ను రూఢిపరచుకోవడం, చెల్లింపులకు సంబంధిచిన ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ల జారీతోపాటు నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్ఏసీహెచ్) ద్వారా 100 శాతం నేరుగా చెల్లింపులు పూర్తి చేయడం వంటి అనేక డిజిటల్ సౌలభ్యాలను అమలులోకి తీసుకువచ్చారు. కాట్-ఏలై (Cott-Ally)... ఈ పేరుతో ఓ మొబైల్ యాప్ను తొమ్మిది ప్రాంతీయ భాషలలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది రైతులు ఎంఎస్పీ రేట్లు, కొనుగోలు కేంద్రాలు, చెల్లింపుల ప్రక్రియ... వీటికి సంబంధించిన సమాచారాన్ని వాస్తవ-కాల ప్రాతిపదికన (రియల్-టైమ్) తెలుసుకొనేందుకు తోడ్పడుతుంది. దీనికి అదనంగా, పారదర్శకతకూ, జవాబుదారుతనానికీ పెద్దపీట వేయడానికిగాను బ్లాక్-చైన్ టెక్నాలజీని ఉపయోగించుకొంటూ, సీసీఐ ఉత్పత్తి చేసిన పత్తి బేళ్లన్నిటినీ క్యూఆర్ (QR) కోడ్ల సాయంతో ట్రాక్ చేయడానికి కూడా వీలవుతుంది.
నిష్పక్షపాత, పారదర్శక, సమర్థ కొనుగోలు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తూ పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడడానికి కట్టుబడి ఉంది.
***
(Release ID: 2120235)