రక్షణ మంత్రిత్వ శాఖ
ఆపరేషన్ బ్రహ్మ- మయన్మార్ భూకంప బాధితులకు వైద్య సహాయం అందించేందుకు కదిలిన భారత సైన్యం
Posted On:
29 MAR 2025 7:16PM by PIB Hyderabad
మయన్మార్లో 2025 మార్చి 28న సంభవించిన పెను భూకంపం కారణంగా జరిగిన తీవ్ర నష్టానికి తక్షణ స్పందనగా, భారత సైన్యం ‘ఆపరేషన్ బ్రహ్మ’ కింద అత్యవసర మానవతా సహాయాన్ని అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని పంపిస్తోంది.
లెఫ్టినెంట్ కల్నల్ జగ్నీత్ గిల్ నేతృత్వంలో పేరొందిన శత్రుజీత్ బ్రిగేడ్ మెడికల్ రెస్పాండర్స్ కు చెందిన 118 మంది సభ్యుల బృందం అత్యవసర వైద్య పరికరాలు, ఔషధాలతో త్వరలోనే మయన్మార్కు బయలుదేరనుంది. ఈ వైమానిక ఏంజెల్స్ టాస్క్ ఫోర్స్- విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో ఆధునిక వైద్య, శస్త్రచికిత్స సేవలను అందించేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొంది పూర్తి సన్నద్ధతతో ఉంటుంది.
ఈ ఆపరేషన్లో భాగంగా, భారత సైన్యం 60 పడకలతో కూడిన వైద్య చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. భూకంపంలో గాయపడిన వారికి ఇందులో అత్యవసర చికిత్స అందిస్తారు. ఈ కేంద్రం ట్రామా కేసులతో పాటు అత్యవసర శస్త్రచికిత్సలు, ప్రాథమిక వైద్య సేవలను అందించేందుకు పూర్తి సన్నద్ధంగా ఉంటుంది. భూకంపం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న స్థానిక ఆరోగ్య సేవా వ్యవస్థకు ఇది గట్టి సహాయకారిగా ఉంటుంది.
ఈ మానవతా సహాయం 'పొరుగువారికి ప్రాధాన్యం‘ అనే విధానం పట్ల భారత్ నిబద్ధతను, ‘వసుధైక కుటుంబం’ అనే భారతీయ మౌలిక సిద్దాంతాన్ని ప్రతిబింబిస్తుంది. సంక్షోభ సమయాల్లో భారత సైన్యం మిత్రదేశాలతో భుజం భుజం కలిపి నిలబడుతూనే ఉంది. ఇది ఈ ప్రాంతంలో మొదటి ప్రతిస్పందన దేశంగా ఉండాలనే భారత్ సంకల్పాన్ని కూడా ప్రదర్శిస్తోంది.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్వయంతో, మయన్మార్ అధికారుల భాగస్వామ్యంతో ఈ ‘ఆపరేషన్ బ్రహ్మ‘ ను అమలు చేస్తున్నారు.
***
(Release ID: 2116815)
Visitor Counter : 30