బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు కొనుగోళ్లపై విద్యుత్తు ప్లాంట్లకు వర్తిస్తున్న ఆంక్షల్ని తొలగించడం
Posted On:
24 MAR 2025 1:03PM by PIB Hyderabad
థర్మల్ విద్యుత్ సంస్థలకు బొగ్గు సరఫరా ఇది వరకు కొత్త బొగ్గు పంపిణీ విధానం-2007 (ఎన్సీడీపీ) అధీనంలో ఉండింది. విద్యుత్తు రంగానికి ఎన్సీడీపీ పరిధిలోని బొగ్గు ఒప్పంద నియమాలను శక్తి విధానం-2017తో మార్పు చేశారు. ఈ విధానాల ప్రకారం బొగ్గును బొగ్గు కంపెనీలు, విద్యుత్తు ప్లాంట్ల మధ్య కుదిరే ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్ఎస్ఏ)లోని వాణిజ్యపరమైన షరతులు, నిబంధనల మేరకు సరఫరా చేస్తున్నారు.
విద్యుత్తు రంగంలోని ప్రస్తుత ఒప్పందదారుల పూర్తి స్థాయి విద్యుత్తు కొనుగోలు ఒప్పందం (పవర్ పర్చేజ్ అగ్రిమెంట్.. ‘పీపీఏ’) పరిధిలోని అవసరాలన్నింటినీ తీర్చగలిగేలాగా బొగ్గును వార్షిక ప్రాతిపదికన ఒప్పందం కుదుర్చుకున్న పరిమాణం (వార్షిక పరిమాణం-ఏసీక్యూ) స్థాయి మేరకు బొగ్గు కంపెనీలు సరఫరా చేయాలని ప్రభుత్వం 2022లో నిర్ణయించింది. ఇంధన సరఫరా ఒప్పందానికి మించి బొగ్గు సరఫరా కావడమనేది విద్యుత్తు ప్లాంట్ల అవసరాలకు అనుగుణంగా బొగ్గు సరఫరాకు బాట వేసింది. దీనికి తోడు, సింగిల్ విండో ఎలక్ట్రానిక్ వేలం పాట పద్ధతిలో కూడా బొగ్గు కంపెనీలు బొగ్గును విక్రయిస్తున్నాయి. ఈ ఈ-వేలం పద్ధతిలో విద్యుత్తు రంగం సహా అన్ని రంగాల అవసరాలూ నెరవేరుతున్నాయి.
ఎఫ్ఎస్ఏ పరిధిలో బొగ్గు సరఫరా విషయానికి వస్తే, వాణిజ్య నిబంధనలు, ఎఫ్ఎస్ఏ షరతులు, కోల్ ఇండియా లేదా సింగరేణి కాలరీస్ కంపెనీ ఎప్పటికప్పుడు జారీ చేసే నోటిఫికేషన్లకు అనుగుణంగా బొగ్గుకు ధరలను ఖరారు చేస్తూ ఉంటారు.
దేశీయంగా బొగ్గు చాలినంతగా అందుబాటులో ఉండేటట్లు చూడడానికి స్వదేశీ బొగ్గు ఉత్పత్తిని పెంచడంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. దేశంలో 2023-24లో ఇంతవరకు ఎన్నడూ లేనంతగా బొగ్గు ఉత్పత్తి నమోదైంది. 2023-24లో అఖిల భారత స్థాయి బొగ్గు ఉత్పత్తి 997.826 మిలియన్ టన్నులు (ఎంటీ)గా ఉంది. ప్రస్తుత సంవత్సరం 2024-25లో, భారత్ 929.15 ఎంటీ బొగ్గును ఈ ఏడాదిలో ఫిబ్రవరి వరకు ఉత్పత్తి చేసింది. ఇది తాత్కాలిక అంచనా. 2023-24లో ఇదే కాలంలో బొగ్గు ఉత్పత్తి స్థాయి 881.16 ఎంటీతో పోల్చి చూస్తే వృద్ధి రేటు 5.45 శాతంగా ఉంది.
సరిపోయినంత స్థాయిలో బొగ్గు లభ్యం అవుతూ ఉండేటట్లు చూడడానికి, దేశంలో బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఈ కింది విధంగా ఉన్నాయి:
i. బొగ్గు బ్లాకుల అభివృద్ధిని వేగవంతం చేయడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ క్రమానుగతంగా సమీక్షలను చేపడుతోంది.
ii. గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ చట్టం-2021 (ఎంఎండీఆర్ యాక్టు)ను అమలులోకి తీసుకురావడం, దీంతో సొంత గనుల యాజమాన్య సంస్థలకు (అణుధార్మిక ఖనిజాలు మినహా) వాటి వార్షిక ఖనిజ (బొగ్గు సహా) ఉత్పాదనలో 50 శాతం దాకా బహిరంగ మార్కెట్లో అమ్మే విధంగా వెసులుబాటును కల్పించారు. అయితే అవి గనుల తవ్వకంతో అంత్యదశలోని ప్లాంటు ఆవశ్యకతను నెరవేర్చాల్సి ఉంటుంది. అంతేకాక, కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన తరహాలో నిర్ధారిత పద్ధతిలో అదనపు సొమ్మును కూడా చెల్లించాల్సి ఉంటుంది.
iii. బొగ్గు గనుల నిర్వహణ వేగాన్ని పెంచేందుకు బొగ్గు రంగానికంటూ ఓ ఏక గవాక్ష అనుమతుల పోర్టల్ను తీసుకువచ్చారు.
iv. బొగ్గు బ్లాకులను పొందిన సంస్థలు గనుల తవ్వకం కార్యకలాపాలను త్వరగా మొదలుపెట్టడానికి వీలుగా అవి వేర్వేరు ఆమోదాలను, క్లియరెన్సులను పొందడంలో సహకరించడానికి ప్రాజెక్టు పర్యవేక్షక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు.
v. ఆదాయాన్ని పంచుకొనే ప్రాతిపదికన వాణిజ్య సరళిలో గనుల తవ్వకం సంబంధిత కార్యకలాపాలకు వేలంపాటల విధానాన్ని 2020లో మొదలుపెట్టారు. వాణిజ్య సరళి గనుల తవ్వకం పథకంలో భాగంగా, ఉత్పత్తికై నిర్ధరించిన తేదీ కన్నా ముందే ఉత్పత్తి చేసిన బొగ్గు పరిమాణంపై 50 శాతం రిబేటు (తగ్గింపు)ను అనుమతించారు. దీనికి అదనంగా కోల్ గ్యాసిఫికేషన్, లిక్విఫాక్షన్ ప్రక్రియలకు ప్రోత్సాహకాలను (50 శాతం రిబేటు) ఇచ్చారు.
vi. వాణిజ్య సరళిలో బొగ్గు గనుల తవ్వకం షరతులను, నిబంధనలను సరళతరం చేశారు. వీటిలో బొగ్గు ఉపయోగంపై ఎలాంటి ఆంక్షలు లేవు. కొత్త కంపెనీలను కూడా వేలం ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతిస్తున్నారు. ఇందులో ముందుగా చెల్లించాల్సిన డబ్బు కూడా తక్కువే. నెలవారీ చెల్లింపునకు భిన్నంగా ముందస్తుగా చెల్లించే డబ్బును సర్దుబాటు పద్ధతిలో చెల్లించడానికి సైతం ఆస్కారముంది. బొగ్గు గనుల తవ్వకాల్ని త్వరగా ప్రారంభించేందుకు సరళమైన కొలమానాలను నిర్దేశించారు. వేలం ప్రక్రియలో పారదర్శకత్వాన్ని ప్రవేశపెట్టారు. ఆటోమేటిక్ రూట్లో 100 శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడి (ఎఫ్డీఐ), నేషనల్ కోల్ ఇండెక్స్ను ఆధారంగా చేసుకొని ఆదాయాన్ని పంచుకొనే నమూనాను తీసుకువచ్చారు.
పైన పేర్కొన్న వాటికి అదనంగా, బొగ్గు కంపెనీలు దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి ఈ కింద పేర్కొన్న చర్యలను కూడా తీసుకున్నాయి:
i. బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి కోల్ ఇండియా (సీఐఎల్) అనేక చర్యలను చేపట్టింది. సీఐఎల్ తన భూగర్భ గనులలో సీఐఎల్ మాస్ ప్రొడక్షన్ టెక్నాలజీలను (ఎంపీటీ)ని అనుసరించింది. అందులోనూ సాధ్యమైన చోట ప్రధానంగా కంటిన్యువస్ మైనర్స్ (సీఎంఎస్)ను అవలంబించింది. వదిలిపెట్టిన, నిలిపివేసిన గనులను దృష్టిలో పెట్టుకొని హైవాల్స్ (హెచ్డబ్ల్యూ) గనులను కూడా నిర్వహించాలని సీఐఎల్ భావిస్తోంది. అవకాశం ఉన్న చోట్ల భారీ సామర్థ్యంతో ఉండే భూగర్భ గనులను ప్రారంభించాలని కూడా సీఐఎల్ యోచిస్తోంది. సీఐఎల్ తన ఓపెన్కాస్ట్ (ఓసీ) గనులలో, ఇప్పటికే అధిక సామర్థ్యం కలిగిన తవ్వకం యంత్రాలు (ఎక్స్కవేటర్లు), డంపర్లు, సర్ఫేస్ మైనర్ల రూపంలో అత్యధునాతన సాంకేతికతను అనుసరిస్తోంది.
ii. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల నిర్వహణతోపాటు కొత్త ప్రాజెక్టులను చేపట్టడం కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ (ఎస్సీసీఎల్) క్రమ పద్ధతిలో అనుసంధానాన్ని చేపడుతోంది. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లు (సీహెచ్పీలు), క్రషర్లు, మొబైల్ క్రషర్లు, ప్రి-వే-బిన్స్ వంటి వాటిలో నుంచి బొగ్గును తీసేయడానికి కావలసిన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ఎస్సీసీఎల్ తగిన చర్యలను తీసుకుంటున్నది.
ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 2114437)
Visitor Counter : 50