బొగ్గు మంత్రిత్వ శాఖ
శుద్ధి చేసిన గనుల నీటి సురక్షిత వినియోగం
Posted On:
10 MAR 2025 3:45PM by PIB Hyderabad
గనులలో నుంచి ఊటగా వచ్చే, లేదా గనులలో మినరల్ శుద్ధి కోసం వినియోగించే నీటిని తాగడానికీ, సేద్యానికీ, పారిశ్రామిక ప్రయోజనాలకూ పునర్వినియోగాన్ని బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తోంది. ఈ విషయంలో సంబంధిత పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ మార్గదర్శకాలను పాటిస్తోంది. దీని కోసం బొగ్గు శాఖ తన పరిధిలోని బొగ్గు, లిగ్నైటు ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)ల సాయం తీసుకొంటోంది. ఈ పీఎస్యూలలో కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్సీఐఎల్)లతోపాటు సింగరేణి కాలరీస్ (ఎస్సీసీఎల్) ఉన్నాయి. శుద్ధిపరిచిన గనినీటిని లాభసాటిగా ఎలా వినియోగించుకోవాలో పర్యావరణ పరిరక్షణ చట్టం- 1986, జల (నివారణ, కాలుష్య నియంత్రణ) చట్టం- 1974లలో ఉల్లేఖించిన నిబంధనలతోపాటు కేంద్రీయ కాలుష్య నివారణ మండలి (సీపీసీబీ), ఇంకా ఆయా రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లు (ఎస్పీసీబీ) జారీ చేసిన ఉత్తర్వులు సూచిస్తున్నాయి. దీనికి అదనంగా, శుద్ధి చేసిన అనంతరం గని నీటిని వేర్వేరు ప్రయోజనాలకు సురక్షితంగా, సమర్థంగా వినియోగించుకోవడానికి బొగ్గు పీఎస్యూలు, లిగ్నైటు పీఎస్యూలు తమ సొంత ప్రామాణిక ఆచరణాత్మక నిర్వహణ ప్రణాళిక (ఎస్ఓపీ) లను కూడా రూపొందించుకున్నాయి.
తాగునీరుగా వాడుకోవడానికి గని నీళ్లను శుద్ధి చేసి ఆ తరువాత సరఫరా చేసేటప్పుడు ఆరోగ్య సంబంధి ప్రమాణాలకూ, సురక్ష సంబంధ ప్రమాణాలకూ తులతూగేటట్లు వివిధ నాణ్యత నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. ఈ గని నీళ్లకు భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్ ఐఎస్ 10500:2012), కేంద్రీయ భూగర్భ జల ప్రాధికార సంస్థ (సీజీడబ్ల్యూఏ)లు నిర్దేశించిన ప్రమాణాలు, ఇతర ప్రమాణాల ప్రకారం ఆధికారిక గుర్తింపు ఉన్న ప్రయోగశాలలు నిర్ణీత కాలంలో పరీక్షలను నిర్వహిస్తున్నాయి. సెడిమెంటేషన్, వడగట్టడం, రోగ క్రిముల నిర్మూలన వంటి శుద్ధి ప్రక్రియలను అవసరమైన మేరకు పూర్తి చేసిన తరువాతనే నీటిని సరఫరా చేస్తున్నారు.
గని నీళ్లు నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాలను ఝార్ఖండ్ సహా అన్ని బొగ్గు గనుల తవ్వకాలతోపాటు, లిగ్నైట్ గని తవ్వకాలు జరుగుతున్న అన్ని రాష్ట్రాలలోనూ చేపట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. గని నీళ్లను ప్రజోపయోగానికి, సేద్యానికీ, పరిశ్రమలకూ- లాభదాయకంగా వాడుకోవడానికీ అవసరమైన ప్రాజెక్టులను బొగ్గు రంగ పీఎస్యూలు, లిగ్నైటు పీఎస్యూలు అమలు చేస్తున్నాయి. గనినీళ్లను సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్), భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్)లతోపాటు ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్)లకు చెందిన ఆయకట్టుల మధ్య ఉన్న పల్లెల్లో ఉపయోగించుకోవడానికి కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)కూ, ఝార్ఖండ్ ప్రభుత్వానికీ మధ్య ఒక అవగాహన ఒప్పందం పత్రం (ఎంఓయూ)పై సంతకాలయ్యాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఈ రోజు రాజ్య సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 2109928)
Visitor Counter : 12