సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
పార్లమెంటులో ప్రశ్న: ప్రభుత్వ రంగం, ప్రభుత్వ రంగ సంస్థల్లో నూతన ఉద్యోగావకాశాలు
Posted On:
13 FEB 2025 3:51PM by PIB Hyderabad
ఉపాధి కల్పనతో పాటు ఉద్యోగ సామర్థ్యాన్ని మెరుగుపరిచడమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత. దీని ప్రకారం దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు భారత ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది.
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం, ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ), మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్), పండిట్ దీన దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూ - జీకేవై), దీనదయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం (డీఏవై - ఎన్ఆర్ఎల్ఎం), దీన్దయాల్ అంత్యోదయ యోజన – జాతీయ పట్టణ జీవనోపాధి కార్యక్రమం (డీఏవై - ఎన్యూఎల్ఎం), మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా, పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర నిధి (పీఎం-స్వనిధి) పథకం, ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై), తదితర పథకాల్లో ఉపాధి కల్పనకు గణనీయమైన పెట్టుబడులు పెడుతోంది. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, జలమార్గాలు తదితరమైన మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన రంగాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచుతుంది.
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కెరీర్కు సంబంధించిన సేవలను నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. www.ncs.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్, ఆఫ్లైన్ జాబ్ ఫెయిర్లకు సంబంధించిన సమాచారం, ఉద్యోగ శోధన, అభిరుచికి అనుగుణంగా కెరీర్ కౌన్సిలింగ్, వృత్తిపరంగా మార్గనిర్దేశం, నైపుణ్యాభివృద్ధి కోర్సుల గురించి సమాచారం, నైపుణ్యం/శిక్షణా కార్యక్రమాల గురించి తెలుసుకోవచ్చు. ఐదేళ్ల కాల వ్యవధికి రూ. 2 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 4.1 కోట్ల యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ, ఇతర అవకాశాల కోసం ఐదు పథకాలు, కార్యక్రమాలను 2024-2025 కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. పర్యాటకం, తయారీ, మత్స్య తదితర రంగాల్లో బహుళ ఉపాధి అవకాశాలను సృష్టించడం కూడా ఈ కేంద్ర బడ్జెట్ లక్ష్యం, అలాగే యువతలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించడానికి, నైపుణ్యాలను పెంపొందించడానికి చేపట్టాల్సిన వివిధ చర్యలు సైతం దీనిలో ఉన్నాయి.
వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడం నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న రోజ్గార్ మేళా ద్వారా త్వరితగతిన ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీయూ)లు/ స్వయంప్రతిపత్తి సంస్థలు/ విద్య, ఆరోగ్యసంస్థలు తదితరమైన వాటిలో నిర్ణీత కాలపరిమితిలో మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 45-50 నగరాల్లో కేంద్ర స్థాయిలో 14 రోజ్గార్ మేళాలు జరిగాయి. ఈ రోజ్ గార్ మేళాల్లో పాల్గొన్న లక్షల మందికి మంత్రిత్వ శాఖలు/విభాగాలు నియామక పత్రాలు అందజేశాయి.
సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పించన్లు శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని లిఖితపూర్వకంగా అందించారు.
****
(Release ID: 2102825)
Visitor Counter : 37