కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
టెలికాం సంబంధిత మోసాలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలు
Posted On:
06 FEB 2025 3:12PM by PIB Hyderabad
టెలికాం వనరులను ఉపయోగించుకొంటూ సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలకు పాల్పడడాన్ని నివారించడానికీ, పౌరుల ప్రయోజనాలను కాపాడడానికీ ఈ కింద ప్రస్తావించిన చర్యల్ని టెలికమ్యూనికేషన్ల విభాగం (డీఓటీ) చేపట్టింది:
i. నకిలీ దస్తావేజులతో, కల్పిత దస్తావేజులతో దక్కించుకొన్న అనుమానాస్పద మొబైల్ కనెక్షన్లను గుర్తించడానికి ఒక వ్యవస్థను రూపొందించడంతోపాటు పునఃపరిశీలన చేయాల్సిందిగా టెలికాం సేవల ప్రదాత సంస్థల (టీఎస్పీస్)కు ఆదేశాలిచ్చారు.
ii. మొబైల్ వినియోగదారులకు సాధికారతను కల్పించడంతోపాటు, వారికి భద్రతను కల్పించడానికీ, అవగాహనను పెంపొందించడానికి పౌర సేవా ప్రధాన కార్యక్రమం ‘సంచార్ సాథీ’ (Sanchar Saathi)ని తీసుకువచ్చారు. దీనిని https://sancharsaathi.gov.in వెబ్ పోర్టల్ రూపంలోనూ, మొబైల్ యాప్ రూపంలోనూ అందుబాటులో ఉంచారు. సంచార్ సాథీ ఇతర విషయాలతో పాటు ఈ కింది సౌకర్యాలను పౌరులకు అందిస్తుంది:
ఎ. మోసం అనే అనుమానం వచ్చిన, ఇబ్బంది పెట్టే వాణిజ్య ప్రధానమైన కాల్స్ను గురించి ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది.
బి. మీ పేరుతో జారీ అయిన మొబైల్ కనెక్షన్ల విషయంలో సమాచారాన్ని తెలుసుకోండి. అక్కర్లేని మొబైల్ కనెక్షన్లను గురించి, లేదా వారికి చెందని మొబైల్ కనెక్షన్లను గురించి కూడా తెలుసుకోవచ్చు.
సి. దొంగతనానికి గురైన, పోగొట్టుకున్న మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేయడం కోసం గాని లేదా జాడ కనుక్కోవడం గురించి ఇందులో సౌకర్యం ఉంది.
డి. మొబైల్ హ్యాండ్సెట్ ఎంతవరకు నికార్సయిందీ తెలుసుకోండి.
iii. సైబర్-నేరాలను, ఆర్థిక మోసాలను అడ్డుకోవడానికి టెలికాం వనరుల దుర్వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని ఆసక్తిదారులతో పంచుకోవడానికి డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫారాన్ని (డీఐపీ) తీసుకువచ్చారు. ప్రస్తుతం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ), రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు విభాగాలు, భద్రత సంస్థలు, భారతీయ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ), టీఎస్పీలు వంటివి సమారు 540 సంస్థలు ఈ ప్లాట్ఫారంలో చేరిపోయాయి.
iv. భారత్ నుంచే వచ్చినట్లు కనిపించే భారతీయ మొబైల్ నంబర్లను చూపుతూ వచ్చే అంతర్జాతీయ నకిలీ కాల్స్ను గుర్తించడానికీ, వాటిని ఆపడానికీ ఒక వ్యవస్థను డీఓటీ, టెలికాం సేవల ప్రదాత సంస్థ (టీఎస్పీ)లు రూపొందించాయి. ఇటీవల కొంతకాలంగా నకిలీ డిజిటల్ అరెస్టులు, ఫెడెక్స్ కుంభకోణాలు, కొరియర్లో డ్రగ్స్, మాదకద్రవ్యాలు, తాము ప్రభుత్వ అధికారులమని, పోలీసు అధికారులమని బుకాయించడం, డీఓటీ, టెలికాం నియంత్రణ ప్రాధికరణ సంస్థ అధికారులు మొబైల్ నంబర్లను డిస్కనెక్ట్ చేయడం వగైరా వ్యవహారాల్లో సైబర్ నేరగాళ్లు ఈ తరహా అంతర్జాతీయ బూటకపు కాల్స్ చేస్తుంటారు.
దీనికి అదనంగా, ప్రజలు అన్ని రకాలైన సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయడానికి వీలుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా జాతీయ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ (https://cybercrime.gov.in) ను ప్రారంభించింది.
టెలికమ్యూనికేషన్ సంబంధిత మౌలిక సదుపాయాల భద్రతను దృష్టిలో పెట్టుకొని టెలికమ్యూనికేషన్స్ చట్టం- 2023 సెక్షన్ 22లో భాగంగా టెలికాం సైబర్ సెక్యూరిటీ నిబంధనలతోపాటు కీలక టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూల్స్ను 21.11.2024, 22.11.2024 తేదీల్లో డీఓటీ తెచ్చింది. భారతీయ టెలికాం నెట్వర్క్ కోసమని డీఓటీ మున్ముందు ఎదురుకాగల సైబర్ బెదరింపులను పసిగట్టడానికి ఒక టెలికాం సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ (టీఎస్ఓసీ)ని ఏర్పాటు చేసింది. టెలికమ్యూనికేషన్ల విభాగం పౌరులతో సమన్వయాన్ని నెలకొల్పుకుంటూ, టెలికాంకు సంబంధించిన మోసాలనూ, కుంభకోణాల గురించి సామాజిక మాధ్యమాల ద్వారానూ, తరచుగా పత్రికా ప్రకటనలను జారీ చేస్తుండడం ద్వారానూ వారిలో అవగాహన కల్పిస్తోంది.
కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్ ఈ సమాచారాన్ని ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 2100508)
Visitor Counter : 32