రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
యూరియా ఉత్పత్తికి అయ్యే ఖర్చుతో సంబంధం లేకుండా, చట్టబద్ధంగా నోటిఫై చేసిన గరిష్ఠ చిల్లర ధర (ఎమ్ఆర్పీ)కి యూరియాను రైతులకు అందిస్తున్నాం
45 కిలో గ్రాములతో ఉండే ఒక్కో యూరియా సంచికి సబ్సిడీతో గరిష్ఠ చిల్లర ధర రూ. 242
(వేప పూత పూయడానికకి అయ్యే చార్జీలను, వర్తించే పన్నులను మినహాయించి)
2010 ఏప్రిల్ 1 నుంచి ఫాస్ఫేటిక్ అండ్ పొటాషిక్ (పీ అండ్ కే) ఎరువుల విషయంలో, పోషక పదార్థాల ఆధారిత సబ్సిడీ (ఎన్బీఎస్) విధానం
ఎరువులు, ముడిపదార్థాల అంతర్జాతీయ ధరలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు గమనిస్తోంది
హెచ్చు తగ్గులను ఏడాదికి ఒకసారిగానీ, రెండు సార్లుగానీ పీ అండ్ కే ఎరువుల ఎన్బీఎస్ రేట్ల సమతౌల్యం
Posted On:
29 NOV 2024 4:46PM by PIB Hyderabad
యూరియాను ఉత్పత్తి చేయడానికి అయిన ఖర్చు ఎంత అనే దాంతో సంబంధం లేకుండా చట్టబద్ధంగా ప్రకటించిన గరిష్ఠ చిల్లర ధరలకు (ఎమ్ఆర్పీ) యూరియాను రైతులకు అందిస్తున్నారు. 45 కిలోలుండే ఒక్కో యూరియా సంచికి ఎమ్ఆర్పీ (వేప పూత ఖర్చులు, పన్నులు అదనం) రూ.242 గా ఉంది. పొలం వద్ద అందజేసే యూరియా ధరకు, యూరియా యూనిట్లు మార్కెట్లో రాబట్టుకొనే నికర ధరకు మధ్య ఉన్న తేడాను కేంద్ర ప్రభుత్వం ఆయా యూరియా తయారీదారు సంస్థలకు, లేదా యూరియా దిగుమతిదారు సంస్థలకు సబ్సిడీ రూపంలో ఇస్తున్నది. తదనుగుణంగా, రైతులందరికీ సబ్సిడీ రేట్లకు యూరియాను సరఫరా చేస్తున్నాం.
ఫాస్ఫేటిక్ అండ్ పొటాషిక్ (పీ అండ్ కే) ఎరువుల విషయానికి వస్తే ప్రభుత్వం 2010 ఏప్రిల్ 1 నుంచి పోషక పదార్థాల ఆధారిత సబ్సిడీ (ఎన్బీఎస్) విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలో భాగంగా, రైతులకు ఎరువుల అందుబాటును మెరుగుపరచడానికి, పీ అండ్ కే ఎరువులకు వాటిలో పోషక విలువల ఆధారంగా, అంటే నైట్రోజన్ (ఎన్), ఫాస్పరస్ (పీ), పొటాషియమ్ (కే), సల్ఫర్ (ఎస్) ఎంతెంత ఉన్నదీ అనే అంశాలను బట్టి, సబ్సిడీ తో కూడిన పీ అండ్ కే ఎరువుల మీద ఎరువుల తయారీదారు సంస్థలకు లేదా దిగుమతిదారు సంస్థలకు సంవత్సరంవారీగానో, లేదా సంవత్సరంలో రెండు సార్లో ఒక నిర్దిష్ట మొత్తంలో సబ్సిడీని అందిస్తున్నాం. ప్రభుత్వం ముఖ్య ఎరువులు, ముడిపదార్థాల అంతర్జాతీయ ధరలను గమనిస్తోంది. ఈ ధరలలో ఉండే హెచ్చుతగ్గులను పీ అండ్ కే ఎరువులకు సంవత్సరానికి ఒకసారి గానీ, ఏడాదిలో రెండు సార్లు గానీ ఎన్బీఎస్ రేట్లను ఖరారు చేసే సమయంలో కలిపేస్తున్నాం. దీనికి అదనంగా, భరించగలిగే ధరలలో ఎరువులు రైతులకు అందడానికి అవసరాలను ప్రభుత్వం లెక్కలోకి తీసుకొని, ఎన్బీఎస్ సబ్సిడీ రేట్లకు తోడు డీఏపీకి ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. ఎరువుల ధరలు నిలకడగా ఉండాలనీ, మార్కెట్లో ధరలలో హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తటస్థపరచాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. 2024-25లో ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఏప్రిల్ 1 మొదలు డిసెంబరు 31 మధ్య కాలానికి డీఏపీ వాస్తవిక పీఓఎస్ (పాయింట్స్ ఆఫ్ సేల్) విక్రయాలపై ఎన్బీఎస్ రేట్లకు మించి డీఏపీ పై ఒకసారి వర్తించే ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదాన్ని తెలిపింది. ఈ ప్యాకేజీ పీ అండ్ కే ఎరువుల కంపెనీలకు ఒక్కో ఎమ్టీ కి (మెట్రిక్ టన్నుకు) రూ.3,500 రేటుకు ఇస్తారు. ఈ ప్యాకేజీ తో ఇంచుమించు రూ.2635 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. దీని ఉద్దేశ్యం వ్యవసాయ రంగానికి, ఆ రంగానికి సంబంధించిన కార్యకలాపాలకు మద్దతును ఇచ్చి, దేశంలో ఆహార భద్రత స్థితిని పటిష్ట పరచాలన్నదే. ఈ ప్రకారంగా సబ్సిడీ పథకం అనేది రైతులకు ఎరువులు చౌక ధరల్లో సకాలంలో లభ్యం అయ్యేటట్లు చూడడంపై శ్రద్ధతో రూపొందించింది.
ఎరువులలో ప్రత్యక్ష ప్రయోజన బదలీ (డీబీటీ) వ్యవస్థలో భాగంగా, లబ్ధిదారులకు చిల్లర విక్రేతలు వాస్తవంగా విక్రయించిన వివరాలను ఆధారంగా తీసుకొని 100 శాతం సబ్సిడీని ఎరువుల కంపెనీలకు విడుదల చేస్తున్నాం. సబ్సిడీ దానిని ఉద్దేశించిన లబ్ధిదారు వరకు చేరేటట్లు చూడడానికి, డీబీటీలో, సబ్సిడీ వర్తించే అన్ని ఎరువులను ప్రతి ఒక్క చిల్లర విక్రయ కేంద్రంలో ఏర్పాటు చేసిన పాయింట్స్ ఆఫ్ సేల్ (పీఓఎస్) సాధనాల ద్వారా రైతులకు, కొనుగోలుదారులకు అందిస్తున్నాం. లబ్ధిదారులను గుర్తించడానికి ఆధార్ కార్డు, కేసీసీ, ఓటరు గుర్తింపు కార్డు మొదలైన మాధ్యమాలను ఉపయోగించుకొంటున్నాం.
లోక్ సభలో ఈ రోజు ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారాన్ని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ అందించారు.
***
(Release ID: 2079372)