బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అమృత్ ఔషధాలయాలను నాలుగింటిని ఏర్పాటు చేసిన మొట్టమొదటి బొగ్గు కంపెనీగా పేరు తెచ్చుకొన్న ఎస్ఈసీఎల్

Posted On: 16 OCT 2024 5:00PM by PIB Hyderabad

తక్కువ ధరలకు ఆరోగ్య సంరక్షణ సేవలను అందరి చెంతకు చేర్చే దిశ లో సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్ స్ లిమిటెడ్ (ఎస్ఈసీఎల్) దేశంలో 216వ ‘అమృత్’ తరహా ఔషధాలయాన్ని ప్రారంభించింది.  అఫోర్డబుల్ మెడిసిన్స్ అండ్ రిలయబుల్ ఇంప్లాంట్స్ ఫర్ ట్రీట్ మెంట్ (AMRIT)కు క్లుప్తీకరణ యే అమృత్. కోల్ ఇండియా కు ఎస్ఈసీఎల్ అనుబంధ సంస్థ. ఎస్ఈసీఎల్ ఛత్తీస్ గఢ్ లో తన వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. బిలాస్‌ పుర్ లోని ఇందిరా విహార్ కాలనీలో గల ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘అమృత్’ ఫార్మసీ, ఇటువంటి నాలుగు ఔషధాలయాలను నడుపుతున్న మొట్టమొదటి బొగ్గు కంపెనీగా ఎస్ఈసీఎల్ కు గుర్తింపును తెచ్చిపెట్టింది.

 



అమృత్ ఔషధాలయాలు కేంద్ర ఆరోగ్య - కుటుంబ సంక్షేమ శాఖ అమలుపరుస్తున్న ప్రధాన కార్యక్రమాలలో ఒకటి. వీటిని ఆ శాఖ 2015లో మొదలు పెట్టింది.  అనేక రకాల జనరిక్ ఔషధాలను, ప్రాణాలను కాపాడే బ్రాండెడ్ డ్రగ్స్ ను, వైద్య చికిత్సలో భాగంగా ఉపయోగించాలని సూచించే కృత్రిమ అవయవాలను, శస్త్రచికిత్సలలో ఉపయోగించే సాధనాలను అమృత్ ఔషధాలయాలు చాలా తగ్గింపు ధరలలో అందిస్తున్నాయి.  ఎస్ఈసీఎల్ చేపట్టిన తాజా చర్య ఆసుపత్రిలో చేరి వైద్యాన్ని అందుకోవలసిన రోగులకు, ఆసుపత్రిలో చేరే అవసరం ఉండని వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండు రకాల రోగులలోనూ ఎస్ఈసీఎల్ ఉద్యోగులే కాక సాధారణ ప్రజానీకం కూడా, ప్రత్యేకించి బొగ్గు నిక్షేపాలు ఉన్న ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులు, పల్లెప్రాంతాల వారు..ప్రయోజనం పొందవచ్చు.  ఇంతవరకు మందుల అందుబాటుకు నోచుకోని సముదాయాల వారి ఈ కోవకు చెందిన ఔషధాలయాల విస్తరణ వల్ల మేలు చేకూరుతుంది.

అభివృద్ధి ఫలాలను అందరి చెంతకు చేర్చాలన్న కంపెనీ నిబద్ధతను గురించి ఎస్ఈసీఎల్, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎమ్‌డీ) డాక్టర్ ప్రేమ్ సాగర్ మిశ్రా ప్రత్యేకంగా వివరిస్తూ, ‘‘మా నాలుగో అమృత్ ఫార్మాసీని ఇప్పుడు తెరచి ఆరోగ్య సంరక్షణ సంబంధిత సేవలను ఒక్క మా సంస్థ ఉద్యోగులకే అని కాకుండా, మరింత మందికి కూడా సమకూర్చనున్నాం అని చెప్పడానికి మేం గర్వపడుతున్నాం.  ఇది ఈ సంవత్సరంలో ఆరంభించిన ‘‘ప్రత్యేక ప్రచార ఉద్యమం 4.0’’ లో భాగంగా తీసుకున్న కీలక ప్రాధాన్య అంశాల్లో ఒకటైన ‘అన్ని వర్గాల వారి వద్దకు సేవలు’ అనే అంశం తో తులతూగేదిగా ఉంది’’ అన్నారు.

ఖాళీ జాగాను శుభ్రపరచి, వినియోగంలోకి తీసుకు వచ్చి ఈ ఔషధాలయాన్ని ఏర్పాటు చేశారు.  అలాగే, ఆరోగ్య కేంద్రం ‘ప్రత్యేక ప్రచార ఉద్యమం 4.0’ లో అవలంభిస్తున్న ఉత్తమ విధానాలకు ఒక ఉదాహరణగా నిలుస్తోంది.

కోర్బా జిల్లాలోని గేవ్ రా (సీజీ), మధ్య ప్రదేశ్ లోని శహ్ డోల్ జిల్లాలో గల సోహగ్‌పుర్, మహేంద్రగఢ్-చిరిమిరి-భరత్‌ పుర్ జిల్లా లోని చిరిమిరి (సీజీ)లలోని మరో మూడు ఔషధాలయాలను కలుపుకొని ఈ నాలుగో ఔషధాలయంలోనూ సాధారణ మందులకు తోడు కేన్సర్, హృదయనాళికా వ్యాధుల వంటి దీర్ఘకాలిక క్లిష్ట ఆరోగ్య స్థితులలో అవసరమయ్యే మందులు కూడా ఒకే చోటులో అందిస్తున్నారు.  

ఈ ఔషధాలయాల నిర్వహణ ద్వారా ఎస్ఈసీఎల్ తన సిబ్బందికి మందులను నేరుగా ఇస్తూ, వైద్య సంబంధిత వనరులను ఆలోచనపూర్వకంగా ఉపయోగించడానికి, కంపెనీకి  వైద్య ఖర్చుల తిరిగి చెల్లింపు భారాన్ని తగ్గించడానికి సాయపడుతూనే రోగులకు వాసి గల చికిత్స అందేటట్లు జాగ్రత తీసుకొంటోంది.

 

****



(Release ID: 2065653) Visitor Counter : 11


Read this release in: English , Urdu , Hindi , Tamil