శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఆస్టియోపోరోసిస్ కు దారితీసే ‘మూత్రపిండాలకు సోకే దీర్ఘకాలిక వ్యాధి’ నివారణకు మేలురకం ఔషధం: అభివృద్ధికి కలసి పనిచేయనున్న సిఎస్ఐఆర్ - కేంద్రీయ ఔషధ పరిశోధన సంస్థ-లఖ్ నవూ, జైడస్
నాడు పోస్టు చేయడమైనది:
30 SEP 2024 6:20PM by PIB Hyderabad
ఎముకలు గుల్లబారే వ్యాధి (ఆస్టియో పోరోసిస్)కి, మహిళల్లో మెనోపాజ్ అనంతరం వచ్చే ఆస్టియో పోరోసిస్ కు కారకమయ్యే మూత్రపిండాల సంబంధిత దీర్ఘకాలిక వ్యాధికి చికిత్సలో ఔషధ తయారీకి స్ల్కెరోస్టిన్ అనే ప్రొటీన్ ఉపకరించవచ్చని లఖ్నవూ లోని కేంద్రీయ ఔషధ పరిశోధన సంస్థ (సిడిఆర్ఐ) నిర్వహించిన పరిశోధనలోను, ప్రతిరక్షక (యాంటీబాడీ) ఆధారిత కొన్ని చికిత్సలు కొన్నింటి ద్వారా అందిన సమాచారం ద్వారాను వెల్లడైంది. ఎముకలలో జరిగే జీవక్రియలో అపసవ్యతలు తలెత్తడంలో స్ల్కెరోస్టిన్ ఒక కీలక పాత్రను పోషిస్తున్నట్లుగా అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీఘా కాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రోగులలో, ఆస్టియోపోరోసిస్ తో బాధపడుతున్న వారిలో స్ల్కెరోస్టిన్ స్థాయిలు అధికంగా ఉండడాన్ని గమనించారు.
స్ల్కెరోస్టిన్ తాలూకు చిన్న అణు అవరోధకాలను అన్వేషించాలన్న ఉద్దేశంతో నోటితో తీసుకోదగిన ఔషధాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రీయ ఔషధ పరిశోధన సంస్థ (సిడిఆర్ఐ), అహ్మదాబాద్ చెందిన జైడస్ లైఫ్సైన్సెస్ సంస్థలు సహకారాత్మక పరిశోధన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా సిడిఆర్ఐ, జైడస్ లు కలసికట్టుగా వైద్యశాల స్థాయికి పూర్వం నిర్వహించవలసిన పరిశోధనను చేపడతాయి. ఈ పరిశోధక ప్రయత్నాల ద్వారా లభించే ఏ ఔషధ ఉత్పాదననైనా -మన దేశంలోనూ ఇతర మార్కెట్ లలో విక్రయించడానికి- అభివృద్ధి పరచే చొరవను జైడస్ తీసుకొంటుంది.
మూత్రపిండాలకు సోకుతున్న దీర్ఘకాలిక వ్యాధి (సికెడి) వల్ల బాధపడుతున్న వారు ప్రపంచంలో ప్రతి వంద మందిలోను పది మంది కి పైగానే ఉంటున్నారు. ఎముకలు బోలుగా మారడం, ఎముకలు విరిగిపోవడం, ఖనిజాలను జీర్ణింపచేసుకోవడంలో సమస్యలు ఎదురుకావడం వంటి బెడదలకు సికెడి కారణమవుతోంది. 65 ఏళ్ళ వయస్సు దాటిన వ్యక్తులు, మరీ ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఈ బెడద బారిన పడుతున్నారు. ఎముకలు గుల్లబారకుండా చూసేందుకు వాడే మందులలో చాలా వరకు మందులు సికెడి కి గురైన వ్యాధిగ్రస్తులలో హానికర పరిణామాలను కలుగజేస్తున్నాయి. మూత్రనాళ సంబంధిత ఇబ్బందులు ఎదురవుతూ ఉండడమే దీనికి కారణం. ఈ కారణంగా ఆస్టియోపోరోసిస్ చికిత్స కు సురక్షిత, ప్రభావశీల ఔషధాలను అభివృద్ధి పరచవలసిన తక్షణావసరం తలెత్తింది. అయితే, ఈ క్రమంలో మూత్ర సంబంధిత విధులు సజావుగా సాగేటట్లు చూడటం కూడా ప్రధానం.
సిఎస్ఐఆర్- సిడిఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ రాధ రంగరాజన్ కొత్త భాగస్వామ్యాన్ని గురించి వివరిస్తూ, ‘‘ఎముకలకు సంబంధించిన జీవక్రియల విభాగంలో డాక్టర్ నైవేద్య చటోపాధ్యాయ్ మార్గదర్శకత్వంలో సిఎస్ఐఆర్- సిడిఆర్ఐ విస్తృతంగా కృషి చేసింది’’ అన్నారు. దేశంలో వైద్యం పరంగా ఇంతవరకు పరిష్కారాలు లభించనటువంటి సమస్యలకు కొత్త కొత్త చికిత్స పద్ధతులను కనుగొనాలన్న ఉమ్మడి ఆశయంతో తమ రెండు సంస్థల ప్రావీణ్యం, శక్తియుక్తులు జత పడడం ఈ భాగస్వామ్యాన్ని ఫలప్రదం చేయగలుగుతుందని కూడా ఆమె అన్నారు.
జైడస్ లైఫ్సైన్సెస్ చైర్మన్ శ్రీ పంకజ్ పటేల్ మాట్లాడుతూ, ‘‘బయోమెడికల్ రిసర్చ్ రంగంలో సిఎస్ఐఆర్-సిడిఆర్ఐ కి ఉన్న అపార నైపుణ్యానికి జైడస్ అనుసరిస్తున్న వినూత్న ఔషధ అన్వేణ విధానం జట్టు కట్టడంతో ఒక శక్తిమంతమైన మేలు కలయికకు తలుపులు తెరచుకోనున్నాయి’’ అన్నారు. రెండు సంస్థలు ముందడుగు వేస్తూ, ఎముకల జీవక్రియ సంబంధిత అపసవ్యతల చికిత్సకు కొత్త దారులను వెతుకుతాయి, దీనితో సికెడి తో యాతన పడుతున్న రోగులకు వారి జీవన నాణ్యతను మెరుగు పరచగల సమర్థమైన, చౌకైన చికిత్స పద్ధతులు అందుబాటు లోకి వచ్చేందుకు వీలు ఉంటుందని ఆయన అన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2060710)
సందర్శకుల సూచీ సంఖ్య : : 116