రక్షణ మంత్రిత్వ శాఖ
ఆర్మీ క్రీడల చర్చా వేదికను నిర్వహించిన భారత సైన్యం
Posted On:
30 SEP 2024 6:18PM by PIB Hyderabad
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “ఆర్మీ క్రీడల చర్చా వేదిక (ఆర్మీ స్పోర్ట్స్ కాంక్లేవ్)” ఈరోజు భారత సైన్యం నిర్వహించింది. భారత క్రీడా రంగంలో మన దేశ సైన్యం కీలక పాత్రను ఈ సమావేశం ప్రధానంగా ప్రస్తావించింది. 2036 ఒలింపిక్స్ కోసం ఆతిథ్యం ఇవ్వాలనే భారత్ లక్ష్యం సాకారమయ్యే క్రమంలో ఈ ఆర్మీ క్రీడల సదస్సు మన ప్రయత్నాలను ఏకీకృతం చేస్తూ, ఈ జాతీయ లక్ష్యానికి తోడ్పాటునందించేందుకు కీలక వేదికగా నిలిచింది. వివిధ జాతీయ వాటాదారుల సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారించిన ఈ చర్చావేదిక- ప్రపంచ క్రీడా ఆకాంక్షలను మెరుగుపరచడం కోసం ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) అలాగే నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లతో సమష్టి వ్యూహాలను రూపొందించాల్సిన ప్రాధాన్యాన్ని గుర్తు చేసింది.
భారత సాయుధ దళాలు ఎంతోకాలంగా క్రీడల్లో, ముఖ్యంగా ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పోటీల్లో మన దేశ విజయాలకు తోడ్పాటునందిస్తున్నారు. జాతీయతా భావం, ఫిట్నెస్ అలాగే అంతర్జాతీయ ప్రతిష్ఠను పెంపొందించడంలో క్రీడల పాత్రను గుర్తించిన సాయుధ దళాలు క్రీడాకారుల శిక్షణ కోసం నిరంతరం పెట్టుబడులు పెడుతున్నాయి. భారత సైన్యంలో మిషన్ ఒలింపిక్స్ వింగ్ 2001లో స్థాపించారు. దీని కింద మొత్తం 9000 మంది క్రీడాకారులు 28 విభిన్న క్రీడా విభాగాల్లో శిక్షణ పొందుతున్నారు. సాయ్ సహకారంతో, దేశవ్యాప్తంగా మొత్తం 18 క్రీడా సంస్థలను పురుషుల కోసం అలాగే రెండు క్రీడా సంస్థలను మహిళల కోసం ఏర్పాటు చేసి, చిన్న వయస్సు నుండే (09 నుంచి 16 సంవత్సరాలు) వారిలో ప్రతిభను పెంపొందిస్తున్నాయి. అదనంగా, పారాలింపిక్ క్రీడల కోసం దివ్యాంగులైన సైనికులను సన్నద్ధం చేయడానికి, వారికి తగిన శిక్షణ ఇవ్వడానికి పారాలింపిక్ విభాగం కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన, సమగ్రమైన శిక్షణ విధానాలతో, మౌలిక సదుపాయాల కల్పనతో, ప్రపంచ వేదికలపై సత్తాచాటిన అనేక మంది క్రీడాకారుల కెరీర్ కోసం భారత సైన్యం అండగా నిలుస్తోంది.
కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలు, క్రీడాశాఖల మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ, రాజస్తాన్ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య, యువజన వ్యవహారాల మంత్రి కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (అతి విశిష్ట సేవా మెడల్ గ్రహీత (రిటైర్డ్), ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మంత్రి కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేపడుతున్న ‘ఖేలో ఇండియా’ వంటి కీలక కార్యక్రమాలను ప్రధానంగా ప్రస్తావించారు. 2036 నాటికి భారత్ అత్యధిక ఒలింపిక్స్ పతకాలను సాధించాలనే లక్ష్యాన్ని వివరించిన ఆయన, క్రీడల కోసం సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడంలో భారత సైన్యం సహకారాన్ని ప్రశంసించిన ఆయన, దేశంలోనే అత్యధిక పతకాలు గెలుచుకున్న సంస్థగా భారత సైన్యం నిలిచిందని పేర్కొన్నారు.
ఈ సదస్సు ప్రారంభ సందర్భంగా డాక్టర్ మాన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ, భారత క్రీడా రంగానికి సైన్యం అందించిన తోడ్పాటును ప్రశంసించారు. దేశవ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించేందుకు సంబంధిత సంస్థల సమష్టి కృషి ఆవశ్యకతను ఆయన స్పష్టం చేశారు. ఒలింపిక్స్లో విజయం కోసం సమగ్రమైన ప్రణాళికను రూపొందించాలని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు. అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ప్రతిభను పెంపొందించడానికి స్వల్పకాలిక పంచవర్ష ప్రణాళికలు అలాగే దీర్ఘకాలిక 25 సంవత్సరాల వ్యూహాలు రెండింటినీ సిద్ధం చేయాలన్నారు.
ఈ సమావేశంలో అంజు బాబీ జార్జ్, మేరీ కోమ్, తరుణ్దీప్ రాయ్ వంటి ప్రముఖ మాజీ అథ్లెట్లు, ఒలింపియన్లు వారి అవగాహనను పంచుకున్నారు. వారి వ్యక్తిగత అనుభవాలు, అవగాహన ఆధారంగా అత్యున్నత స్థాయి క్రీడల్లో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలను వివరించారు. అట్టడుగు స్థాయి నుంచి స్పోర్ట్స్ సైన్స్ను అమలు చేయాలని, విశ్రాంత ఆటగాళ్ల ప్రతిభను వినియోగించుకోవడం, అలాగే 2036 ఒలింపిక్స్లో పాల్గొనాలని ఆకాంక్షించే అథ్లెట్ల శారీరక, మానసిక సన్నద్ధతను సమీకృతం చేస్తూ భారత క్రీడల కోసం బహుముఖ విధానం ఏర్పాటు గురించి ఈ సమావేశంలో చర్చించారు.
భవిష్యత్ ఒలింపిక్స్పై దృష్టి సారించి, ప్రావీణ్యాన్ని సాధించేందుకు సాంకేతిక ప్రమాణాలను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేయడంతో పాటు భారత క్రీడా సామర్థ్యాన్ని ఉపయోగించే వ్యూహాలను సమావేశం అన్వేషించింది. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, భారత సైన్యం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అలాగే ఇతర ఆసక్తిదారులు అభిప్రాయాలను పంచుకున్నారు. దీనివల్ల ఒలింపిక్స్ కోసం సమగ్ర ప్రణాళిక రూపకల్పన చేసేందుకు అవకాశం ఏర్పడింది. ఈ చర్చలు ప్రపంచ వేదికపై భారత విజయానికి అవసరమైన కార్యాచరణ చర్యలకు నాందిగా నిలిచాయి.
***
(Release ID: 2060482)
Visitor Counter : 9