శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
బ్రిటీష్ కౌన్సిల్ సహకారంతో ‘విమెన్ ఇన్ స్పేస్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన శాస్త్ర సాంకేతిక విభాగం
Posted On:
25 SEP 2024 1:29PM by PIB Hyderabad
భారత్-బ్రిటన్ ఉమ్మడి విద్యా పరిశోధనా కార్యక్రమం (యూకేఐఈఆర్ఐ)’లో భాగంగా, ఈ నెల 24న ‘విమెన్ ఇన్ స్పేస్ లీడర్షిప్’ కార్యక్రమాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం (డీఎస్టీ), బ్రిటిష్ కౌన్సిల్ సహకారంతో ప్రారంభించింది.
ఖగోళశాస్త్ర రంగంలో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకూ, వారికి సమాన భాగస్వామ్యాన్ని అందించేందుకూ అనువైన వ్యూహాత్మక నాయకత్వ వ్యవస్థను ఏర్పరచడంపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది. ఈ దిశగా వివిధ సంస్థలకు బ్రిటీష్ కౌన్సిల్ సహకారాన్ని అందిస్తుంది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు కోవెంట్రీ విశ్వవిద్యాలయం కూడా సహకరిస్తోంది.
“ఖగోళశాస్త్ర రంగంలో పురుషులతో పాటు స్త్రీలకు సమానత్వాన్ని కల్పించాలన్నది ఈ పథకం ముఖ్యోద్దేశంగా ఉంది. పటిష్ఠమైన నాయకత్వ పద్ధతులను నెలకొల్పడం ద్వారా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధన, సృజనాత్మకతల్లో తమ వంతు పాత్ర పోషించేందుకు మహిళలకు అవకాశం లభిస్తుంది” అని డీఎస్టీ ‘హెడ్ ఆఫ్ విమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్-కిరణ్’ విభాగాధిపతి డాక్టర్ వందనా సింగ్ పేర్కొన్నారు.
బ్రిటీష్ కౌన్సిల్ భారత శాఖ డిప్యూటీ డైరెక్టర్ మైఖేల్ హోల్గేట్ మాట్లాడుతూ... ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పరస్పర సహకారం అవసరమని చెబుతూ, శాస్త్ర, సాంకేతిక, ఇంజనీరింగ్, గణితశాస్త్ర రంగాల్లో మహిళల పాత్ర పెరగవలసిన అవసరముందని చెప్పారు.
సంస్కృతిని కేవలం ప్రతిబింబించడం వరకే కాక, దానిని మార్చగలిగే శక్తిగల మహిళల గురించి ఆన్వేషించాలని బ్రిటన్ కోవెంట్రీ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఎలెనా గౌరా అభిప్రాయపడ్డారు. పరిశోధనా రంగం ప్రారంభ దశలో సేవలందిస్తున్న 250 మందిని ఎంపిక చేసి, వారిలో నాయకత్వ లక్షణాలను పాదుకొల్పడం, లింగ వివక్షను ఎదుర్కొనే పద్ధతుల పట్ల అవగాహన కల్పించి, మద్దతు బృందాన్ని ఏర్పరచడం కార్యక్రమం లక్ష్యం.
భారత ఖగోళరంగ సంస్థ ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్’ డైరెక్టర్, ప్రొఫెసర్ అన్నపూర్ణి సుబ్రహ్మణియం ప్రసంగిస్తూ... ఇంజనీరింగ్, సామాజిక శాస్త్రం సహా అనేక రంగాలకు విస్తరిస్తున్న అంతరిక్ష రంగంలోకి మహిళలు తొలిదశలోనే అడుగుపెట్టాలని సూచించారు.
ఖగోళశాస్త్ర రంగంలో మహిళలకు సమానావకాశాలను కల్పించేందుకు అనుసరించదగ్గ జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవకాశాలను విద్యావేత్తలు, విధానకర్తలతో కూడిన ప్రతినిధులు, ఇందుకోసం ఏర్పాటు చేసిన కార్యశాలలో చర్చించారు.
ఆస్ట్రోఫిజిక్స్, టెలీ కమ్యూనికేషన్ల వంటి కీలక రంగాల్లో స్త్రీపురుష సమానత్వాన్ని నెలకొల్పడం ద్వారా ఆయా రంగాల్లో సృజనాత్మకను పెంచడం, అవసరమైన బోధనా వ్యవస్థలను నెలకొల్పడం ఈ కార్యక్రమ లక్ష్యాలుగా ఉన్నాయి.
***
(Release ID: 2059283)