ప్రధాన మంత్రి కార్యాలయం
సెప్టెంబర్ 20న మహారాష్ట్రలో పర్యటించనున్న ప్రధాని
జాతీయ స్థాయి పీఎం విశ్వకర్మ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని
అమరావతిలో పీఎం మిత్ర పార్కుకు శంకుస్థాపన చేయనున్న మోదీ
ఆచార్య చాణక్య కౌసల్య వికాస్, పుణ్యశ్లోక్ అహల్యాబాయి హోల్కర్ ఉమెన్ స్టార్టప్ పథకాలను ప్రారంభించనున్న మోదీ
प्रविष्टि तिथि:
18 SEP 2024 7:59PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 20న మహారాష్ట్ర వార్ధాలో పర్యటించనున్నారు. పీఎం విశ్వకర్మ పథకం ప్రారంభమై ఏడాది అవుతోన్న సందర్భంగా నిర్వహిస్తోన్న జాతీయ స్థాయి కార్యక్రమంలో ఉదయం 11.30 గంటలకు పాల్గొంటారు.
ఈ కార్యక్రమంలో విశ్వకర్మలకు ధ్రువపత్రాలనూ, రుణాలనూ అందించనున్నారు. పీఎం విశ్వకర్మ కింద చేతివృత్తుల వారికి అందుతోన్న సహయాన్ని సూచించే విధంగా 18 రకాల వృత్తులు చేసే 18 మంది లబ్ధిదారులకు రుణాలను పంపిణీ చేయనున్నారు. విశ్వకర్మల వారసత్వానికీ, సమాజానికీ వారు అందించిన సేవలకు గుర్తుగా, విశ్వకర్మ పథకం వార్షికోత్సవానికి చిహ్నంగా- స్మారక స్టాంపును ఆయన విడుదల చేయనున్నారు.
మహారాష్ట్రలోని అమరావతిలో పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్స్ అండ్ అపెరల్ (పీఎం మిత్ర) పార్కుకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. 1000 ఎకరాల్లో ఉన్న ఈ పార్కును రాష్ట్ర ప్రభుత్వ అమలు సంస్థగా (ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ) ఉన్న మహారాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఎంఐడీసీ) అభివృద్ధి చేస్తోంది. టెక్స్టైల్ పరిశ్రమ కోసం 7 పీఎం మిత్ర పార్కుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జౌళి రంగంలో తయారీ, ఎగుమతులకు భారత్ను ప్రపంచ కేంద్రంగా మార్చాలన్న దార్శనికతను సాకారం చేయడంలో పీఎం మిత్రా పార్కులు ఒక ప్రధాన ముందడుగుగా చెప్పుకోవచ్చు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో సహా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే ప్రపంచస్థాయి పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనకు.. ఈ రంగంలో ఆవిష్కరణలు, ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించడానికి ఇవి దోహదపడుతాయి.
ప్రధాన మంత్రి మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న "ఆచార్య చాణక్య నైపుణ్యాభివృద్ధి కేంద్రం" పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద 15 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న యువతకు శిక్షణ ఇచ్చి, వారు స్వయం సమృద్ధి సాధించి, వివిధ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన కళాశాలల్లో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏటా 1,50,000 మంది యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ అందించనున్నారు.
పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ ఉమెన్ స్టార్టప్ పథకాన్ని కూడా ప్రధాని ప్రారంభిస్తారు. ఈ పథకం కింద మహారాష్ట్రలోని మహిళల నేతృత్వంలోని అంకురాలకు ప్రారంభ దశ మద్దతు లభిస్తుంది. 25 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ పథకం కింద మొత్తం నిధుల్లో 25 శాతం వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కేటాయిస్తారు. మహిళల నేతృత్వంలోని అంకురాలు స్వయం సమృద్ధిగా, స్వతంత్రంగా మారటానికి ఈ పథకం దోహదపడనుంది.
****
(रिलीज़ आईडी: 2056560)
आगंतुक पटल : 95
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam