జల శక్తి మంత్రిత్వ శాఖ
గంగానది పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడం, కాలుష్యాన్ని తగ్గించడానికి కీలకమైన 9 ప్రాజెక్టుల ఆమోదం
Posted On:
30 AUG 2024 5:13PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్ఎంసీజీ) 56వ కార్యనిర్వహక సమావేశంలో రూ.265 కోట్ల విలువ చేసే తొమ్మిది ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఆమోదించిన ప్రాజెక్టులు నది పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడంలోనూ, గంగా నదిలో కాలుష్య స్థాయిని తగ్గించేందుకూ ఉపకరిస్తాయి. తద్వారా దాని పరిశుభ్రతను కాపాడుతూ, నదిని పరిరక్షిస్తాయి. ఈ సమావేశానికి ఎన్ఎంసీజీ డైరెక్టర్ జనరల్ శ్రీ రాజీవ్ కుమార్ మిట్టల్ అధ్యక్షత వహించారు.
గంగానది కాలుష్య నివారణ కోసం ఉత్తరప్రదేశ్ లోని దాల్మౌ, రాయ్ బరేలీ వద్ద మానవ విసర్జిత మురుగును నిరోధించే కీలకమైన ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రోజుకు 8 కిలో లీటర్ల మానవ విసర్జిత మురుగు నిర్వహణ కోసం ఒక ట్రీట్మెంట్ ప్లాంట్తో పాటు 15 కిలోవాట్ల సోలార్ పవర్ ప్లాంట్, ఒక సోలార్ ఇన్వర్టర్ను ఏర్పాటు చేయనున్నారు. డీబీవోటీ మోడల్ ఆధారంగా రూ.4.40 కోట్ల వ్యయంతో ఐదేళ్ల కాలపరిమితితో ప్రాజెక్టు నిర్వహణ వ్యవహారాలకు ఆమోదం తెలిపింది.
ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ జిల్లా గులావోతి పట్టణంలో మురుగునీటి పారుదల ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. ఉత్తరప్రదేశ్లోని ఎనిమిది జిల్లాల గుండా ప్రవహించే గంగా నది ఉపనది అయిన తూర్పు కాళీ నదిలో కాలుష్యాన్ని నివారించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. రూ.50.98 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైన ఈ ప్రాజెక్టును 10 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన మురుగు కాలువలు, మురుగునీటి శుద్ధి పనులను 15 ఏళ్లపాటు నిర్వహించడం కోసం అనుసంధానం చేయనున్నారు.
2025 లో జరగనున్న మహా కుంభమేళా సందర్భంగా, గంగానది, పర్యావరణంపై అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా ప్రయాగ్ రాజ్ లో రూ.1.80 కోట్ల వ్యయంతో అర్థ్ గంగా సెంటర్, రైల్వేస్టేషన్ ఛోకీ బ్రాండింగ్ కు అనుమతి ఇచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, ఉపాధి అవకాశాల సృష్టి, గంగా పరీవాహక ప్రాంతంలోని మహిళా స్వయం సహాయక బృందాలకు మద్దతు ఇవ్వడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం.
అదనంగా, ఎగువ గోమతి నదీ పరీవాహక ప్రాంతంలో దిగువకు ప్రవహించే ప్రవాహాలు, ఉపనదులను పునరుద్ధరించేందుకు ప్రణాళికను ప్రకృతి ఆధారిత పరిష్కారాలకు కార్యనిర్వాహక కమిటీ ఆమోదించింది. లక్నోలోని బాబాసాహెబ్ భీంరావ్ అంబేడ్కర్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు రూ.81.09 లక్షల వ్యయంతో గంగా నదిని మెరుగుపరచడానికి ప్రకృతి ఆధారిత పరిష్కారాల ద్వారా ఎగువ గోమతి నదీ పరీవాహక ప్రాంతంలోని దిగువ శ్రేణి ప్రవాహాలు, ఉపనదుల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇస్తుంది.
నమామి గంగే మిషన్ కింద ఒక ముఖ్యమైన దశ, పశ్చిమ బెంగాల్ లోని కోల్కతాలోని బెలియాఘాటా సర్క్యులర్ కెనాల్ ఒడ్డున (తూర్పు, పశ్చిమ) కొత్త పెన్స్టాక్ గేట్ల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న గేట్ల పునరుద్ధరణ ప్రాజెక్టుకు ఆమోదం. డీబీవోటీ విధానంలో నిర్మించే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.7.11 కోట్లు. నిర్వహణ వ్యవహారాల ఖర్చును కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ భరిస్తుంది.
జార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ లో ఉన్న ఉద్వా సరస్సు పక్షుల అభయారణ్యం పరిరక్షణ, సుస్థిర నిర్వహణ కోసం రూ.25.89 కోట్ల వ్యయంతో ఐదేళ్ల కాలానికి సమీకృత నిర్వహణ ప్రణాళిక (ఐఎంపీ)కు ఆమోదం తెలిపింది.
పశ్చిమ బెంగాల్లోని శాంతిపూర్, గరులియా, చక్ధా మున్సిపాలిటీల్లో ప్రపంచ బ్యాంకు నిధులతో పీబీఐజీ కింద విద్యుత్ శ్మశానవాటికల పునరుద్ధరణ ప్రతిపాదనకు కార్యనిర్వాహక కమిటీ ఆమోదం తెలిపింది. డీబీవోటీ విధానంలో రూ.2.89 కోట్ల అంచనా వ్యయంతో ఐదేళ్ల పాటు నిర్వహణ కూడా చేపడతారు.
రూ.522.85 కోట్లతో 30 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన ఎస్టీపీ, 175 కిలోమీటర్ల పొడవైన మురుగునీటి పారుదల నెట్వర్క్ తో ముంగేర్ సీవరేజ్ నెట్వర్క్, ఎస్టీపీ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు డీబీవోటీ విధానంలో ఉండగా, దీని నిర్వహణ 15 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ అవుతుంది.
ఐఐటీ (బీహెచ్యూ) ఆధ్వర్యంలో వారణాసిలో స్మార్ట్ ల్యాబొరేటరీ ఆన్ క్లీన్ రివర్స్ కోసం సచివాలయ ఏర్పాటుకు కమిటీ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అన్ని చిన్న నదులను పునరుజ్జీవనాన్ని ఇవ్వడానికి ప్రపంచ నిపుణులను వినియోగించడం, సుస్థిర పద్ధతులను అవలంబించడం ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఉద్దేశం. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ, సమాజం మధ్య సరైన సమతుల్యతను ఇది సృష్టిస్తుంది.
***
(Release ID: 2050515)
Visitor Counter : 74