రాష్ట్రపతి సచివాలయం
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన విదేశాంగ శాఖ ట్రైనీ అధికారులు
నాడు పోస్టు చేయడమైనది:
19 AUG 2024 6:00PM by PIB Hyderabad
భారత విదేశాంగ శాఖకు చెందిన ట్రైనీ అధికారులు (2023 బ్యాచ్), 2024 ఆగస్టు 19న రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి నిలయంలో కలుసుకున్నారు.
తనను కలుసుకున్న అధికారులనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ- విదేశాంగ విధానం అర్థంకాని గందరగోళమూ కాదు...అలాగని ఉన్నత వ్యక్తుల వ్యాపకమూ కాదు అని వ్యాఖ్యానించారు. ఇది దేశీయ విధానాలకు కొనసాగింపు అని చెబుతూ, దేశ రాజకీయ, ఆర్ధిక, భద్రతా ప్రయోజనాలు, ప్రాదేశిక సమగ్రతను సాధించేందుకు ఉద్దేశించినదని అన్నారు. అందువల్ల మనదేశ ప్రయోజనాల పరిరక్షణ మాత్రమే కాకుండా, 2047 నాటికి వికసిత్ భారత్ వ్యూహాత్మక లక్ష్యాన్ని సాధించేందుకు అంతర్జాతీయ అజెండాకు రూపకల్పన చేయాల్సిన బాధ్యత కూడా భారత విదేశాంగ శాఖ అధికారులపై ఉందని రాష్ట్రపతి అన్నారు.
ఐఎఫ్ఎస్ అధికారులు తాము కేవలం భారత ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని కాక,1.4 కోట్ల మంది భారతీయలకు, వారి ఆశలు, ఆకాంక్షలకు ప్రతినిధులుగా ఉన్నామని గుర్తుంచుకోవాలన్నారు. విదేశాంగ శాఖ అధికారులు తాము అయిదు వేల సంవత్సరాల పురాతన ఘన నాగరికతకు, వైవిధ్యతతో కూడిన, బహుళ సంస్కృతికీ , ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ప్రస్తుత ప్రపంచంలో- మంచికీ, సుస్థిరతకీ ఒక బలమైన శక్తిగా ఉన్న సమాజానికీ తాము ప్రాతినిధ్యం వహిస్తున్నామని గుర్తించాలన్నారు. ఇది వారిలో ప్రతి ఒక్కరిపై బృహత్తర బాధ్యతను ఉంచుతుందని రాష్ట్రపతి అన్నారు.
మంచి దౌత్యవేత్త కావాలంటే అందుకు నిర్దిష్టమైన నైపుణ్యాలు అవసరమని అంటూ, వారికి మంచి భావ ప్రసార నైపుణ్యం ఉండాలని, వ్యూహాత్మక ఆలోచనాపరులు కావాలని రాష్ట్రపతి అన్నారు. భారతదేశంతోపాటు, ఆతిథ్య దేశపు రాజకీయ, సాంస్కృతిక అంశాలపైన లోతైన అవగాహన ఉండాలన్నారు. శిక్షణలో ఉన్న అధికారులు తొలి పోస్టింగ్ గా విదేశాలకు వెళ్లి, ఆయా విదేశీ భాషల శిక్షణకు వెళతారని, వీలైనన్ని ఎక్కువ భాషలు నేర్చుకోవలసిందిగా రాష్ట్రపతి వారికి సూచించారు. అలాగే కొత్త సంస్కృతులు, అక్కడి ప్రజలతో మమేకం కావండం, సాంకేతికతను అందిపుచ్చుకోవడం చేయాలన్నారు. ఈ నైపుణ్యాలు, వ్యవహార శైలి వారిని ఒక పరిపూర్ణమైన దౌత్యవేత్తగా తీర్చిదిద్దుతాయని ఆమె అన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2046823)
సందర్శకుల సూచీ సంఖ్య : : 98