విద్యుత్తు మంత్రిత్వ శాఖ

మహారాష్ట్రలో పునరుత్పాదక ఇంధన పార్కుల ఏర్పాటుకు 'మహాజెన్‌కో'తో 'ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్' ఒప్పందం

Posted On: 28 FEB 2024 6:20PM by PIB Hyderabad

ఇంధన పరివర్తన దిశగా భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. ఎన్‌టీపీసీ లిమిటెడ్ పూర్తి స్థాయి అనుబంధ సంస్థ అయిన 'ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్' (ఎన్‌జీఈఎల్‌), మహారాష్ట్రలో పునరుత్పాదక ఇంధన పార్కులను ఏర్పాటు చేయడానికి 'మహారాష్ట్ర స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్'తో (మహాజెన్‌కో) జాయింట్ వెంచర్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ జాయింట్‌ వెంచర్‌ కింద, గిగావాట్‌ స్థాయి పునరుత్పాదక ఇంధన పార్కులను దశలవారీగా అభివృద్ధి చేస్తుంది.

28 ఫిబ్రవరి 2024న, న్యూదిల్లీలోని ఎన్‌టీపీసీ ప్రధాన కార్యాలయంలో జాయింట్ వెంచర్ ఒప్పందం కుదిరింది. మహాజెన్‌కో డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) శ్రీ అభయ్ హర్నే - ఎన్‌జీఈఎల్‌ సీజీఎం శ్రీ వి.వి. శివకుమార్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఎన్‌టీపీసీ లిమిటెడ్ సీఎండీ శ్రీ గురుదీప్ సింగ్, మహాజెన్‌కో సీఎండీ డి.పి. అన్బళగన్ సహా రెండు సంస్థల సీనియర్‌ అధికార్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎన్‌టీపీసీ స్థాపిత సామర్థ్యం (జేవీలు, అనుబంధ సంస్థలతో కలిపి) దాదాపు 74 గిగావాట్లు. భారతదేశానికి విద్యుత్‌ సరఫరా చేస్తున్న అది పెద్ద సంస్థ ఇది. పునరుత్పాదక ఇంధనాన్ని పెంచడంలో భాగంగా, "ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్" (ఎన్‌జీఈఎల్‌) ఏర్పాటైంది. హరిత హైడ్రోజన్, శక్తి నిల్వ పరిష్కారాలు సహా పునరుత్పాదక ఇంధన పార్కులు, ప్రాజెక్టులను ఈ అనుబంధ సంస్థ చేపడుతుంది.

2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని ఎన్‌టీపీసీ గ్రూప్ యోచిస్తోంది. ప్రస్తుతం, ఇది 3.4 గిగావాట్లుగా ఉంది. దాదాపు 22 గిగావాట్ల ప్రాజెక్టులు రాబోతున్నాయి. మహారాష్ట్రతో పాటు భారతదేశ కర్బన రహిత లక్ష్యాలకు అనుగుణంగా పని చేయడానికి ఎన్‌టీపీసీ కట్టుబడి ఉంది.

మహాజెన్‌కో స్థాపిత సామర్థ్యం 13,170 మెగావాట్లు. ఇందులో, 9,540 మెగావాట్ల బొగ్గు, 2,580 మెగావాట్ల జల, 672 మెగావాట్ల గ్యాస్, 378 మెగావాట్లు సౌర విద్యుత్‌ కేంద్రాలు ఉన్నాయి.

***



(Release ID: 2010284) Visitor Counter : 48


Read this release in: English , Urdu , Hindi , Marathi