బొగ్గు మంత్రిత్వ శాఖ
2024 జనవరి నాటికి, వార్షిక క్యాపెక్స్ లక్ష్యంలో 95.83% సాధించిన బొగ్గు రంగ పీఎస్యూలు
Posted On:
21 FEB 2024 2:32PM by PIB Hyderabad
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేసేందుకు చురుగ్గా పని చేస్తున్నాయి. ఈ క్రమంలో, క్యాపెక్స్ (మూలధన వ్యయం) లక్ష్యాన్ని చేరడంలో ముందంజలో ఉన్నాయి. బొగ్గు రంగ సీపీఎస్ఈలు గత కొన్ని సంవత్సరాలుగా మూలధన వ్యయ లక్ష్యాన్ని అధిగమిస్తూనే ఉన్నాయి. ఎఫ్వై 2021-22లో, సీఐఎల్ & ఎన్ఐసీఐఎల్ తమ లక్ష్యంలో వరుసగా 104.88% & 123.33% సాధించాయి. ఎఫ్వై 2022-23లోనూ అదే పనితీరు పునరావృతమైంది. ఆ సంవత్సరంలో ఆ రెండు సంస్థలు లక్ష్యంలో దాదాపు 113% సాధించాయి.
2023-24 కోసం బొగ్గు మంత్రిత్వ శాఖ మూలధన వ్యయ లక్ష్యం రూ.21,030 కోట్లు. 2024 జనవరి నాటికి, రూ.20,153 కోట్ల పెట్టుబడులు పూర్తయ్యాయి. వార్షిక లక్ష్యంలో ఇది 95.83%కు సమానం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో, సీఐఎల్ & ఎన్ఐసీఐల్ మరోమారు క్యాపెక్స్ లక్ష్యాన్ని అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరి రెండు నెలల్లో పెద్ద పెట్టుబడులు కార్యరూపం దాల్చడంతో, సీఐఎల్ & ఎన్ఐసీఐల్ రెండు ఈసారి కూడా వార్షిక మూలధన వ్యయ లక్ష్యాలను అధిగమిస్తాయని అంచనా వేస్తున్నారు.
దేశ ఆర్థిక వృద్ధిని నడిపించే కీలకాంశాల్లో మూలధన వ్యయం ఒకటి. ఇది, ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. వినియోగం, డిమాండ్, పారిశ్రామిక వృద్ధిని పెంచుతుంది. ఉపాధి, దీర్ఘకాలిక మౌలిక సదుపాయాలను సృష్టిస్తుంది.
***
(Release ID: 2007756)