వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (దేశీయ) కింద జరిగిన 26వ ఇ-వేలంలో 3.46 లక్షల టన్నుల గోధుమలు, 13,164 టన్నుల బియ్యం విక్రయం
Posted On:
21 DEC 2023 4:34PM by PIB Hyderabad
దేశీయ మార్కెట్లో బియ్యం, గోధుమలు, గోధుమపిండి చిల్లర ధరలను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చొరవలో భాగంగా, గోధుమలు & బియ్యానికి వారానికి ఒకసారి ఇ-వేలం నిర్వహిస్తోంది. 26వ ఇ-వేలాన్ని 20.12.2023న నిర్వహించారు. ఇందులో 4 లక్షల టన్నుల గోధుమలు, 1.93 లక్షల టన్నుల బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ-వేలంలో, 3.46 లక్షల టన్నుల గోధుమలు క్వింటాల్కు సగటున రూ.2,178.24 చొప్పున; 13,164 టన్నుల బియ్యం క్వింటాల్కు సగటున రూ.2,905.40 చొప్పున అమ్ముడయ్యాయి.
20.12.2023 నాటి ఇ-వేలం నుంచి, ఎల్టీ విద్యుత్ కనెక్షన్ ఉన్న బిడ్డర్లకు 50 టన్నుల గోధుమలు, హెచ్టీ విద్యుత్ కనెక్షన్ బిడ్డర్లకు 250 టన్నుల గోధుమలు మాత్రమే అనుమతించారు. ఓఎంఎస్ఎస్ (డి) కింద తీసుకున్న గోధుమలను సదరు బిడ్డర్ అక్రమం నిల్వ చేయకుండా, వాటిని ప్రాసెస్ చేసి బహిరంగ మార్కెట్లోకి విడుదల చేసేలా చూడడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
ఇంకా, 20.12.2023 నాటి ఇ-వేలం నుంచి బిడ్డర్ వేలం వేయగల కనిష్ట-గరిష్ట బియ్యం పరిమాణాన్ని వరుసగా 1 టన్ను - 2,000 టన్నులుగా నిర్ణయించింది. బిడ్డర్లు 1 టన్ను గుణిజాల్లో బియ్యం కోసం వేలం పాడొచ్చు. ఓఎంఎస్ఎస్ (డి) కింద బియ్యం అమ్మకాలను పెంచడానికి ఈ చర్య తీసుకున్నారు. దీనివల్ల, గత వేలంలో విక్రయించిన 3,300 టన్నులతో పోలిస్తే ప్రస్తుత ఇ-వేలంలో విక్రయాలు 13,164 టన్నులకు పెరిగాయి.
***
(Release ID: 1989344)