పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన ‘కార్గో అడ్వైజరీ కమిటీ’ సమావేశం


వాటాదార్ల మధ్య సహకారాన్ని పెంచడానికి చురుకైన విధానంపై హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి

కార్గో పరిశ్రమలో నూతన & ఆధునిక డిజిటల్ పరివర్తనలు రావలసిన అవసరంపై కమిటీ సమావేశంలో చర్చ

Posted On: 20 DEC 2023 12:17PM by PIB Hyderabad

పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన, ఈ నెల 19న, కార్గో అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. కార్గో పరిశ్రమలో పరస్పర సహకారాన్ని పెంచుకోవాల్సిన అవసరంపై కమిటీ చర్చించింది. కార్గో పరిశ్రమ సమస్యలపై వెంటనే స్పందించడానికి భారత ప్రభుత్వం చురుకైన విధానాన్ని అనుసరిస్తోందని, వాటాదార్ల మధ్య సహకారాన్ని పెంచడానికి కృషి చేస్తోందని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పరిశ్రమ సభ్యులకు హామీ ఇచ్చారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ప్రతిస్పందించడానికి మంత్రిత్వ శాఖ - పరిశ్రమ వర్గాల మధ్య సమన్వయం ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు.

ఎయిర్ కార్గోలో ఈ-కేవైసీ, డిజిటల్ షిప్పింగ్ ఇన్‌వాయిస్‌లు వంటి డిజిటల్ మార్పుల అవసరంపైనా కీలక చర్చ జరిగింది. పరిశ్రమ కోసం డిజిటల్ పరివర్తనలను అన్వేషించడానికి, అమలు చేయడానికి ఒక వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి కమిటీకి సూచించారు.

పరిశ్రమ ప్రతినిధులు ప్రస్తావించిన వివిధ పన్ను, కార్యాచరణ సంబంధించి అంశాలపైనా కమిటీలో చర్చ జరిగింది.

దేశ ఆర్థికాభివృద్ధికి విమానయాన రంగం భారీగా తోడ్పడుతుందని ఈ సమావేశంలో నిర్ధరించారు. శక్తిమంతమైన, సమర్థవంతమైన కార్గో వ్యవస్థను రూపొందించడంలో మంత్రిత్వ శాఖ అంకితభావానికి ఈ సమావేశం నిదర్శనంలా నిలిచింది.

ఏఏఐసీఎల్‌ఏఎస్‌, ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌ఏఐ, ఈఐసీఐ, బ్లూడార్ట్ ఏవియేషన్, ఏసీఏఏఐ, అదానీ ఎయిర్‌పోర్ట్స్‌, డీఐఏఎల్‌, ఏసీఎఫ్‌ఐ, డీఏసీఏఏఐ, స్పైస్‌జెట్‌ సహా కార్గో పరిశ్రమ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పౌర విమానయాన కార్యదర్శి శ్రీ ఉమ్లున్మాంగ్ ఉల్నామ్, డీజీసీఎ డీజీ శ్రీ విక్రమ్ దేవదత్, సీనియర్ అధికార్లు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

***



(Release ID: 1988954) Visitor Counter : 68


Read this release in: English , Urdu , Hindi , Tamil